ఉద్దవ్ ఠాక్రే సీఎం కావాలంటే: ఆట మొదలు పెట్టిన కాంగ్రెస్: డిప్యూటీగా పవార్..!
ఎలాగైనా సీఎం పదవి దక్కించుకోవాలనేది శివసేన పట్టుదల. దీని కోసమే అనూహ్యంగా ఎన్సీపీ..కాంగ్రెస్ మద్దతు పొందేందుకు ప్రయత్నలు. వారి డిమాండ్లకు తలొగ్గి ఎన్డీఏ నుండి బయటకు వచ్చింది. అయితే, తమ డిమాండ్లకు తలొగ్గటం మొదలు కావటంతో..ఇప్పుడు కాంగ్రెస్ గేమ్ ప్రారంభించింది. పూర్తి హిందుత్వ పార్టీగా ముద్ర పడిన శివసేనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలంటే.. గతంలో బిజేపీతో ఏ రకంగా అయితే శివసేన షరతులు పెట్టిందో..ఇప్పుడు అదే రకంగా కాంగ్రెస్ కొత్త వ్యూహం తెర మీదకు తెస్తోంది. అందులో భాగంగా అనేక ప్రతిపాదనలు తెర మీదకు వస్తున్నాయి. దీంతో..సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఇదే సమయంలో కేంద్రం..గవర్నర్ జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తోంది.
శివసేన ఎన్సీపీ..కాంగ్రెస్ డిమాండ్ మేరకు ఎన్డీఏ నుండి బయటకు వచ్చింది. గవర్నర్ ఇచ్చిన డెడ్ లైన్ ముగిసే లోగా తాము ప్రభుత్వం ఏర్పాటుకు సిద్దంగా ఉన్న విషయాన్ని నివేదించేందుకు వేగంగా శివసేన నిర్ణయాలు తీసుకుంటోంది. కాంగ్రెస్..ఎన్సీపీ తో కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు శివసేన ప్రయత్నాలు వేగవంతం చేసింది.
దీంతో..కాంగ్రెస్ మాత్రం బయట నుండి మద్దతిస్తారనే వాదన వినిపిస్తోంది. ఇదే సమయంలో ఉద్దవ్ థాక్రే ముఖ్యమంత్రి అవ్వాలంటే..అందుకు తెర మీదకు వచ్చిన ఒక ప్రతిపాదన మేరకు థాక్రేకు సీఎం పదవి..శరద్ పవార్ కు ఉప ముఖ్యమంత్రి పదవి..కాంగ్రెస్ కు స్పీకర్ పదవి ఇవ్వాలనేది ఒక ప్రతిపాదన. శివసేన చేసిన ఈ ప్రతిపాదన పైన ఎన్సీపీ..కాంగ్రెస్ ఎలా రియాక్ట్ అవుతాయనేది ఆసక్తి కరంగా మారింది.
ఇదే సమయంలో..శివసేన..ఎన్సీపీ కలిసి తీసుకొనే నిర్ణయం మేరకు కాంగ్రెస్ నడుచుకొనే పరిస్థితి కనిపిస్తోంది. శివసేన..ఎన్సీపీ రెండు మరాఠా పార్టీలు కావటంతో ఈ రెండు పార్టీలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే కాంగ్రెస్ బయట నుండి మద్దతివ్వటం రెండో ప్రతిపాదన. అయితే, అనుభవం లేని ధాక్రే సీఎం అయితే..పవార్ కు డిప్యూటీ సీఎం ఇవ్వటం సరికాదని ఎన్సీపీ వాదిస్తోంది. దీంతో..కాంగ్రెస్ అధిష్ఠానం 10 గంటలకు సమావేశం కానుంది అందులో మహారాష్ట్రలో జరిగుతున్న పరిణామాల పైనే చర్చించి..నిర్ణయం తీసుకోనున్నారు.
తమ అవసరం శివసేన గుర్తించటంతో..దీనిని తమకు అనుకూలంగా మలచుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. అయితే, ఇతర రాష్ట్రాల మీద..జాతీయ రాజకీయాల మీద ప్రభావం పడకుండా చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. దీంతో.. మహారాష్ట్ర నుండి కాంగ్రెస్ నేతలు కొత్త డిమాండ్ తెర మీదకు తెస్తున్నారు. ఒకవేళ శివసేనతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఆరు కేబినెట్ మంత్రి పదవులు అడగాలని అధిష్ఠానం నిర్ణయించుకున్నట్లు సమాచారం.