తొలిదశలో అదృష్టం పరీక్షించుకుంటున్న అగ్రనేతలు వీరే
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తొలిదశలో 18 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో పోలింగ్ జరుగుతోంది. మొత్తం 91 లోక్సభ నియోజకవర్గాల్లో ఓటర్లు నేతల తలరాతను ఈవీఎంలలో నిక్షిప్తం చేస్తున్నారు. ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్లలో పలువురు కేంద్ర మంత్రులు, వివిధ పార్టీల అగ్రనాయకుల వారసులు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
నలుగురు కేంద్రమంత్రులు
తొలి విడత లోక్సభ ఎన్నికల్లో నలుగురు కేంద్రమంత్రుల భవిష్యత్తును ఓటర్లు నిర్ణయించనున్నారు. వారిలో కేంద్ర రోడ్డు, రవాణ, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో నాగ్పూర్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి బరిలో దిగారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు పోటీ చేస్తున్న అరుణాచల్ వెస్ట్ నియోజకవర్గంలోనూ తొలిదశలోనే పోలింగ్ జరుగుతోంది. అరుణాచల్ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నబమ్ టుకీ ఆయన ప్రత్యర్థిగా బరిలో దిగారు. ఆర్మీ మాజీ చీఫ్, కేంద్ర విదేశాంగ శాఖ సహాయమంత్రి వీకేసింగ్ యూపీ ఘజియాబాద్ నుంచి పోటీ చేస్తుండగా.. ఆయన అదృష్టం కూడా ఈ రోజే ఈవీఎంలో నిక్షిప్తం కానుంది. వీరితో పాటు యూపీ గౌతమ్ బుద్ధనగర్ నుంచి బరిలో దిగిన కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి మహేశ్ శర్మ, మరో మంత్రి సత్యపాల్ సింగ్ బరిలో ఉన్న భాగ్పత్లో ఫస్ట్ ఫేజ్లోనే ఎన్నిక జరగనుంది.
తెలంగాణలో అసదుద్దీన్, కవిత, రేణుక
తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలకు తొలిదశలో పోలింగ్ పూర్తికానుంది. హైదరాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంఐఎం పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ, ఖమ్మం లోక్సభ స్థానం నుంచి మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి ఫస్ట్ ఫేజ్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇక తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు కవిత పోటీ చేస్తున్న నిజామాబాద్ లోక్సభ సీటుకు ఇవాళే పోలింగ్ జరుగుతోంది. ఇక్కడ నుంచి భారీ సంఖ్యలో రైతులు ఎన్నికల బరిలో దిగడంతో దేశం దృష్టిని ఆకర్షించింది.
ప్రధాని రేసులో ఆయన లేరు...సంచలన వ్యాఖ్యలు చేసిన శరద్ పవార్
ఆర్ఎల్డీ అధినేత
ఢిల్లీ అధికారం చేపట్టేందుకు దగ్గరి దారిగా భావించే యూపీలో మొత్తం 8 స్థానాలకు తొలిదశలో ఎన్నిక జరుగుతోంది. రాష్ట్రీయ లోక్ దళ్ నేత అజిత్ సింగ్ పోటీ చేస్తున్న ముజఫర్నగర్ స్థానానికి ఈ దశలోనే పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఆయన మాజీ కేంద్రమంత్రి బీజేపీ నేత సంజీవ్ బల్యాన్ను ఎదుర్కొంటున్నారు.
బీహార్, అసోంలో నేతల వారసులు
బీహార్లో లోక్ జన్శక్తి పార్టీ చీఫ్ రామ్ విలాస్ పాశ్వాన్ వారసుడు చిరాగ్ పాశ్వాన్ మరోసారి బరిలో దిగుతున్న జుమై లోక్సభ స్థానంలో మొదటి దశలో ఎన్నిక పూర్తికానుంది. చిరాగ్ గెలుపు కోసం ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్, బీహార్ సీఎం నితీశ్ కుమార్ తదితరులు క్యాంపెయిన్ నిర్వహించారు. ఇక అసోంలో ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ తనయుడు గౌరవ్ గొగోయ్ బరిలో నిలిచిన కలియాబోర్ నియోజకవర్గంలో తొలి విడతలోనే పోలింగ్ జరుగుతోంది.