మీడియా పై రాజకీయ ప్రభావం..! తెలుగు మీడియా మనుగడపై కమ్ముంకుంటున్న కారుచీకట్లు..!!
హైదరాబాద్ : టీవీ9లో తలెత్తిన విబేధాలతో రెండు తెలుగు రాష్ట్రాల్లో మీడియా మనుగడపై సందేహాలు తలెత్తుతున్నాయి. అయితే ఇది ఎంత వరకూ దారితీస్తుందనేది రేపు కేంద్రంలో, ఏపీలో ఏర్పడబోయే ప్రభుత్వాలతో స్పష్టత వస్తుందని మీడియా అధినేతలు అంచనా వేసుకుంటున్నారు. ఏపీలో టీడీపీ గెలిస్తే.. ఓ విధంగా.. జగన్ సీఎం అయితే మరో విధంగా వాతావరణం ఉంటుందని లెక్కలు కడుతున్నారు. ఎంచక్కా.. అనుకూల ప్రభుత్వం ఉంటే.. యాడ్స్కు డోకా ఉండదు. ఛానళ్లు, పత్రికలను నడిపించేందుకు ఇబ్బంది పడాల్సి ఉండదు. ఏటా ఎలా లేదన్నా.. వెయ్యికోట్లకు పైగా యాడ్స్.. ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభుత్వ సహకారంతో సంపాదించుకోవచ్చు. ఉద్యోగుల జీతాలు, రాబడి ఖర్చులకు ఢోకా ఉండదనే అంచనా వేసుకుంటున్నారు మీడియా అధినేతలు.
సంక్షోభంలో మీడియా రంగం..! పెరుగుతున్న రాజకీయ ఒత్తిడి..!!
మీడియా ఆలోచనలో తప్పుకూడా లేదు. ఎందుకంటే అది కూడా వ్యాపారమే కాబట్టి. 2009 వరకూ మీడియా ఓ పక్షానే కొమ్మకాస్తుందనే ఆరోపణలుండేవి. పత్రికలు, ఛానళ్లు కూడా తమకు ఎవరు సహకరిస్తే.. వారికే జై కొడతామనేంతగా దిగజారేవి. జర్నలిజం విలువలు.. తప్పొప్పుల విచక్ష.. ప్రజల శ్రేయస్సు ఇవన్నీ ఏనాడో అటకెక్కించారు. కొన్ని పత్రికలు, ఛానళ్లు మాత్రం అప్పుడపుడూ లేవు.. ఇంకా బతికే ఉన్నాయంటూ ఊపిరి పోస్తుంటాయి. అయితే సాక్షి రాకతో మీడియా రెండు వర్గాలుగా మారింది.
సామాజిక వర్గాల వారీగా విడిపోతున్న మీడియా..! విచిత్రమైన జాడ్యం..!!
కమ్మ వర్సెస్ రెడ్డి అనేంతగా రెండూ పోటీపడటం మొదలుపెట్టాయి. తెలంగాణలో కేసీఆర్ కనుసన్నల్లో నడిచే నమస్తే తెలంగాణ రాకతో అది మరింత తారాస్థాయికి చేరింది. టీ న్యూస్ కూడా గులాబీ గూటిలో భాగమైంది. కేసీఆర్ తొలిసారి సీఎం అయ్యాక ఆంధ్ర మీడియా కూడా ఆచితూచి అడుగులు వేసింది. ప్రభుత్వ తప్పిదాలను కూడా చూసీచూడనట్లు వదిలేసిందనే అపవాదు మూటగట్టుకుంది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమ ప్రభావంతో చవిచూసిన అనుభవాలతో జాగ్రత్తగా వ్యవహరించాల్సి పరిస్థితి నెలకొనటమే దీనికి ప్రధాన కారణం.
మీడియాకు కూడా ప్రాంతీయత..! యాజమాన్యాలపై తీవ్ర ఒత్తిడి..!!
2018 ముందస్తు ఎన్నికల సమయంలో అప్పటి వరకూ తమలో దాచుకున్న కేసీఆర్పై వ్యతిరేకతను మహాకూటమికి విపరీతమైన ప్రచారం ఇవ్వటం ద్వారా బయటపెట్టుకున్నారు. దీనిపై గులాబీ పెద్దలు గుస్సా కూడా అయ్యారు. ఏపీలో అయితే సాక్షి మాత్రమే వైసీపీ అనుకూల వార్తలు రాస్తే.. మిగిలిన మీడియా అంతా.. మరోసారి జగన్ను అవినీతి ముద్రతో సీఎం పీఠానికి దూరం చేసేందుకు కంకణం కట్టుకున్నాయి. చివరకు సాక్షి మీడియాను టీడీపీ.. ఏబీఎన్, టీవీ5లను వైసీపీ వద్దని చెప్పేంత వరకూ చేరాయి.
మీడియాను శాసిస్తున్న పార్టీలు..! శ్రేయస్కరం కాదంటున్న విశ్లేషకులు..!!
ఇటువంటి తప్పిదాల ఫలితమే టీవీ9లో యాజమాన్య మార్పిడి అనే ప్రచారమూ జోరుగా సాగుతుంది. వ్యవహారంలో ఎక్కడా ప్రత్యక్షంగా ప్రభుత్వ జోక్యం లేకపోయినా అండదండలు అందిస్తుందనేది సుస్పష్టం. మే 23 తరువాత జగన్ సీఎం అయితే.. ఏపీలో మీడియా స్వేచ్చ ఏంటనే చర్చ కూడా జరుగుతోంది. తద్వారా చెలరేగే పర్యవసానాలకు రెడీగా ఉండాలనే సంకేతాలు కూడా వస్తున్నాయి. ఈ లెక్కన చూస్తే.. భవిష్యత్తులో గద్దెనెక్కబోయే ప్రభుత్వాలు మీడియాపై ఇంకెంతగా కక్షపూరితంగా వ్యవహరిస్తాయనే అంశం ఆందోళన కలిగిస్తోంది.