త్వరలో అఖండ భారతావని: నేడు కాశ్మీర్..రేపు పాక్ ఆక్రమిత్ కాశ్మీర్: కేంద్రం చేతుల్లో పరిపాలన
న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్ కు స్వయంత ప్రతిపత్తితో కూడిన రాష్ట్ర హోదాను కల్పించడానికి ఉద్దేశించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ను రద్దు చేయడానికి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సోమవారం రాజ్యసభలో ప్రవేశపెట్టిన తీర్మానంపై చర్చ కొనసాగుతోంది. బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమితో పాటు తటస్థ పార్టీలు బిజూ జనతాదళ్, బహుజన్ సమాజ్ వాది పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి దీనికి మద్దతు పలికాయి.
ఈ సందర్భంగా శివసేన సభ్యుడు సంజయ్ రౌత్ సభలో ఆసక్తికరమైన చర్చకు తెర తీశారు. జమ్మూ కాశ్మీర్ పై కీలక నిర్ణయాన్ని తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. త్వరలో బలూచిస్తాన్, పాక్ ఆక్రమిత్ కాశ్మీర్ లపైనా ఇలాంటి నిర్ణయాలను తీసుకోవాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వంపై తనకు సంపూర్ణ విశ్వాసం ఉందని, జమ్మూ కాశ్మీర్ విషయంలో కేంద్రం తీసుకునే ఎలాంటి నిర్ణయానికైనా తమ పార్టీ మద్దతు ఉంటుందని ఆయన భరోసా కల్పించారు.
ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ లోని కొంత భాగాన్ని పాక్ ఆక్రమించిన విషయం తెలిసిందే. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతం ప్రత్యేక దేశంగా ఆవిర్భవించినప్పటికీ.. అది పొరుగు దేశ ప్రభుత్వ కనుసన్నల్లో నడుస్తోంది. ముజప్ఫరాబాద్ ఆ దేశానికి రాజధాని. తాజాగా- జమ్మూ కాశ్మీర్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చివేసిన కేంద్రం దాని పరిపాలనా వ్యవహారాలను తన చేతుల్లోకి తీసుకుంది. జమ్మూ కాశ్మీర్ లో ఇకపై చీమ చిటుక్కుమన్నా దాని బాధ్యత కేంద్రానిదే అవుతుంది. ప్రజా ప్రభుత్వం ఏర్పడినప్పటికీ.. శాంతిభద్రతల వ్యవహారాలన్నీ కేంద్రం చేతుల్లోనే ఉంటాయి.
కాశ్మీర్ ముఖచిత్రంలో సమూల మార్పు: రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా
ఈ నేపథ్యంలో సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. నేడు జమ్మూ కాశ్మీర్ పరిపాలనా వ్యవహారాలను కేంద్రం తన చేతుల్లోకి తీసుకున్న విధంగానే.. త్వరలో బలూచిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లను కూడా స్వాధీనం చేసుకుంటుందని సంజయ్ రౌత్ అన్నారు. కేంద్రం వీలైనంత వేగంగా ఈ చర్యలు చేపట్టాలను తాను ఆశిస్తున్నట్లు తెలిపారు. బలూచిస్తాన్, పాక్ ఆక్రమిత్ కాశ్మీర్ లను స్వాధీనం చేసుకుంటుందని తాను బలంగా విశ్వసిస్తున్నానని చెప్పారు. అఖండ భారతావనిని సాధించాలనే ప్రతి భారతీయుడి కలను కేంద్ర ప్రభుత్వం సాకారం చేస్తుందని తాను నమ్ముతున్నానని అన్నారు.