ఫేస్బుక్ సాయంతో ఢిల్లీ ఎన్నికల్లో గెలుపుకు బీజేపీ యత్నం ?- ఎఫ్బీ మాజీ ఉద్యోగి సంచలనం...
ఈ ఏడాది ఆరంభంలో హోరాహోరీగా సాగుతాయని భావించిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఏకపక్షంగా ముగిశాయి. కేజ్రివాల్ ప్రభుత్వ విధానాలపై ప్రజల్లో అసంతృప్తి కనిపించినా ఎన్నికల ఫలితాలపై మాత్రం అది ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. ఆప్ సర్కారు వరుసగా మూడోసారి హస్తినలో కొలువుదీరింది. దీనిపై బీజేపీ సహా ఇతర రాజకీయ పార్టీలు కూడా ఎలాంటి విమర్శలు చేయలేదు. కానీ తాజాగా ఫేస్బుక్ బహిష్కరించిన ఓ మాజీ ఉద్యోగి సంచలన విషయాలు బయటపెట్టారు. ఈ ఎన్నికలను ఓ రాజకీయ నెట్వర్క్ ప్రభావితం చేసిందంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి.
ఢిల్లీ ఎన్నికల ఫలితాలు...
ఈ ఏడాది ఫిబ్రవరి 8న జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సిట్టింగ్ ఆప్తో పాటు బీజేపీకీ చావోరేవో తేల్చుకోవాల్సిన స్ధితిలో నిలబెట్టాయి. అయితే ప్రజలు ఆప్ ఐదేళ్ల పాలనను మరోసారి ఆదరించడంతో ఆప్ ఈ ఎన్నికల్లో 70కి ఆప్ 62 స్ధానాలు గెల్చుకుంది. బీజేపీకి 8 స్ధానాలు దక్కాయి. అయితే ఈ ఫలితాలు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని తీవ్ర నిరాశలో ముంచెత్తాయి. అయినా ఏమీ మాట్లాడలేని పరిస్ధితి. కానీ ఈ ఎన్నికల ప్రచారంలో కానీ, ఫలితాల తర్వాత కానీ ఎన్నికల్లో ప్రభావితం చేసిన సంచలన అంశాలపై బీజేపీ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఎన్నికలు ముగిసిపోయి 8 నెలలు పూర్తయిన తర్వాత ఫేస్బుక్ మాజీ ఉద్యోగి ఒకరు మాత్రం ఈ ఎన్నికలపై సంచలన విషయాలు బయటపెట్టారు.
ఫేస్బుక్ మాజీ ఉద్యోగి సంచలనం...
ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను ఓ రాజకీయ నెట్వర్క్ ప్రభావితం చేసిందంటూ తాజాగా ఫేస్బుక్ నుంచి బహిష్కరణకు గురైన ఉద్యోగి ఒకరు వెల్లడించడం సంచలనం రేపుతోంది. గతంలో వాల్స్ట్రీట్ జర్నల్ ప్రచురించిన కథనం ఆధారంగా చూస్తే ఈ నెట్వర్క్ అధికార బీజేపీకు సంబంధించినదే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఫేస్ బుక్లో డేటా సైంటిస్ట్గా పనిచేసిన సోఫీ జాంగ్ తాను ఉద్యోగానికి రాజీనామా చేసే చివరి రోజు 6600 పదాలతో కూడిన ఓ అంతర్గత మెమోను సంస్ధకు మెయిల్ చేసింది. ఇందులో ఢిల్లీ ఎన్నికల్లో ప్రజాభిప్రాయాన్ని మార్చేందుకు సదరు పొలిటికల్ నెట్వర్క్ ఎలా పనిచేసిందో, ఫలితాలపై వీటి ప్రభావం ఎలా పడిందో బయటపెట్టారు. నకిలీ ఖాతాలను నియంత్రించడంలో ఫేస్బుక్ విఫలం కావడం దీనికి కారణమైందని కూడా ఆమె వెల్లడించారు. దీంతో ఢిల్లీ ఎన్నికలు జరిగిన తీరుపై సర్వత్రా చర్చ సాగుతోంది.
రిపోర్టులో షాకింగ్ నిజాలు...
ఫేస్బుక్ ఉద్యోగి సంస్ధకు అంతర్గతంగా పంపిన మెమోలో విదేశీ ప్రభుత్వాలు తమ సొంత పౌరులను ప్రభావితం చేసేందుకు ఫేస్బుక్ను ఎలా వాడుకుంటున్నారో కుండబద్దలు కొట్టారు. అలాగే ఎన్నికల్లో ప్రభుత్వాధినేతల జోక్యం లేకుండా చూసేందుకు తాను వ్యక్తిగతంగా లెక్కలేనన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని సోఫీ జాంగ్ తెలిపారు. ఇదే క్రమంలో ఢిల్లీ ఎన్నికలను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించిన వంద మంది కీలక వ్యక్తుల నెట్వర్క్ను తాను బ్రేక్ చేసినట్లు సోఫీ పేర్కొన్నారు. సోఫీ ఆరోపణలపై స్పందించిన ఫేస్ బుక్ కూడా ఎన్నికల్లో ఫేస్బుక్ను వాడుకునేందుకు ప్రయత్నించిన పలు నకిలీ ఖాతాలను నియంత్రించినట్లు చెప్పుకొచ్చింది.
Recommended Video
ఢిల్లీ అసెంబ్లీ ప్యానెల్ ముందుకు ఫేస్బుక్...
దేశంలో విద్వేషపూరితమైన, అసత్యమైన సమాచారాన్ని నియంత్రించడంలో విఫలమవుతున్న ఫేస్బుక్కు ఢిల్లీ అసెంబ్లీ ప్యానెల్ తమ ముందు హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే ఈ విషయంలో తమ వ్యాపార ప్రయోజనాలే ముఖ్యమని తమ ఉద్యోగులకు ఫేస్బుక్ పబ్లిక్ పాలసీ డైరెక్టర్ అంఖీ దాస్ చెప్పినట్లు వాల్స్ట్రీట్ జర్నల్ కథనం ప్రచురించిన నేపథ్యంలో ఢిల్లీ అసెంబ్లీ ప్యానెల్ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. అధికార బీజేపీకి అనుబంధంగా ఉన్న నలుగురు వ్యక్తులు, సంస్ధలకు సంబంధించిన విద్వేష సమాచారాన్ని ఫేస్బుక్లో నియంత్రించే విషయంలో చర్యలు తీసుకోకుండా అంఖీ దాస్ అడ్డుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. తాజాగా సోఫీ ఆరోపణలను బట్టి చూసినా ఢిల్లీ ఎన్నికల ఫలితాలను మార్చేందుకు ఈ నెట్వర్క్ గట్టిగా పనిచేసినట్లు తెలుస్తోంది.