1,027 కోట్ల ఆదాయం, 758 కోట్ల ఖర్చు.. ఇవి కమలం లెక్కలు.. మరి కాంగ్రెస్ లెక్కలు?
ఢిల్లీ : 1,027.34 కోట్లుగా గత ఫైనాన్షియల్ ఇయర్ ఆదాయం ప్రకటించింది బీజేపీ. అందులో 758.47 కోట్లు ఖర్చుల కింద చూపించింది. రాజకీయ పార్టీల ఆదాయ, వ్యయాలకు సంబంధించి ఏడీఆర్ (అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్) లేటేస్ట్ నివేదిక ప్రకారం ఇవి బీజేపీ లెక్కలు. 2017-18 ఆర్థిక సంవత్సరంలో బీజేపీ ఆదాయం కొంత మేర తగ్గింది. అదే 2016-17లో 1,034.27 కోట్లుగా రికార్డుంది.
అటోఇటో మొత్తానికి అన్ని పార్టీలు ఆడిట్ రిపోర్టులు సమర్పించాయి. కొన్ని పార్టీలు నిర్ణీత గడువులో అందిస్తే.. మరికొన్ని పార్టీలు గడువు తీరాక సమర్పించాయి. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇంతవరకు ఆడిట్ రిపోర్ట్ సమర్పించలేదని సమాచారం. వాస్తవానికి ఈ నివేదికలు సమర్పించడానికి చివరి తేదీ అక్టోబర్ 30. అయితే సీపీఎం, బీఎస్పీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు ఈ గడువులోగానే ఆదాయవ్యయాల లెక్కలు సమర్పించాయి. బీజేపీ, సీపీఐ, ఎన్సీపీ గడువు ముగిశాక అంటే అక్టోబర్ 30 తర్వాత కొద్దిరోజులకు అందజేశాయి.
2017-18 కి గాను బీఎస్పీ ఆదాయం 51.70 కోట్ల రూపాయలు కాగా.. 14.78 కోట్లు ఖర్చు చేసినట్లుగా పేర్కొంది. ఇక ఎన్సీపీ పార్టీకి మిగులుకంటే వ్యయమే ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఆ పార్టీకి 8.15 కోట్ల ఆదాయం ఉంటే.. 8.84 కోట్లు ఖర్చు చేసినట్లుగా పేర్కొనడం గమనార్హం.
స్వచ్ఛంద విరాళాలతో పాటు ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా ఆయా పార్టీలకు ఆదాయం సమకూరుతుంటుంది. అయితే ఈ మొత్తాలకు సంబంధించి ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాల్సి ఉంటుంది. అనంతరం వాటిని ఎన్నికల సంఘానికి సమర్పిస్తాయి. ఈ ఆడిట్ రిపోర్టులతో ఏడీఆర్ నివేదికలు రూపొందిస్తుంది.