సోను సూద్ కోసం రాజకీయ పార్టీల వెంపర్లాట .. బెల్లం చుట్టూ ఈగల్లా; ఐటీ తనిఖీలతో భారీ పొలిటికల్ రచ్చ
బాలీవుడ్ ప్రముఖ నటుడు, రీల్ లైఫ్ విలన్, రియల్ లైఫ్ హీరో సోనుసూద్ చుట్టూ ఇప్పుడు రాజకీయ పార్టీలు తిరుగుతున్నాయి. కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో ఎంతోమందిని ఆదుకున్న సోనుసూద్ ప్రభుత్వాల కంటే మెరుగ్గా ప్రజలకు సేవలు అందించారు. రోగులకు మందులు పంపిణీ చేయడమే కాదు, ఆక్సిజన్ సిలెండర్లు అందించడం వంటి అనేక కార్యక్రమాలు చేశారు. ఆకలితో అలమటిస్తున్న వారి ఆకలి తీర్చిన, వలస కార్మికుల పాలిట దేవుడిగా గుర్తింపు పొందారు. సినిమాలలో కంటే, సామాజిక సేవా కార్యక్రమాలను విశేషంగా ప్రజాదరణ పొందిన సోనుసూద్ యూత్ ఐకాన్ గా, నిజమైన హీరో గా ప్రజల గుండెల్లో నిలిచారు.
IstandWithSonuSood Trending సోనుసూద్ పై రెండో రోజు ఐటీ తనిఖీలు ; బీజేపీపై సోషల్ మీడియాలో రచ్చ
వచ్చే ఏడాది పంజాబ్ ఎన్నికలు... ఆ సీఎంతో భేటీతో మొదలైన రచ్చ
ప్రస్తుతం సోను సూద్ చుట్టూ రాజకీయ పార్టీలు తిరుగుతున్నాయి. ఇటీవల ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తో సోనూసూద్ భేటీ కావడం, వచ్చే ఏడాది పంజాబ్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆసక్తికరంగా మారింది. పంజాబ్లో జరుగనున్న ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ బరిలోకి దిగాలని భావిస్తున్న క్రమంలో పార్టీని బలోపేతం చేయడంపై అరవింద్ కేజ్రీవాల్ దృష్టిపెట్టారు. ఈ క్రమంలో పంజాబ్ రాష్ట్రానికి చెందిన సోనూసూద్ ఆయన సమావేశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సోను సూద్ రాజకీయాల్లోకి వస్తున్నాడని, పంజాబ్ ఎన్నికల్లో బరిలోకి దిగుతున్నాడు అని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే సోనూసూద్ ఈ వార్తలపై స్పందించలేదు. ఢిల్లీ ప్రభుత్వం దేశ్ కే మెంటర్స్ ప్రోగ్రాంను త్వరలోనే లాంచ్ చేయబోతున్న క్రమంలో సోనూసూద్ ని బ్రాండ్ అంబాసిడర్ గా నియమించడానికి సమావేశం జరిగినట్లుగా ఆ భేటీ తర్వాత అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు.
ఆదాయపు పన్ను శాఖ తనిఖీలతో సోను సూద్ కోసం రంగంలోకి రాజకీయ పార్టీలు
ఇక వచ్చే ఏడాది పంజాబ్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సోనూసూద్ అరవింద్ కేజ్రీవాల్ తో భేటీ అయిన తర్వాత తాజా పరిణామాల లో భాగంగా సోను సూద్ ఆస్తులపై ఆదాయపు పన్ను శాఖ తనిఖీలు నిర్వహిస్తోంది. గత రెండు రోజులుగా ఆదాయపు పన్ను శాఖ నిర్వహిస్తున్న తనిఖీలపై పలు రాజకీయ పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ కావాలని కేంద్ర సంస్థలను వాడుకుంటోందని, తమకు అనుకూలంగా లేని వారిపై దాడులు చేయించడం బిజెపి నైజమని నిప్పులు చెరుగు తున్నాయి. ఇక ఇదే సమయంలో సోనూసూద్ కు మద్దతు ప్రకటించి సోను సూద్ ను తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నాయి.
సోను సూద్ పై ఐటీ తనిఖీలను ఖండించిన కాంగ్రెస్ నాయకులు
కేంద్ర ప్రభుత్వ తీరును కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్రంగా ఖండించారు. తమకు అనుకూలంగా లేని వారిపై బిజెపి ఇలాంటి కేంద్ర సంస్థల ద్వారా దాడులు చేయించడం పరిపాటిగా మారిందని విమర్శించారు. నిన్నటికి నిన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జైరాం రమేష్ సోనూసూద్ నివాసాలపై ఆయన ఆస్తుల పై జరుగుతున్న ఐటి తనిఖీల పై ధ్వజ మెత్తారు. బిజెపి ప్రభుత్వం బెదిరింపు చర్యల్లో భాగంగా ఈ దాడులకు దిగుతుందని విమర్శించారు. ప్రస్తుతమున్న కేంద్ర ప్రభుత్వానికి బెదిరించడం మాత్రమే తెలుసని, కానీ ప్రజాస్వామ్యం విజయం సాధిస్తుందని జైరాం రమేష్ పేర్కొన్నారు. మోడీ ప్రభుత్వ హయాంలో భయపెట్టడాలు, బెదిరించడాలు సర్వసాధారణమని ఆయన పేర్కొన్నారు. రాజకీయాల్లో భాగంగానే సోనూసూద్ పై ఐటీ తనిఖీలు జరుగుతున్నాయని భావిస్తున్నారు. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ నేతలు సోనూసూద్ కు మద్దతు తెలుపుతూ కాంగ్రెస్ పార్టీపై సానుకూల దృక్పధాన్ని సోనూసూద్ లో పెంపొందించే ప్రయత్నం చేస్తున్నారు.
బెదిరించటం, భయపెట్టటం బీజేపీ పనిగా పెట్టుకుందన్న ఆమ్ ఆద్మీ పార్టీ
ఇక మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ బిజెపి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ సోనూ సూద్ కు మద్దతునిస్తూ కేంద్ర ప్రభుత్వ తీరుపై మండిపడుతోంది. బాలీవుడ్ నటుడు సోనూసూద్ నివాసం మరియు కార్యాలయంపై ఆదాయపు పన్ను శాఖ సర్వే చేయడంతో ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే అతిషి బీజేపీపై విరుచుకుపడ్డారు. సోనూసూద్ పై జరుగుతున్న దాడులతో కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం స్పష్టంగా కనిపిస్తుందని, ఎవరైతే మంచి పని చేస్తారో వారిని బెదిరించడం, భయపెట్టడం పనిగా పెట్టుకున్నారని విమర్శిస్తున్నారు. ఆప్ నాయకుడు రాఘవ్ చడ్డా సోను సూద్ లా నిజాయితీగా ఉన్న వ్యక్తిపై ఐటీ దాడి లక్షలాది మంది దేవుడిగాపిలువబడే వ్యక్తి, అణగారిన వర్గాలకు సహాయం చేసిన వ్యక్తి పై ఐటీ తనిఖీలు శోచనీయమన్నారు. ఆయనలాంటి వ్యక్తి రాజకీయంగా మంచి ఆలోచనలో ఉంటే కేంద్రంభయపెట్టేలా ఏదో చెయ్యాలని చూస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ సోను సోద్ కు మద్దతు పలుకుతూ రానున్న ఎన్నికల నేపథ్యంలో ఆయన సపోర్ట్ కోసం వెంపర్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది.
భగ్గుమన్న శివసేన .. తాలిబన్ ఐడియాలజీ అంటూ బీజేపీని టార్గెట్
ఇదిలా ఉంటే రెండు రోజులపాటు సోనూసూద్ పై ఐటీ తనిఖీలు జరిగిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీరుపై శివసేన నేతలు పడుతున్నారు. ఇది కావాలని టార్గెట్ గా చేస్తున్న తనిఖీలని, కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి తాలిబన్ ఐడియాలజీ అని మండిపడుతున్నారు. శివసేన అధికార ప్రతినిధి మనీషా కాయిండే బిజెపి సెలెక్టివ్ గా సోనూసూద్ ను టార్గెట్ చేసుకుందని విమర్శిస్తున్నారు. సోను సూద్ లక్షలాది మందికి సహాయం చేశాడని , ఆయన గొప్ప మానవతావాది అని, ఆయన చట్టవిరుద్ధంగా ఏదైనా చేస్తాడని తాము అనుకోమని అని శివసేన నాయకుడు ఆనంద్ దుబే అన్నారు. ఇది కేంద్ర కక్షసాధింపు చర్యగా, తమకు అనుకూలంగా లేని వారిపై చేసే దాడిగా అభివర్ణించారు. తాజా ఐటి తనిఖీల నేపథ్యంలో శివసేన సోనూసూద్ కు మద్దతుగా నిలిచి ఒకవేళ ఆయన రాజకీయాల వైపు దృష్టి సారిస్తే తమ పార్టీపై సానుకూల దృక్పథంతో ఉండేలా ప్రయత్నాలు చేస్తోంది.
దాడులు కాదు తనిఖీలే .. తమకు సంబంధం లేదంటున్న బీజేపీ నేతలు
ఇదిలా ఉంటే తాజా ఐటీ తనిఖీల నేపథ్యంలో బిజెపిని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్న ప్రతిపక్షాలకు సమాధానం చెబుతూ బిజెపి నాయకులు ఇది సాధారణ ప్రక్రియలో భాగంగా జరుగుతున్న తనిఖీలే తప్పా, ఐటీ దాడులు కాదని, ప్రతిపక్ష పార్టీలు కావాలని దీన్ని రాజకీయం చేస్తున్నాయని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇక బీజేపీ కూడా ఈ తనిఖీలకు తమకు సంబంధం లేదని చెబుతూ సోను సూద్ చాలా మంచి వ్యక్తి అని కితాబివ్వటం గమనార్హం.
గతంలో తెలంగాణా ఐటీ మంత్రి కేటీఆర్ తో సోను సూద్ భేటీ
ఇప్పటికే తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, సోను సూద్ లు ప్రగతి భవన్ లో భేటీ అయిన విషయం తెలిసిందే. సేవా కార్యక్రమాలతో ప్రజల్లో విశేషంగా అభిమానాన్ని సంపాదించిన సోనూసూద్ సాగించిన కార్యక్రమాలను మంత్రి కేటీఆర్ అభినందించారు. ఇక మంత్రి కేటీఆర్ పనితీరును సోనూసూద్ ప్రశంసించారు. తనకు మంత్రి కేటీఆర్ అంటే ఎంతో ప్రత్యేక గౌరవం ఉందని సోను సూద్ చెప్పుకొచ్చారు. ఆ తర్వాత కెసిఆర్ పుట్టినరోజు నాడు కూడా సోనూసూద్ మనస్ఫూర్తిగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక తెలంగాణ ప్రభుత్వం తో సోనూసూద్ సత్సంబంధాలు కొనసాగిస్తున్న పరిస్థితి భవిష్యత్తులో టిఆర్ఎస్ పార్టీ కోసం సోనూసూద్ పనిచేసే అవకాశం ఉందా? అన్న చర్చకు కారణంగా మారింది.
సోను సూద్ తో సత్సంబంధాల కోసం తహతహలాడుతున్న టీడీపీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన టీడీపీ అధినేత చంద్రబాబు సోను సూద్ తో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ ట్రస్టు నిర్వహించిన వెబినార్ కార్యక్రమంలో మాట్లాడిన సోనుసూద్ టీడీపీ అధినేత చంద్రబాబు పై ప్రశంసల వర్షం కురిపించారు కరోనా తొలి దశలో ఒకరోజు చంద్రబాబును అర్ధరాత్రి నిద్రలేపినట్టు పేర్కొన్న ఆయన, చంద్రబాబు రియాక్ట్ అయిన తీరు మరిచిపోలేనని కితాబిచ్చారు. చంద్రబాబు దూరదృష్టి వల్లే హైదరాబాద్ ఎంతో అభివృద్ధి చెందిందని, ఆయన మంచి విజన్ ఉన్న నాయకుడు అంటూ ప్రశంసించారు సోనూసూద్. లాక్ డౌన్ సమయంలో సోనూసూద్ అందించిన సేవలపై చంద్రబాబు సైతం ప్రశంసల జల్లు కురిపించారు. ఎన్టీఆర్ ట్రస్టు సోనుసూద్ తో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉందని ఒకసారి కలిసి మాట్లాడదామని చంద్రబాబు సూచించడం, సోనూసూద్ కు ప్రస్తుతం ఉన్న ఇమేజ్ ను చంద్రబాబు భవిష్యత్తులో వాడుకునే అవకాశం ఉందా అన్న అనుమానాలకు అవకాశం ఇస్తుంది.
Recommended Video
బెల్లం చుట్టూ ఈగల్లా సోను సూద్ కోసం రాజకీయం
ఏది ఏమైనా నిరుపేదల పాలిట దేవుడిగా, ఆపద్బాంధవుడిగా ప్రజల గుండెల్లో మంచి స్థానం సంపాదించుకున్న సోనూసూద్ చుట్టూ బెల్లం చుట్టూ ఈగలు ముసిరినట్టుగా రాజకీయ పార్టీలు వెంపర్లాడుతున్న తీరు ఆసక్తికరంగా మారింది . ఇక రాజకీయ ఆరంగేట్రంపై సమాధానం చెప్పడానికి నిరాకరించిన సోనుసూద్ భవిష్యత్తులో రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన చేస్తాడు అన్న భావన రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్న నేపథ్యంలోనే సోను సూద్ కోసం ప్రస్తుతం పొలిటికల్ రచ్చ కొనసాగుతోంది. అవకాశం దొరికింది కదా అని ప్రతి ఒక్కరూ ఆయనకు మద్దతు ఇస్తూ తమ పార్టీలకు అనుకూలంగా మార్చుకునే పనిలో బిజీగా ఉన్నారు. ఈ పరిణామాలతో సోనుసూద్ అసలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు అనేది తెలియాల్సి ఉంది.