షాక్: రాజకీయపార్టీలకు పెద్ద దెబ్బ, ఈ ఏడాది కేవలం 16 శాతం విరాళాలే
పెద్ద నగదునోట్ల రద్దుతో పాటు ఖర్చులపై ఎన్నికల కమీషన్ కేంద్రీకరణ పెరగడంతో రాజకీయపార్టీలకు వచ్చే విరాళాలు గణనీయంగా పడిపోయాయి.
న్యూఢిల్లీ :పెద్ద నగదు నోట్ల రద్దు రాజకీయ పార్టీలకు ఇబ్బందులను తెచ్చిపెడుతోంది. ఎన్నికల ముందు రాజకీయ పార్టీలకు పెద్ద ఎత్తున విరాళాలు అందుతాయి.అయితే ఈ ఏడాది రాజకీయపార్టీలకు పెద్ద మొత్తంలో విరాళాలు తగ్గిపోయాయి . కీలకమైన ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరిగే తరుణంలో ఆయా రాజకీయపార్టీలకు విరాళాలు తగ్గడం ఇబ్బందిగా మారింది.
పెద్ద నగదు నోట్ల రద్దు కరెన్సీ కష్టాలు పడుతున్నారు సామాన్యులు. అయితే రాజకీయ పార్టీలకు కూడ కరెన్సీ కష్టాలు ప్రారంభమయ్యాయి. ఎన్నికల సమయంలో రాజకీయపార్టీలకు కరెన్సీ లెక్కకు మించి ఖర్చు చేయాల్సిన పరిస్థితులు నెలకొంటాయి.
అయితే దేశంలో కీలకమైన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి వచ్చే ఏడాది లో ఎన్నికలు జరగనున్నాయి. దీనితో పాటు ఇతర రాష్ట్రాలకు కూడ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. దరిమిలా రాజకీయపార్టీలు విరాళాలపైనే ఎక్కువగా ఆధారపడతాయి.
మారిన పరిస్థితుల కారణంగా రాజకీయపార్టీలకు విరాళా సంఖ్య గణనీయంగా పడిపోయినట్టుగా ఓ నివేదిక వెల్లడిస్తోంది.ఎన్నికల తరుణంలో రాజకీయ పార్టీలకు విరాళాల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడం నష్టమే.
రాజకీయపార్టీలకు 84 శాతం విరాళాలు తగ్గిపోయాయి
201516 సంవత్సరంలో రాజకీయ పార్టీలకు కేవలం 16 శాతం మాత్రమే విరాళాల రూపంలో నిధులు వచ్చాయని ఓ సర్వే నివేదిక వెల్లడిస్తోంది. సుమారు 84 శాతం నిధులను రాజకీయపార్టీలు కోల్పోయాయి.డెముక్రటిక్ రిపార్మ్స్ అసోసియేషన్ నేషనల్ ఎలక్షన్ వాచ్ అనే సంస్థ ఈ నివేదికను వెల్లడించింది. రాజకీయపార్టీలకు ప్రధానంగా కార్పోరేట్ సంస్థల నుండే పెద్ద ఎత్తున నిధులు అందిస్తుంటాయి. అయితే ఈ ఏడాది విరాళాలు భారీగా తగ్గడం రాజకీయ పార్టీలను ఆందోళనకు గురిచేస్తోంది. ప్రధాన రాజకీయపార్టీలకు 102.02 కోట్ల నిధులు వచ్చాయి. అయితే ఇందులో సుమారు 77.28 కోట్లు కార్పోరేట్ సంస్థల నుండి వచ్చాయి. మిగిలిన నిధులన్నీ ప్రజల నుండి విరాళాల రూపంలో వసూలు చేసినట్టుగా పార్టీలు లెక్కలు చూపాయి.
గత ఏడాదితో పోలిస్తే భారీగా తగ్గిన విరాళాలు
గత ఏడాదితో పోలిస్తే రాజకీయపార్టీలకు భారీగా నిధులు తగ్గిపోయాయి. ఈ మేరకు ఆయా రాజకీయపార్టీలు తమ నివేదికలను సమర్పించాయి.కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపికి 201415 సంవత్సరంలో 437.35కోట్ల విరాళాలు వచ్చాయి. అయితే ఈ ఏడాది కేవలం 76.85 కోట్లు మాత్రమే వచ్చాయి.కాంగ్రెస్ పార్టీకి 201415 లో 141.46 కోట్లు విరాళాలు వచ్చాయి. 201516 లో కేవలం 20.42 కోట్లు మాత్రమే వచ్చాయి. గత ఏడాది సిపిఎం కు 3.42 కోట్లు విరాళాలు రాగా, ఈ ఏడాది కేవలం 1.81 కోట్లు మాత్రమే వచ్చాయి. సిపిఐకి గత ఏడాది 1.33 కోట్ల విరాళాలు వచ్చాయి. ఈ ఏడాది అనుహ్యంగా 1.58 కోట్లు వచ్చాయి. ఎన్ సిపి కి గత ఏడాది 38.82 కోట్లు విరాళాల రూపంలో వచ్చాయి. ఈ ఏడాది కేవలం 0.71 కోట్లు మాత్రమే వచ్చాయి. తృణమూలు కాంగ్రెస్ పార్టీకి గత ఏడాది 8.31 కోట్లు వస్తే, ఈ ఏడాది కేవలం 0.65 కోట్లు మాత్రమే వచ్చాయి.
చట్టంలో మార్పులు చేయాలని కోరుతున్న ఎన్నికల కమీషన్
ఇరవై వేల రూపాయాల నగదు కంటే ఎక్కువగా విరాళాలను ఇచ్చేవారి పేర్లు, వివరాలను మాత్రమే రాజకీయపార్టీలు బహిర్గతం చేయాల్సి ఉంటుంది. అయితే చాలా రాజకీయపార్టీలు ఇరవై వేల లోపుగా విరాళాలుఇచ్చినట్టుగా వందల మంది పేరుతో తప్పుడు వివరాలను నమోదుచేస్తున్నారనే ఆరోపణలున్నాయి. అయితే ఇటీవల కాగితాలకే పరిమితమైన రాజకీయపార్టీలు ఈ లొసుగును ఆసరాగా చేసుకొని నల్లధనాన్ని మార్పిడి చేస్తున్నారని ఎన్నికల కమీషన్ అనుమానించింది. ఈ మేరకు చట్టంలో మార్పులు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ప్రతి రెండువేల రూపాయాలకు పైగా విరాళాలు ఇచ్చే వారి సమాచారాన్ని ఇచ్చేలా చట్టసవరణ చేసేందుకు ఎన్నికల కమీషన్ కేంద్రాన్ని చట్ట సవరణను కోరుతోంది.
అసెంబ్లీ ఎన్నికల పై ప్రభావం
రాజకీయపార్టీలకు విరాళాల రూపంలో వచ్చే ఆదాయం గణనీయంగా తగ్గిపోతే ఎన్నికల్లో దాని ప్రభావం కన్పిస్తోంది. ఎన్నికల్లో ప్రచారం కోసం పార్టీ అభ్యర్థులకు ఖర్చుల కోసం విపరీతంగా రాజకీయపార్టీలు ఖర్చుచేస్తుంటారు.అయితే ఈ ఖర్చును రాజకీయపార్టీలు విరాళాల రూపంలో వసూలు చేస్తుంటారు. అయితే త్వరలో జరిగే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో విరాళాలు తగ్గిపోతే రాజకీయపార్టీలకు ఇబ్బందిగామారే అవకాశం లేకపోలేదు. ఎన్నికల్లో విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టే అవకాశం రాజకీయపార్టీలకు తగ్గిపోయే అవకాశం ఉంది.
అన్ని పార్టీలపై ప్రభావం
రాజకీయపార్టీల ఖర్చులపై ఎన్నికల కమీషన్ కన్ను వేయడంతోయ పాటు ఇటీవలే పెద్ద నగదు నోట్లను రద్దుచేయడం వంటి పరిస్థితులు రాజకీయపార్టీలకు విరాళాలు గణనీయంగా తగ్గేలా చేసిందనే అభిప్రాయాలు ఉన్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపికి కూడ విరాళాలు గణనీయంగా పడిపోయాయి. బిజెపి విరాళాలకు 76.85 కోట్లకే పరిమితం కావాల్సి వచ్చింది. కాంగ్రెస్ పరిస్థితి మాత్రం మరీ దారుణంగా ఉంది. కేవలం 20.42 కోట్లకే పరిమితం కావాల్సి వచ్చింది.