వివాదాస్పదం: ‘ముస్లింలను కండోమ్స్లా వాడుకుంటున్నారు’
సమాజ్వాదీ పార్టీ యువనేత, మహారాష్ట్ర శాఖ అధ్యక్షుడు అబూ ఆజ్మీ కుమారుడు ఫర్హాన్ ఆజ్మీ.. ముస్లింల గురించి వివాదాస్పద వ్యాఖ్య చేశారు.
ముంబై: సమాజ్వాదీ పార్టీ మహారాష్ట్ర శాఖ అధ్యక్షుడు అబూ ఆజ్మీ కుమారుడు, ఆ పార్టీ యువనేత ఫర్హాన్ ఆజ్మీ.. ముస్లింల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పలు రాజకీయ పార్టీలు ముస్లింను కండోమ్స్లా వాడుకుంటున్నాయని ఆరోపించారు.
ముంబైలో జరగనున్న బీఎంసీ ఎన్నికల ప్రచార సభకు తన తండ్రితో కలిసి హాజరైన సందర్భంగా ఫర్హాన్ ఈ వ్యాఖ్యలు చేశారు. కండోమ్లతో పోల్చడం ద్వారా మొత్తం ముస్లిం జాతిని ఫర్హాన్ అవమానపరిచారని భారతీయ జనతా పార్టీ ముంబై శాఖ ఉపాధ్యక్షుడు హైదర్ ఆజం మండిపడ్డారు.
ఈ వ్యాఖ్యలు చేసినందుకు ముస్లిం జాతికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే పర్హాన్ ఇంటిముందు భారీ ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. మరోవైపు ఫర్హాన్ వ్యాఖ్యలు సమాజ్వాదీ పార్టీ వైఖరిని బట్టబయలు చేశాయని ఎంఐఎం ఎమ్మెల్యే వారిస్ పఠాన్ అన్నారు.
ముస్లింలను అవమానించిన ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాగా, చాలా మంది ముస్లిం నాయకులు ఫర్మాన్ ఇంటిముందు పెద్ద ఎత్తున మార్చ్ నిర్వహిస్తామని చెప్పారు. అయితే ఫర్హాన్ మాత్రం ముస్లింల దురవస్థను ఎత్తిచూపేందుకు ఉదాహరణగా మాత్రమే తాను మాట్లాడానని వివరించారు. కాగా, బాలీవుడ్ నటి అయేషా టకియా భర్తే ఈ ఫర్హాన్ అజ్మీ.