కర్ణాటక ఎన్నికల్లో ఓటర్లకు అర్దరాత్రి నకిలీ నోట్లు: పెట్రోల్ బంక్ లు, హోటల్స్ లో హల్ చల్!
రాయచూరు: కర్ణాటక శాసన సభ ఎన్నికల సందర్బంగా పలు పార్టీల నాయకులు ఓటర్లకు భారీ మొత్తంలో నగదు పంచిపెడుతున్నారు. కొందరు చేతి వాటం చూపించి గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లను మాయ చేసి మోసం చెయ్యడానికి ప్రయత్నిస్తున్నారు.
అర్దరాత్రి నకిలీ నోట్లు
కర్ణాటకలోని రాయచూరు జిల్లా దేవదుర్గ తాలుకా జాలహళ్ళితో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో గురువారం రాత్రి పోద్దుపోయిన తరువాత కొందరు ఆ ప్రాంతంలోని ఓటర్లకు రూ. 500 నోట్లు పంచిపెట్టారు. శనివారం పోలింగ్ పూర్తి అయిన తరువాత రూ. 500 నోట్లు మార్చుకోవాలని, లేదంటే అధికారులు పట్టుకుంటారని వారికి మాయమాటలు చెప్పారు.
జల్సా చేసిన ఓటర్లు
శుక్రవారం స్థానిక గ్రామస్తులు అనేక మంది దేవదుర్గలోని హోటల్స్ నకిలీ నోట్లు ఇచ్చి బిరియానీలు తిన్నారు, పెట్రోల్ బంక్ తదితర చోట్ల రూ. 500 నోట్లను మార్చేశారు. రూ. 500 నకిలీ నోట్లు మారిపోయిన తరువాత అవి నకిలీ నోట్లు అని గుర్తించిన పెట్రోల్ బంక్, హోటల్స్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఏ పార్టీ నాయకులు
ఓటర్లకు నగదు బహుమతిగా ఇవ్వడం నేరం. అయితే అసలైన నోట్లు ఇవ్వకుండా నకిలీ నోట్లు ఇవ్వడం మరింత నేరమని కేసు నమోదు చేశామని పోలీసులు అన్నారు. దేవదుర్గ తాలుకాలోని జాలహళ్ళితో పాటు చుట్టు పక్కల గ్రామాల్లో నకిలీ నోట్లు పంచిపెట్టింది ఏ పార్టీకి చెందిన వారు అని పోలీసులు ఆరా తీస్తున్నారు.
Recommended Video
గ్రామస్తులకు నకిలీ నోట్ల తంటా
నకిలీ నోట్లు పంచిపెట్టి ఓటర్లను మభ్యపెట్టి తమకు అనుకూలంగా ఓటు వేయించుకోవాలని, తారువాత అవి నకిలీ అని తెలిసినా వారు ఏమీ చెయ్యలేరని కొందరు పక్కాప్లాన్ ప్రకారం ఇలా చేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం నకిలీ నోట్లు ఎవరు పంచిపెట్టారు అని గ్రామస్తులను పోలీసులు విచారణ చేస్తున్నారు.