చంద్రబాబు అబద్ధాల పరిపాలనకు తెరపడినట్టే: ప్రశాంత్ కిషోర్
న్యూఢిల్లీ: ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మరోసారి తెర మీదికి వచ్చారు. వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. చంద్రబాబు నాయుడు అనుసరిస్తోన్న విధానాలపై ధ్వజమెత్తారు. తాను ఓడిపోతున్నాననే విషయాన్ని చంద్రబాబు పసిగట్టారని, అందువల్లే ఆయన ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. తప్పుడు సమాచారం, వార్తా కథనాలతో ఓటర్లను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
దేశవ్యాప్తంగా తొలిదశలో కొనసాగుతున్న పోలింగ్ సరళిని ఆయన పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సరళి తన అంచనాకు తగ్గట్టే కనిపిస్తోందని ఆయన చెప్పుకొచ్చారు. చంద్రబాబుకు ఓటమి తథ్యమని అన్నారు. పోలింగ్ ముగియడానికి ఇంకా రెండు గంటల సమయం ఉండగానే.. ఏపీ ఓటర్లు తమ తీర్పును ఇచ్చేశారని ఆయన చెప్పారు.
చంద్రబాబు ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారని ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యానించారు. అధికారంలో కొనసాగిన అయిదేళ్ల పాటు చంద్రబాబు ప్రజలను మభ్య పెట్టారని అన్నారు. అబద్ధాలతో పరిపాలన సాగించారని చెప్పారు. పోలింగ్ ముగియడానికి ఇంకొన్ని గంటలే మిగిలి ఉందని, ప్రజలు చంద్రబాబు గుడ్ బై చెప్పేశారని అన్నారు. చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటర్లు స్పష్టమైన తీర్పును ఇచ్చారని తాను అంచనా వేస్తున్నట్లు చెప్పారు.