అందరూ అనుకూలమే: ఊదు కాలదు, పీరు లేవదు
ఒకవేళ బిజెపి, కాంగ్రెస్ పార్టీ కలిసి పనిచేస్తే పార్లమెంట్లో ఏ బిల్లునైనా ఆమోదించొచ్చు. ఈ నేపథ్యంలో తొలిసారి 1996లో పార్లమెంట్లో ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లుకు
న్యూఢిల్లీ: ఒకవేళ బిజెపి, కాంగ్రెస్ పార్టీ కలిసి పనిచేస్తే పార్లమెంట్లో ఏ బిల్లునైనా ఆమోదించొచ్చు. ఈ నేపథ్యంలో తొలిసారి 1996లో పార్లమెంట్లో ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లుకు మాత్రం ఇప్పటికీ మోక్షం లభించలేదు. చట్టసభ (పార్లమెంట్, రాష్ట్ర శాసనసభలు)ల్లో 33 శాతం మహిళల రిజర్వేషన్ల చట్టం ఆమోదంపై అధికార, ప్రతిపక్ష పార్టీలు పరస్పరం దుమ్మెత్తిపోస్తున్నాయి.
గత యూపీఏ ప్రభుత్వం, దానికి సారథ్యం వహించిన కాంగ్రెస్ పార్టీపై 2004 నుంచి పదేళ్ల పాటు ప్రతిపక్ష బిజెపి తరుచుగా విమర్శలు గుప్పిస్తూ వచ్చింది. ప్రస్తుతం పాత్రలు మారిపోయాయి. అధికారంలో ఉన్న బిజెపిని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ వేలెత్తి చూపుతోంది. రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, , సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) చీఫ్ ములాయం సింగ్ యాదవ్, యునైటెడ్ జనతాదళ్ (యూజేడీ) సీనియర్ నేత శరద్ యాదవ్ ప్రతిఘటనను అధిగమించి 2010 మార్చి తొమ్మిదో తేదీన రాజ్యసభ.. మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించింది.
నాడు బిల్లు ఆమోదించిన కొన్నిగంటల్లోపే ఎంపికచేసిన కొన్ని టీవీ చానెళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో లోక్సభలో త్వరలో ఈ బిల్లు ఆమోదం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నాటి నుంచి భారత పార్లమెంటరీ సంస్కరణల ప్రక్రియలో అతిపెద్ద సంస్కరణ ప్రక్రియను అధికార, ప్రతిపక్ష పార్టీలు అటకెక్కించాయి.
కేంద్రమంత్రి వెంకయ్య ఇలా..
తాజాగా గత నెలలో జరిగిన ఇంటర్ పార్లమెంటరీ మహిళా సదస్సులో పాల్గొన్న కేంద్ర సమాచార, ప్రసారాలశాఖ మంత్రి ముప్పవరపు వెంకయ్య నాయుడు మరో మాట చెప్పారు. ‘ముందు మాకు రాజ్యసభలో మెజారిటీ లభించిన మరుక్షణం మహిళా బిల్లును ఆమోదిస్తాం' కొత్త వాదన తీసుకొచ్చారు. దీనిపై విస్త్రుత స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు రాజకీయ గిమ్మిక్కు చేస్తున్నారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి ప్రియాంక చతుర్వేది వ్యాఖ్యానించారు. ‘చట్టసభల్లో రిజర్వేషన్ల బిల్లును ఆమోదించాలని ఒకవేళ బీజేపీ సీరియస్గా ఆలోచిస్తే ముందు పూర్తి మెజారిటీ గల లోక్సభలో బిల్లును ఆమోదింప జేయాలి' అని ఆమె డిమాండ్ చేశారు.
పార్టీల మధ్య ఏకాభిప్రాయంతోనే సాధ్యం
చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించడానికి పలు ప్రతిపాదనలు ముందుకు వచ్చాయి. రొటేషన్ పద్ధతిలో మహిళలకు ఒక సీటు కేటాయించేందుకు ముసాయిదా బిల్లు రూపొందించారు. లేనిపక్షంలో ప్రతి మూడు ఎన్నికలకు ఒకసీటు మహిళలకు రిజర్వు చేయాల్సి ఉంటుంది. కొన్ని పార్టీలు మహిళల కోసం లోక్సభలో 181 సీట్లు అదనంగా జోడించాలని ప్రతిపాదనలు ముందుకు తెచ్చాయి. ఇది లోక్ సభలో మూడోవంతు. జేఎన్యూ మాజీ ప్రొఫెసర్ సుధా పాయి మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం చాలా సంక్లిష్టమైందని, కష్ట సాధ్యమైందన్నారు. రిజర్వేషన్ ఆమోదం కోసం విభిన్న రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో అధికార, విపక్షాల మధ్య ఏకాభిప్రాయం అవసరమని ఆమె వ్యాఖ్యానించారు.
బిల్లుపై శరద్ యాదవ్ ఇలా..
ఆర్జేడీ, జేడీయూ, సమాజ్ వాదీ పార్టీలు తొలుత తాము సూత్రప్రాయంగా మహిళా రిజర్వేషన్ల అమలుకు వ్యతిరేకం కాదని చెప్తూనే అణగారిన వర్గాల వారికి ప్రాధాన్యం కల్పించాలని డిమాండ్ చేశాయి. సంపన్న వర్గాల వారికి మహిళా రిజర్వేషన్లు అవసరం లేదని నొక్కి చెప్పాయి. ‘సోనియాగాంధీ గానీ, అంతకుముందు ఇందిరాగాంధీ గానీ పార్లమెంట్లో అడుగు పెట్టేందుకు రిజర్వేషన్ కావాల్సి వచ్చిందా?' అని జేడీయూ సీనియర్ నేత శరద్ యాదవ్ చేసిన వ్యాఖ్య సంచలనం రేపింది.
వ్యాఖ్యకు ఆరెస్సెస్ నిరాకరణ
2014 లోక్సభ ఎన్నికల మ్యానిఫెస్టోలోనూ మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదానికి కట్టుబడి ఉన్నామని బీజేపీ హామీనిచ్చింది. కానీ తర్వాత దాని ప్రస్తావనే మరిచిపోయినట్లు వ్యవహరించింది. ఎన్నికల ప్రచారంలో ప్రగతే తమ నినాదమని పదేపదే వాదించింది. దాని మార్గదర్శక సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) మాత్రం దీనిపై వ్యాఖ్యానించేందుకు నిరాకరించింది. ఇది పూర్తిగా రాజకీయ నిర్ణయం అని దాటవేసింది. జాతి నిర్మాణంలో విధాన నిర్ణయాల్లో మహిళలకు కీలక బాధ్యతలు అప్పగించాలని మాత్రం ఆరెస్సెస్ నేత ఒకరు వ్యాఖ్యానించారు.
మహిళా బిల్లుపై రాహుల్
అతిపెద్ద ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ పార్టీ మహిళా రిజర్వేషన్ల బిల్లు ఆమోదానికి గట్టి మద్దతు దారుగా నిలిచింది. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ నుంచి అమలుకు నోచుకోని వాగ్దానంగానే మిగిలిపోయింది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సైతం ‘మహిళలకు హక్కులు కల్పిస్తే వారిని వారు రక్షించుకోగలరు' అని వ్యాఖ్యానించారు.
బిల్లు ఆమోదానికి తొలిసారి మోదీ సర్కార్ హామీ
ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా ఈ దఫా మహిళా సాధికారత గురించి బాగానే హామీలు గుప్పించారు. 2014 మేలో ఆయన పార్టీ బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత అదే ఏడాది తొలి పార్లమెంట్ సమావేశాల్లో ప్రసంగించిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రసంగంలో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందడం తమ ప్రభుత్వ విజన్ అని పేర్కొన్నారు. ‘దేశ ప్రగతి, సమాజాభివ్రుద్ధిలో మహిళలు ముఖ్యమైన పాత్ర పోషించాలని మా ప్రభుత్వం గుర్తింపునిస్తుంది. పార్లమెంట్, రాష్ట్రాల అసెంబ్లీల్లో 33 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు కట్టుబడి ఉంది' ప్రణబ్ తన ప్రసంగంలో చెప్పారు. కానీ రాష్ట్రపతి ప్రసంగంలో ఆ హామీ చేర్చిందన్న మాటే గానీ బిల్లు ఆమోదం కోసం ప్రభుత్వం ఎటువంటి చర్య తీసుకోలేదు.
మహిళా బిల్లుపై బ్రుందాకారత్ ఇలా..
సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు శ్రీమతి బ్రుందాకారత్ మాట్లాడుతూ ‘2010లో రాజ్యసభ మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించింది. రాజ్యసభ, లోక్ సభకు మధ్య దూరం చాలా తక్కువ. ఐదు నిమిషాల్లో చేరుకోవచ్చు. కానీ ఏడేళ్లుగా మహిళా రిజర్వేషన్ బిల్లు మాత్రం ముందుకు సాగడం లేదు. పిత్రుస్వామ్య వ్యవస్థలో మహిళా రిజర్వేషన్ బిల్లు బలైపోతున్నది. పురుషాధిక్య హోదాకు ప్రతిబింబంగా ఉంది' అని మండిపడ్డారు. ప్రభుత్వ చిత్తశుద్ధి లోపమే మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదంలో జాప్యానికి కారణమని ఆమె అన్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో అంతా వన్ మ్యాన్ షో సాగుతున్నందున బిల్లు ఆమోదంలో వైఫల్యానికి బాధ్యత ప్రధానమంత్రి నరేంద్రమోదీదే బాధ్యత అని బ్రుందాకరత్ స్పష్టంచేశారు. ప్రతి పార్లమెంట్ సమావేశాలకు ముందు తరువాత పలు బిల్లులపై రహస్యంగా, బహిరంగంగా పార్టీలు, స్టాండింగ్ కమిటీల్లో చర్చోపచర్చలు జరుగుతాయి. కానీ మహిళా రిజర్వేషన్ల బిల్లు ప్రస్తావన మాత్రం రాదు.