నా తండ్రి ఎక్కడకూ పారిపోలేదు, ఏం ఇదంతా ట్రంప్ చేయిస్తున్నారా?: కార్తి చిదంబరం
న్యూఢిల్లీ: తన తండ్రి చిదంబరం అరెస్ట్ రాజకీయ ప్రేరేపితమని కార్తి చిదంబరం బుధవారం ఆరోపించారు. దర్యాఫ్తు సంస్థల తీరును ఆయన తప్పుబట్టారు. తన తండ్రి ఏ రోజు కూడా తప్పించుకునే ప్రయత్నాలు చేయలేదన్నారు. 2008లో జరిగిన దానికి 2017లో కేసు నమోదు చేశారని, సమన్లు అందిన ప్రతిసారి విచారణకు హాజరయ్యారన్నారు. సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ హడావుడి అన్నారు. నా తండ్రి ఎక్కడకూ పారిపోలేదని, కోర్టులో తమకు న్యాయం జరుగుతుందన్నారు.
ఇదంతా బీజేపీ తప్ప ఎవరు చేస్తున్నారని, డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నారని మీరు భావిస్తున్నారా? అని మీడియా అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా కార్తి చిదంబరం ఎదురు ప్రశ్న వేశారు. ఈడీ పలుమార్లు సమన్లు జారీ చేసిందని, ఆయన కూడా హాజరయ్యారని, మేం కోర్టుకు వెళ్తామని, క్లీన్గా తిరిగి వస్తామని చెప్పారు.
ఐఎన్ఎక్స్ మీడియా ముడుపుల వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరంను సీబీఐ బుధవారం రాత్రి పది గంటల సమయంలో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీ పోలీసుల సాయంతో ఆయనను అరెస్టు చేసిన అనంతరం, ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం సీబీఐ హెడ్ క్వార్టర్కు తరలించారు. రాత్రి ఆయనను అక్కడే ఉంచి, గురువారం కోర్టు ఎదుట హాజరుపరుస్తారు. ఆయనను అరెస్టు చేసి తీసుకెళ్లే సమయంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వాహనాలను అడ్డుకునే ప్రయత్నం చేశారు.
అంతకుముందు, 24 గంటల పాటు అజ్ఞాతంలో ఉన్న చిదంబరం హఠాత్తుగా ఢిల్లీలోని కాంగ్రెస్ కార్యాలయంలో మీడియా ముందుకు వచ్చారు. తాను ఎలాంటి నేరం చేయలేదని, సీబీఐ, ఈడీ నుంచి తనపై ఎలాంటి ఛార్జీషీట్ లేదన్నారు. తనపై, తన కుమారుడిపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారన్నారు. ఎఫ్ఐఆర్ నమోదయినంత మాత్రాన ఎవరూ నేరస్థులు కాదన్నారు. ఏడాదిన్నరగా తాను మధ్యంతర బెయిల్ పైన ఉన్నట్లు చెప్పారు. గత 24 గంటల్లో ఎంతో జరిగిందన్నారు. చట్టాన్ని తాను గౌరవస్తానని, సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు నడుచుకుంటానన్నారు.
ఈ కేసు విషయంలో కొద్ది రోజులుగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముందస్తు బెయిల్ కోసం చిదంబరం ఢిల్లీ హైకోర్టు గడప తొక్కారు. ఆయన పిటిషన్ను న్యాయస్థానం తిరస్కరించింది. దీంతో మంగళవారం సీబీఐ అధికారులు చిదంబరం ఇంటికి వెళ్లారు. ఆయన లేకపోవడంతో వెనుదిరిగారు. బుధవారం చిదంబరం తన లాయర్ ద్వారా సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అక్కడా నిరాశ ఎదురైంది. దీంతో బుధవారం రాత్రి ఆయన కాంగ్రెస్ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆ తర్వాత ఇంటికి వెళ్లారు. సీబీఐ అధికారులు కాంగ్రెస్ కార్యాలయానికి వెళ్లారు. అప్పటికే చిదంబరం అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఇంటికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. హైడ్రామా మధ్య ఆయనను అదుపులోకి తీసుకున్నారు.