జైల్లో శశికళకు రాజభోగాలు: ఐదు గదులు, వంట మనిషితో ప్రత్యేక వసతులు
బెంగళూరు: దివంగత జయలలిత నెచ్చెలి శశికళ జైల్లో రాజభోగాలు అనుభవిస్తున్నారట. ఆమె పరప్పన అగ్రహార జైల్లో శిక్షను అనుభవిస్తోన్న విషయం తెలిసిందే. అయితే జైల్లో ఆమె ఎలా ఉన్నారనే విషయం సమాచార హక్కు చట్టం ద్వారా వెలుగు చూసింది. ఎన్ మూర్తి అనే సామాజికవేత్త ఈ వివరాలు తెలుసుకున్నారు. జైల్లో శశికళకు ప్రత్యేక వసతులు కల్పిస్తున్నారు.
ఆయన మాట్లాడుతూ... శశికళ విషయంలో జైలు అధికారులు తప్పుడు ప్రచారం చేశారన్నారు. ఆమెకు వీఐపీ సౌకర్యాలు కల్పిస్తున్నారనే విషయం ఇప్పుడు బహిర్గతమైందన్నారు. తొలుత ఆమెకు ఒక గది మాత్రమే కేటాయించారని, ఆమె పక్కనున్న నాలుగు గదుల్లో 2017 ఫిబ్రవరి 14 వరకు మహిళా ఖైదీలు ఉన్నారన్నారు. ఆ తర్వాత వారందరినీ వేరే గదులకు తరలించి, అయిదు గదులను శశికళకే కేటాయించారన్నారు.
ఆమెకు వంట చేయడం కోసం ప్రత్యేకంగా ఒక ఖైదీని కేటాయించారని చెప్పారు. ఆమెను చూసేందుకు పెద్ద సంఖ్యలో విజిటర్స్ను అనుమతిస్తున్నారని చెప్పారు. వారంతా నేరుగా ఆమె గదికే వెళ్లి మూడు, నాలుగు గంటలు ఉంటున్నారని చెప్పారు.
శశికళకు ప్రత్యేక వసతులు కల్పిస్తున్నారంటూ జైళ్ల శాఖ డీఐజీ రూప 2017 జూలైలో ఆరోపించారు. ఈ వసతుల కోసం జైలు అధికారులకు శశికళ రూ.2 కోట్ల లంచం ఇచ్చారని ఆమె చేసిన వ్యాఖ్యలు నాడు సంచలనం రేపాయి. ఇప్పుడు సమాచార హక్కు చట్టం ద్వారా ఆ వ్యాఖ్యలు నిజమని తేలాయి.