వీరు పెళ్లి చేసుకోరు...అది మాత్రమే చేస్తారు: హేమంత్ సోరెన్ వివాదాస్పద వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, అత్యాచారాలు పొలిటికల్ టర్న్ తీసుకుంటున్నాయి. అధికారంలో ఉన్న పార్టీలపై విపక్షాలు నిప్పులు చెరుగుతున్నాయి. మహిళలకు రక్షణ కల్పించలేని అసమర్థ పాలనను ప్రభుత్వాలు అందిస్తున్నాయని విపక్ష పార్టీ సభ్యులు ధ్వజమెత్తుతున్నారు. ఈ క్రమంలోనే జేఎంఎం వర్కింగ్ ప్రెసిడెంట్ హేమంత్ సోరెన్ ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ పై ఫైర్ అయ్యారు.
ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ను ఉద్దేశించి జేఎంఎం వర్కింగ్ ప్రెసిడెంట్ హేమంత్ సోరెన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాషాయరంగు వస్త్రాలు ధరించే నాయకులు పెళ్లి చేసుకోరని కేవలం రేప్లు మాత్రమే చేస్తారని ధ్వజమెత్తారు. చాలా మంది మహిళలపై అత్యాచారాలు చేసి వారిని తగలబెడుతున్నారు అని చెప్పిన హేమంత్ సోరెన్... ఆ సమయంలో యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ జార్ఖండ్లోని ధన్బాద్లో కాషాయ వస్త్రాలు ధరించి తిరుగుతున్నట్లు తనకు తెలిసిందని చెప్పారు.
బీజేపీ కార్యకర్తలు పెళ్లి చేసుకోరని కేవలం కాషాయ దుస్తులు ధరించి అత్యాచారాలకు పాల్పడుతుంటారని మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలు ఆయన పాకూర్ ఎన్నికల ర్యాలీలో చేసినట్లు సమాచారం. డిసెంబర్ 20వ జార్ఖండ్కు చివరి దశ పోలింగ్ జరుగనున్న నేపథ్యంలో సోరెన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
జార్ఖండ్లోని ధన్బాద్లో బీజేపీ తరపున స్టార్ క్యాంపెయినర్ హోదాలో యోగీ ఆదిత్యనాథ్ పాల్గొన్నారు. ఆ సమయంలో కేంద్రం సాధించిన విజయాలను చెప్పుకొచ్చారు. అంతేకాదు ఆర్టికల్ 370 రద్దు, రామమందిర నిర్మాణం వంటి అంశాలు బీజేపీ విజయాలుగా అభివర్ణించారు. మరోవైపు కేంద్రం తీసుకొచ్చిన పౌరసత్వ చట్టం, ఎన్ఆర్సీలపై సోరెన్ మండిపడ్డారు.
మతం, కులం అంశాలు తీసుకొచ్చి ప్రజల మద్య చిచ్చుపెట్టి బీజేపీ నాయకులు ఓట్లు దండుకుంటున్నారని మండిపడ్డ సోరెన్ వారికి సర్దార్ పటేల్, శ్రీరాముడు బోధించిన విలువలతో పనిలేదని చెప్పారు. బీజేపీ నేతలు కాషాయ ముసుగులో మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్నారని చెబుతూ షాజహాన్పూర్లోని అత్యాచార ఘటనను ప్రస్తావించారు. దీనిపై బీజేపీ నేత చిన్మయానంద్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.