యూపీ బీజేపీదే, కానీ అది పెద్ద సవాల్: మోడీ కంటే అఖిలేష్ బెస్ట్!
ఇండియా టుడే - యాక్సిస్ సర్వేలో మాత్రం బీజేపీ స్పష్టంగా విజయం సాధిస్తుందని తేలింది. ఎస్పీలో రగడకు ముందు ఈ సర్వేలు చేశారు.
లక్నో: దేశంలో మినీ ఇండియా ఎన్నికల వేడి కనిపిస్తోంది. యూపీ, గోవా, పంజాబ్, మణిపూర్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలలో ఎన్నికలు జరగనున్నాయి. ప్రధానంగా అందరి దృష్టి ఉత్తర ప్రదేశ్ పైన ఉంది. సమాజ్వాది పార్టీలో చిచ్చు నేపథ్యంలో మరింత ఉత్కంఠగా మారింది.
బీజేపీ కాదు.. ఎస్పీ గెలుస్తుందని చెప్పిన మరో సర్వే
ఎస్పీలో గొడవలకు ముందు పలు సంస్థలు గెలుపు పైన సర్వే చేశాయి. ఎస్పీ అత్యధిక స్థానాలు గెలుచుకుంటుందని, కానీ మేజిక్ ఫిగర్కు చాలా దూరంలో ఉంటుందని ఏబీపీ-సీఎస్డీఎస్ ఒపీనియన్ సర్వేలో తేలింది.
ఇండియా టుడే - యాక్సిస్ సర్వేలో మాత్రం బీజేపీ స్పష్టంగా విజయం సాధిస్తుందని తేలింది. ఎస్పీలో రగడకు ముందు ఈ సర్వేలు చేశారు. ఇప్పుడు ఎస్పీలో గొడవలు ముదరడం.. బీజేపీకి మరింత లాభదాయకమంగా భావిస్తున్నారు. తద్వారా, యూపీలో 14 ఏళ్ల బీజేపీ వనవాసానికి ఈ ఎన్నికలు ముగింపు పలకనున్నాయని అంటున్నారు.
దూసుకెళ్తున్న బీజేపీ
ఇండియా టుడే - యాక్సిస్ సర్వే ప్రకారం యూపీలో బీజేపీ 206 నుంచి 2016 సీట్లు గెలుచుకుంటుంది. త్వరలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో పలుమార్లు సంస్థలు సర్వే నిర్వహించాయి. ఇదే సంస్థ తొలుత అక్టోబర్ నెలలో నిర్వహించిన సర్వేలో బీజేపీకి వచ్చే సీట్లు తెలిపింది. అయితే, తాజా సర్వేలో గతంలో కంటే బీజేపీకి 30 సీట్లు ఎక్కువగా వస్తాయని తేలిందని పేర్కొంది.
రెండో అతిపెద్ద పార్టీగా సమాజ్ వాదీ
ఈ సర్వేలో బీజేపీ అధికారంలోకి రానుందని తేలగా, రెండో అతిపెద్ద పార్టీగా సమాజ్ వాది పార్టీ నిలవనుందని తేలింది. ఎస్పీకి 92 నుంచి 97 సీట్లు దక్కనున్నాయి. ఇటీవల ఎస్పీలో రగడ బాగా ముదిరింది. చీలిక దిశగా నడుస్తోంది. అయితే, అంతకుముందు చిన్నా చితక గొడవలు ఉన్నప్పుడు చేసిన సర్వే. ఆ గొడవలు ఉన్నప్పటికీ బీఎస్పీ కంటే ఎస్పీ వైపే ఎక్కువ మంది మొగ్గు చూపారు. అయితే, ఎస్పీ చీలితే మాత్రం బీజేపీకి మరింత లాభమని తాజాగా భావిస్తున్నారు.
మూడో స్థానానికే మాయావతి పరిమితం
మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ మూడో స్థానానికి పరిమితం కానుంది. బీఎస్పీ 79-85 సీట్లు గెలుచుకునే అవకాశముందని సర్వేలో తేలింది. తొలుత గత ఏడాది అక్టోబరులో చేసిన సర్వేలో బీఎస్పీకి 115-124 సీట్లు వస్తాయని తేలింది. కానీ ఆ తర్వాత మరో 30 సీట్లకు పైగా తగ్గింది. 2007లో మాయావతి దళిత ఓటు బ్యాంకుతో పాటు రాష్ట్రంలో పద్నాలుగు శాతానికి పైగా ఉన్న బ్రాహ్మణులను కలుపుకొని వెళ్లి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు బీఎస్పీకి నాన్ దళితుల నుంచి పెద్దగా మద్దతు లేదంటున్నారు.
28 నుంచి 9కి పడిపోనున్న కాంగ్రెస్
2012 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 28 సీట్లు గెలుచుకుంది. ఇప్పుడు 5-9 సీట్లు మాత్రమే గెలుచుకునే అవకాశముందని తేలింది. రాహుల్ గాంధీ ప్రచారం, ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహాలు యూపీలో కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం కలిసి వచ్చేలా కనిపించడం లేదని తేలింది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ బీజేపీకి, ఆ తర్వాత బీహార్ ఎన్నికల్లో జేడీయూకు వ్యూహకర్తగా పనిచేశారు. అప్పుడు ఆ రెండు పార్టీలు విజయం సాధించాయి. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం కలిసి వచ్చేలా కనిపించడం లేదు.
పెరుగుతున్న బీజేపీ ఓటు బ్యాంకు
గత ఏడాది అక్టోబర్ నెలలో సర్వే చేయగా బీజేపీకి 31 శాతం ఓటు బ్యాంకు కనిపించింది. ఆ తర్వాత సర్వేలో 33 శాతానికి పెరిగింది. ఇప్పుడు ఎస్పీలో గొడవ.. మరింత ఓటు బ్యాంకు పెంచేలా కనిపిస్తోందని అంటున్నారు.
ఎస్పీ, బీఎస్పీకి సమాన ఓటు బ్యాంకు కానీ..
ఎస్పీ, బీఎస్పీలకు సమాన ఓటు బ్యాంకు వచ్చే అవకాశముందని ఇండియా టుడే - యాక్సిస్ సర్వేలో తేలింది. ఇరు పార్టీలకు 26 శాతం ఓటు బ్యాంకు వస్తుందని తేలింది. కానీ సీట్లు మాత్రం ఎస్పీకి ఎక్కువ వచ్చే అవకాశముంది.
మోడీ నోట్ల రద్దుకు మద్దతు
సర్వేలో పాల్గొన్న వారిలో 76 శాతం మంది ప్రధాని మోడీ నోట్ల రద్దు నిర్ణయాన్ని స్వాగతించారు. తాము నోట్ల రద్దు వల్ల ఇబ్బందులు పడ్డామని 58 శాతం మంది, పడలేదని 42 శాతం మంది తెలిపారు. అయితే, మొత్తానికి నోట్ల రద్దు వల్ల దేశానికి మంచిదని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. నోట్ల రద్దు వల్ల నల్ల ధనం, ఫేక్ కరెన్సీ లేకుండా పోతుందని చెప్పారు.
ఎస్పీకే యాదవుల మద్దతు
యాదవుల ఓట్లు ఎస్పీకి ఉంటాయి. అయితే బీజేపీ ఆ ఓట్ల కోసం ప్రయత్నించినా ఆశలు వమ్మే అంటున్నారు. 72 శాతం మంది యాదవులు సమాజ్ వాది పార్టీ (ఎస్పీలో రగడకు ముందు) వైపే మొగ్గు చూపారు.
మైనార్టీలు..
మైనార్టీ ముస్లీంలు గత ఎన్నికల్లో ఎస్పీ, బీఎస్పీల వైపు మొగ్గు చూపారు. ప్రస్తుతం వాళ్లు ఎక్కువగా ఎస్పీ వైపు మొగ్గు చూపుతున్నారు. 71 శాతం మంది ముస్లీంలో ఎస్పీ వైపు మొగ్గినట్లు డిసెంబర్లో చేసిన సర్వేలో తేలింది. అంతకుముందు అక్టోబర్ నెలలో కేవలం 58 శాతం మంది మాత్రమే ముస్లీంలు ఎస్పీ వైపు మొగ్గారు. డిసెంబర్ నాటికి అది బాగా పెరిగింది. అదే సమయంలో బీఎస్పీకి 21 శాతం నుంచి 14 శాతానికి తగ్గింది.
యువత మద్దతు ఎస్పీకే ఎక్కువ
అన్ని వయసుల వారికంటే యువత మద్దతు ఎస్పీకి ఎక్కువగా ఉంది. అఖిలేష్ యాదవ్ కారణంగా యువత ఆ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. బీజేపీ వైపు 60 ఏళ్లకు పైగా ఉన్న వారు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. 37 శాతం మంది ఆ వయసు వారు కమలానికి జై కొడుతున్నారు. మొత్తం ఓట్లలో వీరిది నాలుగు శాతం.
ముఖ్యమంత్రిగా అఖిలేష్కు
33 శాతం మంది ముఖ్యమంత్రిగా అఖిలేష్ యాదవ్కు మద్దతు పలుకుతున్నారు. 22 శాతం మంది మాయావతి సీఎంగా కావాలని కోరుకుంటున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సీఎం రేసులో లేరు. కానీ ఆయన సీఎం కావాలని 20 శాతం మంది యూపీవాసులు కోరుకుంటున్నారు.
లా అండ్ ఆర్డర్
శాంతిభద్రతల విషయంలో మాయావతి బెట్టర్ అని ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు. మాయావతి లా అండ్ ఆర్డర్ విషయంలో చాలా ఉత్తమం అని 48 శాతం మంది చెప్పగా, 28 శాతం మంది అఖిలేష్ యాదవ్ బెస్ట్ అన్నారు. కాగా, 8480 మందిని ఇండియా టుడే - యాక్సిస్ సర్వే చేసింది. ఈ సర్వే డిసెంబర్ 12 నుంచి 24వ తేదీ మధ్య జరిగింది.
ముక్కలైనా, ఇతర పార్టీలు కలిసినా... తారుమారు కావొచ్చు
ఎస్పీలో రగడ ముదరక ముందు ఈ సర్వే చేశారు. కాబట్టి ఎస్పీ ముక్కలైతే అది బీజేపీకి లాభించవచ్చునని అంటున్నారు. అదే సమయంలో ఎస్పీ, కాంగ్రెస్, ఆర్ఎల్డీలు కలిసి పోటీ చేసినా అటు ఇటు కావొచ్చునని చెబుతున్నారు. అలాగే సెక్యులర్ ఫోర్సెస్ పేరుతో బీహార్లా పోటీ చేసినా ఫలితాలు మారుతాయని అంటున్నారు.
దళిత్ ప్లస్ ముస్లీం పెద్ద సవాల్
ఎస్పీ ముక్కలయితే ముస్లీం మైనార్టీలు ఎస్పీ నుంచి బీఎస్పీ వైపు లేదా కాంగ్రెస్ వైపు మళ్లవచ్చునని అంటున్నారు. దళిత్ ప్లస్ ముస్లింలు కలిస్తే అధి బీజేపీకి పెద్ద సవాల్ అని అంటున్నారు.
2012లో ఇవీ సీట్లు
2012లో సమాజ్ వాది పార్టీ 224 సీట్లు గెలుచుకుంది. బహుజన్ సమాజ్ పార్టీ 80 సీట్లు, భారతీయ జనతా పార్టీ 47 సీట్లు, కాంగ్రెస్ పార్టీ 28 సీట్లు, ఆర్ఎల్డీ 9 సీట్లు, ఇతరులు 15 సీట్లు గెలుచుకున్నారు.