పంజాబ్, గోవాల్లో పోలింగ్: క్యూలో నిలబడి ఓటేసిన పారికర్
పంజాబ్, గోవా శాసనసభ ఎన్నికల పోలింగ్ శనివారంనాడు ప్రారంభమైంది. గోవాలో తమ పార్టీ గెలిచి తీరుతుందని పారికర్ అన్నారు.
న్యూఢిల్లీ : పంజాబ్, గోవా శాసనసభ ఎన్నికల పోలింగ్ శనివారం ఉదయం ప్రారంభమైంది. పంజాబ్లోని 117 స్థానాలకు, గోవాలోని 40 స్థానాలకు శనివారం పోలింగ్ జరుగుతోంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు బారులు తీరడం కనిపించింది.
కాగా, ఉదయం 9.30గంటల వరకే గోవాలో 15శాతం ఓట్లు పోలయ్యాయి.
పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పానాజీలో రక్షణ మంత్రి మనోహర్ పారికర్ క్యూలో నిలబడి ఓటు హక్కును వినియోగించుకున్నారు. గోవాలో భారీగా ఓటింగు నమోదమవుతున్నట్లు చెప్పారు. తాము గెలుస్తామన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు.
తొలిసారిగా ఈ ఎన్నికల్లో పోస్టల బ్యాలెట్లకు బదులు ఈ -బ్యాలెట్ వాడుతున్నారు. సైనికులతో సహా వివిధ సర్వీసుల్లో ఉన్న ఉద్యోగులు దీని ద్వారా ఆన్లైన్లో ఓటు హక్కు వినియోగించుకుంటారు. గోవాలో 40 స్థానాలకు 251 మంది అభ్యర్థులు పంజాబ్లో 117 స్థానాలకు 1145 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
గోవాలో 1,642 పోలింగ్ కేంద్రాలు, పంజాబ్లో 22,615 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు మార్చి 11వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడుతాయి.