సజావుగా సాగుతున్న నాల్గో విడత పోలింగ్.. ఓటు వేసిన పలువురు ప్రముఖులు
సార్వత్రిక ఎన్నికల నాల్గో విడత పోలింగ్ సజావుగా సాగుతోంది. 9 రాష్ట్రాల్లోని 72 నియోజకవర్గాల్లో ప్రజలు ఓటుహక్కు వినియోగించుకుంటున్నారు. ఈ దఫా ఎన్నికల్లో 963మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేస్తున్నారు. ఉదయం నుంచి ఓటర్లు పోలింగ్ స్టేషన్ల వద్ద క్యూ కట్టారు. పలువురు సెలబ్రిటీలు ఓటు హక్కు వినియోగించుకున్నారు.
నేడే నాలుగో విడత పోలింగ్.. పోలింగ్ కేంద్రాల దగ్గర ఓటర్ల క్యూ
బారులు తీరిన జనం
ఉదయం పోలింగ్ ప్రారంభం అయ్యే సమయానికి ఓటర్లు భారీ సంఖ్యలో పోలింగ్ స్టేషన్లకు చేరుకున్నారు. ఎండ తీవ్రత పెరిగేలోపే ఓటు హక్కు వినియోగించుకోవాలన్న ఉద్దేశంతో పోలింగ్ బూత్ల వద్ద క్యూ కట్టారు.నాల్గో విడత పోలింగ్లో అక్కడక్కడా కొన్ని ఈవీఎంలు మొరాయించాయి. యూపీలోని హమీర్పూర్, బెంగాల్ బోల్పూర్లో ఈవీఎంలలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో పోలింగ్ కాస్త ఆలస్యంగా ప్రారంభమైంది.
ఓటు వేసిన పలువురు నాయకులు
నాల్గో విడత పోలింగ్లో పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. బీహార్లోని లఖీసరాయ్ జిల్లా బరాహియాలో కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ఓటు వేశారు. రాజస్థాన్ మాజీ సీఎం వసుంధరా రాజే జలావర్లో ఓటు వేశారు. ముంబై నార్త్ సెంట్రల్ బీజేపీ అభ్యర్థి పూనమ్ మహజన్ వర్లీలో ఓటు హక్కు వినియోగించుకోగా.. అలనాటి నటి రేఖ బాంద్రాలో ఓటు వేశారు. ఉత్తర్ ప్రదేశ్ గోరఖ్పూర్ అభ్యర్థి రవికిషన్ ముంబైలోని గోరేగావ్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
క్యూలైన్లో నిలబడ్డ ఆర్బీఐ గవర్నర్
రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ ముంబై పెద్దార్ రోడ్లోని పోలింగ్ బూత్లో తన వంతు కోసం క్యూలో వేచిచూసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ముంబైలోని జీడీ సోమని స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్లో అనిల్ అంబానీ ఓటు వేశారు.