మొరాయిస్తున్న ఈవీఎంలు, చాలా చోట్ల ఆలస్యంగా పోలింగ్ ఆరంభం!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఆరంభమైన రెండోదశ పోలింగ్ సందర్భంగా పలుచోట్ల ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు మొరాయిస్తున్నాయి. తమిళనాడు, కర్ణాటక, ఒడిశా, మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఈవీఎంలల్లో సాంకేతిక లోపాలు ఏర్పడ్డాయి. ఫలితంగా ఆయా రాష్ట్రాల్లోని కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 9 గంటల వరకూ పోలింగ్ ఆరంభం కాలేదు. సమాచారం అందుకున్న వెంటనే సాంకేతిక సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు చేరుకుని, వాటిని సరి చేస్తున్నారు.
ఉత్తర్ ప్రదేశ్ లోని మథుర, ఆగ్రా, ఫతేపూర్ సిక్రీ లోక్ సభ నియోజకవర్గాల్లో కొన్ని చోట్ల పోలింగ్ ఆలస్యంగా ఆరంభమైంది. సీనియర్ నటి డ్రీమ్ గర్ల్ హేమామాలిని బీజేపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న మథుర లోక్ సభ పరిధిలో పోలింగ్ ఆలస్యంగా ఆరంభమైంది. ఈ నియోజకవర్గంలోని కొన్నికేంద్రాల్లో మాక్ పోలింగ్ లోనూ ఈవీఎంలల్లో లోపాలు తలెత్తినట్లు తెలుస్తోంది. ఘంటోలి గ్రామంలోని పలు బూత్ లల్లో ఉదయం 9 గంటల వరకు కూడా పోలింగ్ ఆరంభం కాలేదని సమాచారం. ఒడిశాలోని బోలంగిర్ లోక్ సభ పరిధిలో ఇదే తరహా సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఇక్కడ ఆలస్యంగా పోలింగ్ ఆరంభమైంది.
ఓటు వేసిన సూపర్ స్టార్స్: పోలింగ్ కేంద్రం వద్ద కుమార్తెతో కలిసి వరుసలో నిల్చుని..!
మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో అయిదు గ్రామాల్లో పెద్ద ఎత్తున ఈవీఎంలు మొరాయించినట్లు సమాచారం అందిందని, వెంటనే సాంకేతిక సిబ్బందిని తరలించి, లోపాలను సరి చేస్తున్నామని కలెక్టర్ అస్తిక్ కుమార్ పాండే తెలిపారు. ఈవీఎంలే కాకుండా.. వీవీప్యాట్ స్లిప్పులు కూడా సరిగ్గా పనిచేయట్లేదంటూ ఎన్నికల సిబ్బంది నుంచి ఫిర్యాదులు అందాయని ఆయన చెప్పారు.