పోలింగ్ అధికారుల్లో అందమైన అధికారులు వేరయా !! ఆమె ఎవరో తెలుసా ?
లక్నో: లేత పసుపురంగు చీర, స్లీవ్లెస్ జాకెట్, కళ్లకు చలువ కళ్లద్దాలు ధరించి..భుజాల వరకు జారవిడచుకున్న ముంగురులతో చూపు తిప్పుకోనివ్వని సొయగాలతో నెటిజన్లను కట్టి పడేసిన ఆ అధికారిణి ఫొటో.. కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తూ వస్తోంది. ఓ చేత్తో సెల్ఫోన్, మరో చేత్తో ఈవీఎం ఉన్న బాక్స్ను పట్టుకుని, ర్యాంప్పై క్యాట్వాక్ చేస్తోన్న టాప్ మోడల్స్ను తలదన్నేలా, అడుగులో అడుగు వేస్తూ స్టైలిష్గాకనిపించిన ఆ ఎల్లో శారీ అధికారిణి ఎవరా అంటూ గూగుల్ తల్లిని ప్రశ్నించారు నెటిజనం. ఆమె గురించి తెగ వెదికేశారు. ఫొటో తప్ప ఆమెకు సంబంధించిన మరే ఇతర వివరాలను వెల్లడించలేదు గూగుల్ తల్లి. దీనితో తీవ్ర నిరాశకు గురయ్యారు ఆమె అభిమానులు. చివరాఖరికి- ఎడారిలో పన్నీటి జల్లు కురిసిన చందాన- ఆమె ఎవరో తెలిసిపోయింది. ఆ ఓవర్ నైట్ స్టార్ గురించి ఎట్టకేలకు కూపీ లాగారు.
కేరాఫ్..ఉత్తర్ ప్రదేశ్
ఆ అధికారిణి పేరు రీనా ద్వివేది. ఉత్తర్ ప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారు. ఓ సాధారణ జూనియర్ అసిస్టెంట్. ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వంలో ప్రజా పనుల విభాగం (పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్-పీడబ్ల్యూడీ)లో పనిచేస్తున్నారు. ఎన్నికల విధి నిర్వహణలో భాగంగా- ఆమె వెలుగులోకి వచ్చారు. రాజధాని లక్నోకు సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న నగ్రామ్ పోలింగ్ బూత్లో ఆమె ఎన్నికల విధుల్లో పాల్గొన్నారు. ఈ నెల 6వ తేదీన పూర్తయిన అయిదో విడత ఎన్నికల విధులకు ఆమె హాజరయ్యారు. పోలింగ్కు ముందురోజు ఈవీఎంలను తీసుకెళ్తున్న సమయంలో తుషార్ అనే ఓ ప్రెస్ ఫొటోగ్రాఫర్ రీనా ద్వివేదీని ఫొటో తీశారు. నెట్టింట్లో పోస్ట్ చేశారు. అంతే! ఒక్కసారిగా ఆ పిక్ కాస్తా వైరల్గా మారిపోయింది. రీనాను ఓవర్ నైట్ను స్టార్ చేసింది.
మొదట్లో రాజస్థాన్ అధికారిణిగా
రీనా ద్వివేదీకి సంబంధించి మొదట్లో కొన్ని వార్తలు వచ్చాయి. ఆమె పేరు నళినీ సింగ్ అంటూ వార్తలు వచ్చాయి. పోలింగ్ సందర్భంగా జైపూర్లోని కుమావత్ పాఠశాలలో ఏర్పాటు చేసిన బూత్లో విధి నిర్వహణలో పాల్గొన్నారంటూ వార్తలు వచ్చాయి. ఆ తరువాత ఆ వార్తలు నిజం కాదంటూ తేలింది. అప్పటి నుంచీ మరో రౌండ్ అన్వేషణ మొదలు పెట్టారు జనం. ఎట్టకేలకు ఆమెకు సంబంధించిన నిఖార్సయిన వార్తలు వెలుగులోకి వచ్చాయి.
దక్షిణాది అంటే ఇక్కడా వివక్షేనా?
రీనా ద్వివేదీ ఫొటోను కేంద్రబిందువగా చేసుకుని.. తమ బుర్రకు పదును పెట్టారు నెటిజన్లు. తమలోని సృజనాత్మక శక్తిని చాటుకున్నారు. తమదైన స్టైల్లో రెచ్చిపోయారు. ఈ విషయంలో దక్షిణాది రాష్ట్రాలకు చెందిన వారు ఓ అడుగు ముందే ఉన్నారు. దక్షిణాది రాష్ట్రాలు అంటే కేంద్ర ప్రభుత్వానికి ఎప్పుడూ చిన్న చూపేనని, చివరికి పోలింగ్ అధికారుల పోస్టింగ్లోనూ వివక్ష చూపిందంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇంత అందమైన అధికారిణిని దక్షిణాది రాష్ట్రాల్లో పోలింగ్ విధుల కోసం ఎందుకు నియమించలేదంటూ చెణుకులు విసిరారు.
100 శాతం పోలింగ్..ఆమె చేతి స్పర్శ కోసమైనా!
రీనా ద్వివేదీ విధులు నిర్వర్తిస్తున్న పోలింగ్ కేంద్రంలో వంద శాతం ఓట్లు పోల్ అయి ఉంటాయని అంటున్నారు నెటిజనులు. ఓటు వేయడానికి కాకపోయినా..వేలిపై ఇంకు గుర్తు వేయించుకునే సమయంలో రీనాను స్పర్శించడానికైనా ఓటర్లు సదరు పోలింగ్ కేంద్రం ముందు బారులు తీరి ఉంటారని తమ ఊహాశక్తిని చాటుకున్నారు. నూటికి నూరుశాతం పోలింగ్ నమోదు కావాలంటే- రీనా ద్వివేదీ వంటి అధికారిణులు ఎక్కడ ఉన్నా వెదికి పట్టుకోవాలని, వారికి పోలింగ్ కేంద్రంలో విధుల్లో నియమించాలని ఉచిత సలహాలను ఇస్తున్నారు. అలాంటి అధికారిణులు విధుల్లో ఉంటే ఓటర్లు పోటెత్తుతారని, దానికి తాము గ్యారంటీ అని హామీలు ఇచ్చేస్తున్నారు.
సెల్ఫీల కోసం ఎగబడుతున్నారు..
ఫొటో వైరల్ అయిన తరువాత రీనా ద్వివేదీ ఓవర్ నైట్ స్టార్డమ్ను సాధించుకున్నారు. జనం ఆమెను ఇట్టే గుర్తు పట్టేస్తున్నారు. సెల్ఫీలకు ఎగబడుతున్నారు. పోలింగ్ విధులను ముగించుకొచ్చిన మరుసటి రోజు నుంచే ఆమెకు ఈ సెల్ఫీల తాకిడి అధికమైందట. తాను మార్కెట్కు వెళ్లినా, మాల్కు వెళ్లినా.. జనం గుర్తు పట్టేస్తున్నారని, సెల్ఫీలు తీయించుకుంటున్నారని చెబుతున్నారు రీనా. ఇది తనకు ఆశ్చర్యానికి గురి చేస్తోందని చెబుతున్నారు. సోషల్ మీడియాకు ఇంత శక్తి ఉందా అని అనిపిస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు.