కాలుష్యం చంపేస్తుంది: ఈ రాష్ట్రాల్లో నివసిస్తుంటే ఏడేళ్ల ముందే జీవితం ఫినిష్
భూమిపై నివసిస్తున్న ప్రజలను అతి ఎక్కువగా వేధిస్తున్నది ఏదైనా ఉందా అంటే అది ఒక్క కాలుష్యమే. అయితే కాలుష్యం పరిమితి దాటి ఉందంటే అందుకు కారణం మానవుడే. ఇక ప్రపంచంలో కాలుష్యం అత్యధికంగా ఉన్నదేశాల్లో భారత్ రెండో స్థానంలో నిలిచింది. యూనివర్శిటీ ఆఫ్ షికాగోలోని ఎనర్జీ పాలిసీ ఇన్స్టిట్యూట్ బయటపెట్టిన నివేదిక ప్రకారం భారత్లో కాలుష్యం తారాస్థాయిలో ఉన్నట్లు వెల్లడించింది.
ఏడేళ్ల ముందే మృతి చెందనున్న 48 కోట్ల ప్రజలు
భారతదేశం కాలుష్య కోరల్లో చిక్కకుందని ఎనర్జీ పాలిసీ ఇన్స్టిట్యూట్ చేసిన స్టడీలో వెల్లడైంది. గాలిలో కాలుష్యంను ఎప్పటికప్పుడు చెక్ చేయడంలో భారత్ విఫలమైందని ప్రపంచ ఆరోగ్య సంస్థ విధించిన ప్రమాణాలకు భిన్నంగా ఉందని స్టడీ వెల్లడించింది. ఇప్పటికే భారత్లో కలుషితమైన గాలిని పీల్చడం ద్వారా ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నట్లు నివేదిక వెల్లడించింది. ఇది ఇలానే కొనసాగితే భారత్లో నివసించే 48 కోట్ల మంది ప్రజలు తమ జీవితకాలంలో ఏడేళ్ల ముందే మృతి చెందుతారని పేర్కొంది. 2013-2017కు గాను ఒక వ్యక్తి ఆయుర్దాయం అంటే ఒక మనిషి సగటు జీవితకాలం 69 ఏళ్లు అని ఓ నివేదిక పేర్కొంది. 2011 జనాభా లెక్కలతో పోలిస్తే మరో రెండేళ్లు అధికంగా ఉంటుందని వెల్లడించింది.
ఈ రాష్ట్రాల్లో ప్రజల సగటు జీవితకాలం 62 ఏళ్లు
ఇక ఇండో గాంజెటిక్ ప్రాంతంలోని రాష్ట్రాలు అంటే పంజాబ్, చండీఘడ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తర్ప్రదేశ్, బీహార్, పశ్చిమబెంగాల్లో నివసిస్తున్న ప్రజలు జీవితకాలం ఏడేళ్లు ముందుగానే ముగుస్తుందని స్టడీ పేర్కొంది. అంటే 69గా ఉన్న జీవితకాలం పెరుగుతున్న కాలుష్యం బారిన పడి సగటు జీవితకాలం 62 ఏళ్లకే ముగుస్తుందని నివేదిక వెల్లడించింది.
10 ఏళ్లు ముందే ఈ నగరాల్లో జీవితకాలం ముగుస్తుంది
1998 నుంచి 2016 మధ్య భారత్లో కాలుష్యం 72శాతం పెరిగిందని నివేదిక వెల్లడించింది. పంజాబ్-బెంగాల్ మధ్య నివసిస్తున్న ప్రజలు కాలుష్యం బారిన పడి ముందే మరణిస్తారని నివేదిక వెల్లడించింది.1998లో పంజాబ్-బెంగాల్ బెల్టులో నివసిస్తున్న ప్రజల సగటు జీవితకాలం 3.7 ఏళ్లు ముందుగా ముగిసేదని కాని ఇప్పుడు పరిస్థితి రెట్టింపు అయి 7 ఏళ్ల ముందే తమ జీవితాలను ముగించే అవకాశం ఉన్నట్లు స్టడీ నివేదించింది. ఇక జీవితకాలం ఉన్నదానికంటే 10 ఏళ్లు ముగించే 14 నగరాలను కూడా గుర్తించినట్లు చెప్పిన స్టడీ.. అందులో ఢిల్లీ కూడా ఉందని పేర్కొంది.
ఆరోగ్యంగా ఉండాలంటే ఈ సూచనలు పాటించాల్సిందే
ఇదిలా ఉంటే జీవితకాలం ముందే ముగియకుండా ఉండాలంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ గైడ్లైన్స్ను పాటిస్తే కొంతమేర తగ్గించే అవకాశం ఉందని స్టడీ వెల్లడించింది. ప్రజల జీవితకాలం కొంతవరకు పెంచే అవకాశం ఉందని పేర్కొంది. భారత్ ఈ ఏడాది నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ను ప్రారంభించింది. ఇది సవ్యంగా సాగితే రానున్న ఐదేళ్లలో 20 నుంచి 30శాతం కాలుష్యాన్ని నివారించే అవకాశం ఉందని జోస్యం చెప్పింది. తద్వారా సగటు జీవితకాలం 1.3 ఏడేళ్లు పెరిగే అవకాశం ఉండగా డేంజర్ జోన్లో ఉన్న ఏడు రాష్ట్రాల్లోని ప్రజల జీవితకాలం రెండేళ్లు పెరిగే అవకాశం ఉందని నివేదిక వెల్లడించింది.