దట్టమైన పొగతో ఉక్కిరిబిక్కిరైన ఢిల్లీ! పారని ‘నిషేధం’ మంత్రం!
దేశ రాజధాని ఢిల్లీ ఆశలు అడియాసలయ్యాయి. కాలుష్య రహితంగా దీపావళి పండుగ జరుపుకోవాలంటూ టపాసుల అమ్మకాలపై సుప్రీంకోర్టు నిషేధం విధించినా ప్రయోజనం కలగలేదు. ఎప్పటిలాగే హస్తినవాసులు ఘనంగా దీపావళి పండుగ జరుపు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ ఆశలు అడియాసలయ్యాయి. కాలుష్య రహితంగా దీపావళి పండుగ జరుపుకోవాలంటూ టపాసుల అమ్మకాలపై సుప్రీంకోర్టు నిషేధం విధించినా ప్రయోజనం కలగలేదు.
ఎప్పటిలాగే హస్తినవాసులు ఘనంగా దీపావళి పండుగ జరుపుకున్నారు. టపాసుల మోత మోగించారు. దీంతో ఢిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్)లో ప్రజానీకానికి కాలుష్యం పోటు తప్పలేదు. తగ్గకపోగా ఇంకా ఎక్కువైంది.
నిషేధం విధించినా...
సుప్రీంకోర్టు నిషేధ ప్రభావం పెద్దగా కనిపించలేదు. దీంతో కాలుష్యం పెరిగిపోయి.. వాతావరణంలో దట్టమైన పొగ అలుముకోవడం ఢిల్లీవాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కాలుష్య కణాలు మనిషి శ్వాస వ్యవస్థలోకి ప్రవేశించి.. అనంతరం రక్తప్రవాహంలో కలిసి ఆరోగ్యానికి తీవ్ర నష్టం కలిగిస్తాయి.
గణనీయంగా పడిపోయిన వాయు నాణ్యత...
ఢిల్లీలో కాలుష్యం ప్రమాదకర రెడ్ జోన్కు చేరినట్టు కాలుష్య పర్యవేక్షణ కేంద్రాల్లోని ఆన్లైన్ ఇండికేటర్స్ వెల్లడించాయి. వాయు నాణ్యత కూడా గణనీయంగా పడిపోయింది. రాత్రి ఏడు గంటల నుంచే అల్ట్రాఫైన్ పార్టిక్యూలేట్స్ ప్రమాదకర స్థాయికి పెరిగిపోయాయి. పీఎం 2.5, పీఎం 10 స్థాయికి పెరిగిపోయాయి.
పది రెట్లు పెరిగిన కాలుష్యం...
ఢిల్లీలో కాలుష్యం అత్యంత ప్రమాదకరస్థాయికి చేరిందని పొల్యూషన్ డాటా స్పష్టం చేస్తోంది. రాత్రి 11 గంటల సమయంలో క్యూబిక్ మీటర్ గాలిలో పీఎం2.5, పీఎం 10 మరియు 878, 1,179 మైక్రోగ్రామ్స్ కాలుష్య కణాలు నమోదయ్యాయని ఆర్కే పురం వాతావరణ కేంద్రం తెలిపింది. తాజాగా ఢిల్లీలో కాలుష్యం దాదాపు పది రెట్లు పెరిగిపోయిందని భావిస్తున్నారు.
రాత్రి ఏడు నుంచి ఒకటే మోత...
దీపావళి పండుగ రోజున సాయంత్రం ఆరు గంటల వరకు ఢిల్లీలో సుప్రీంకోర్టు నిషేధ ప్రభావం కనిపించిందని, అప్పటివరకు పెద్దగా టపాసుల మోత మోగలేదని ఢిల్లీ వాసులు తెలిపారు. అయితే, రాత్రి ఏడు గంటల నుంచి పండుగ ప్రభావం యథావిధిగా కనిపించింది. ఎప్పటిలాగే పటాకుల మోత మోగింది. దీనికితోడు ఎలాంటి నిషేధంలేని ఢిల్లీ శివారు ప్రాంతలైన గురుగ్రామ్, నోయిడా, ఘజియాబాద్లలో ఘనంగా దీపావళి పండుగ జరగడం కూడా గణనీయ ప్రభావం చూపిందని అంటున్నారు.