ఆ వర్శిటీలో ఓపెన్ బుక్ పరీక్షలు: ఎండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ చూచిరాత: టెక్స్ట్, నోట్ బుక్స్
న్యూఢిల్లీ: పాండిచ్చేరి యూనివర్శిటీ సరికొత్త విద్యావిధానానికి తెర తీసింది. పరీక్షల్లో కాపీ కొట్టడాన్ని అరికట్టడానికి ఓపెన్ బుక్ పరీక్షల విధానాన్ని అమలు చేయబోతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో తరగతులను నిర్వహించే అవకాశం లేదు. విద్యార్థులు ఆన్లైన్ క్లాసులకు ఆశించిన స్థాయిలో హాజరు కావట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో చివరి సెమిస్టర్ పరీక్షల రాయదలిచిన విద్యార్థులు.. కాపీ కొట్టడానికి అవకాశం ఉందని భావించామని, దాన్ని నివారించడానికి ఓపెన్ బుక్ పరీక్షల విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించుకున్నట్లు యూనివర్శిటీ వెల్లడించింది.
ఈ మేరకు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఓ ప్రకటన విడుదల చేశారు. యూనివర్శిటీ గ్రాంట్ కమిషన్ నిబంధనలు, మార్గదర్శకాలకు అనుగుణంగా ఓపెన్ బుక్ పరీక్షలను నిర్వహిస్తామని తెలిపారు. పరీక్ష కేంద్రంలోని ప్రతి విద్యార్థి కూడా తమ వెంట టెక్స్ట్ పుస్తకాలు, నోట్ బుక్స్ను తీసుకుని రావడానికి అనుమతి ఇస్తామని అన్నారు. ప్రశ్నలకు కావాల్సిన సమాధానాలను రెఫరెన్స్ పుస్తకాలు, నోట్ బుక్స్, ఇతర స్టడీ మెటీరియల్లో చూసి రాయాల్సి ఉంటుందని వివరించారు.
పరీక్ష ముగిసిన అనంతరం 30 నిమిషాల వ్యవధిలోనే ప్రతి సమాధాన పత్రాన్నీ స్కాన్ చేస్తామని, వాటిని విద్యార్థుల కళాశాలలు, ఇతర విద్యాసంస్థలకు పంపిస్తామని అన్నారు. ప్రస్తుతానికి ఈ ఓపెన్ బుక్ విధానాన్ని తాము నిర్వహించబోయే చివరి సెమిస్టర్ పరీక్షలకు మాత్రమే పరిమితం చేస్తున్నామని అన్నారు. స్కాన్ చేయాల్సిన అవసరం ఉండటం వల్ల విద్యార్థులు బ్లాక్ ఇంక్ బాల్ పెన్తోె మాత్రమే పరీక్ష రాయాల్సి ఉంటుందని ఆదేశించారు. పరీక్షల సమయం, ప్రశ్నాపత్రాల్లో ఎలాంటి మార్పూ లేదని, ఇదివరకు ఉన్న వాటినే కొనసాగిస్తామని కంట్రోలర్ పేర్కొన్నారు.
కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడంలో భాగంగా.. పరీక్షా కేంద్రంలో విద్యార్థులు ఒకరి నుంచి మరొకరు తమ పుస్తకాలు, నోటబుక్స్, ఇతర స్టడీ మెటీరియల్ను పరస్పరం బదలాయించుకోవడానికి అనుమతి ఇవ్వట్లేదని తెలిపారు. ప్రతి ఒక్కరూ మాస్కులను ధరించిన తరువాతే తరగతి గదిలోకి రావాల్సి ఉంటుందని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన అన్ని కోవిడ్ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించేలా ముందు జాగ్రత్త చర్యలను తీసుకుంటామని యూనివర్శిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ స్పష్టం చేశారు.