పొంగల్ సెలవు: శశికళ లేఖకు దిగొచ్చిన కేంద్రం
మొత్తానికి చిన్నమ్మ శశికళ రాసిన సెంటిమెంట్ లేఖకు కేంద్రం దిగొచ్చింది. పొంగల్ పండుగ రోజైన శనివారం సెలవు తీసుకోవచ్చంటూ కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించింది.
చెన్నై: మొత్తానికి చిన్నమ్మ శశికళ రాసిన సెంటిమెంట్ లేఖకు కేంద్రం దిగొచ్చింది. పొంగల్ పండుగ రోజైన శనివారం సెలవు తీసుకోవచ్చంటూ కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించింది.
పొంగల్ సెలవు దినాన్ని తప్పనిసరి సెలవుగా కాకుండా ఐచ్ఛిక సెలవు దినంగా ప్రకటించాలనే కేంద్ర ప్రభుత్వ ఆలోచనపై అన్నాడియంకె ప్రధాన కార్యదర్శి హోదాలో ఆమె లేఖాస్త్రం సంధించడం తెలిసిందే.
కేంద్ర నిర్ణయం పొంగల్ పర్వదినానికి పెద్ద షాక్ అని, తమిళనాడులో ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తప్పనిసరి సెలవు దినంగా ఉండేదని ఆమె తన లేఖలో కేంద్ర ప్రభుత్వానికి గుర్తు చేశారు.
అన్ని కులాలవాళ్లు ఆ పర్వదినాన్ని జరుపుకుంటున్నారని, దాంతో మతపరమైన మనోభావాలు ముడిపడి ఉన్నాయని, ఆ పండుగను నిర్వహించుకోవడానికి ప్రజలకు అవకాశం కల్పించడం కేంద్రం విధి అని ఆమె తన లేఖలో సెంటిమెంట్ దెబ్బ కొట్టారు.
తమిళుల హక్కుల రక్షణ కోసం స్వర్గీయ జయలలిత ఎంతో కృషి చేశారని, ఆమె కృషికి తగిన విధంగా పనిచేసే విధంగా కేంద్రం సహకరించాలని, ఈ ఏడాది పొంగల్ శనివారం వస్తున్నప్పటికీ ఆ పండుగను కేంద్రం గౌరవించి, తప్పనిసరి సెలవు దినంగా ప్రకటించాలని ఆమె కోరారు.
దీనిపై సానుకూలంగా స్పందించిన కేంద్ర ప్రభుత్వం పొంగల్ పర్వదినాన్ని తప్పనిసరి సెలవుల జాబితా నుంచి రిస్ట్రిక్టడ్ జాబితాకు మార్చింది. రిస్ట్రిక్టడ్ అంటే.. ఏఏ రాష్ట్రాల ప్రజలకు ఈ పండుగ ముఖ్యమైనదో ఆయా రాష్ట్రాల ప్రజలు ఆ పండుగ రోజున సెలవు తీసుకోవచ్చన్న మాట.