గాంధీని మళ్లీ చంపిన పూజాపాండే అరెస్టు
జాతిపిత మహాత్మాగాంధీని ఎలాగైతే నాథూరాంగాడ్సే హత్య చేశాడో... నాటి ఘటనను తిరిగి గుర్తు చేసి అదేపద్ధతిలో మహాత్ముడి ఫోటోను గన్తో కాల్చిన అఖిలభారత హిందూ మహాసభ జాతీయ కార్యదర్శి పూజా షకున్ పాండేను ఆమె భర్తను అలిఘర్ పోలీసులు అరెస్టు చేశారు. తప్పల్లో పోలీసులు వారిద్దరినీ అరెస్టు చేశారు. అంతకుముందు మహాత్మాగాంధీ దిష్టిబొమ్మను కాల్చడంతో ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదంతా గతనెల గాంధీ వర్ధంతి రోజున జరిగింది. పోలీసుల కథనం ప్రకారం వీరంతా అఖిల భారత హిందూ మహాసభ సంస్థకు చెందిన వారిగా గుర్తించారు.
ఇక గాంధీ దిష్టి బొమ్మను పాండే ఒక బొమ్మ తుపాకీతో కాల్చారు. కాల్చిన వెంటనే గాంధీ బొమ్మనుంచి రక్తం కారడం కనిపిస్తుంది. ఇదంతా గాంధీ వర్ధంతి రోజున జరిగింది. అంతేకాదు దీన్ని వీడియో కూడా తీశారు. మరోవైపు గాంధీని హత్యచేసిన నాథూరాంగాడ్సే ఫోటోకు పూలమాలలు వేసి అతనికి అనుకూలంగా నినాదాలు చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమైంది. గాంధీజీ అహింసా వాది అని ఇంత పెద్ద దేశానికి అహింసా మంత్రంతో స్వాతంత్ర్యం సాధించిపెట్టారని ప్రపంచదేశాలు కొనియాడుతుండగా... ఇలా పూజా పాండే నీచంగా వ్యవహరించారని పలువురు దేశభక్తులు విమర్శలు గుప్పించారు. జాతిపితను అవమానించినందుకు గాను పూజా పాండేను తన భర్తపై కేసు నమోదు చేయాలడి పెద్ద ఎత్తున డిమాండ్లు వచ్చాయి.
అయితే పూజా పాండే వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలవడం ఇది తొలిసారి కాదు. అంతకుముందు కూడా గాడ్సే కంటే ముందు కనుక తాను జన్మించి ఉంటే మహాత్మా గాంధీనీ తానే హత్యచేసి ఉండేదనే వ్యాఖ్యలు చేసింది. అంతేకాదు గాంధీలా తయారు కావాలనుకునే వారినెవరినైనా సరే కాల్చేస్తానంటూ బహిరంగ వ్యాఖ్యలు చేసింది. అంతేకాదు దేశ విభజనకు కారణం గాంధీనే అని చెప్పిన పూజా పాండే... కొన్ని లక్షల మంది హిందువుల మరణానికి కూడా గాంధీనే కారణం అని ధ్వజమెత్తారు.
గాంధీని మరోసారి చంపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో పోలీసులు పాండేను ఆమె భర్త అశోక్తో పాటు మరో 12 మందిని సెక్షన్ 147, 148.149,295 ఏ, 153 ఏల కింద కేసు నమోదు చేశారు. ఇదిలా ఉంటే గాంధీని హత్య చేసినందుకు గాను నాథూరాంగాడ్సేకు ఉరిశిక్ష విధించింది కోర్టు. 15 నవంబరు 1949 అంబాలా జైలులో గాడ్సేను ఉరితీయడం జరిగింది.