తల్లి మాట!: 136మంది అనాథలకు కొత్త జీవితం ప్రసాదించిన నిరుపేద దంపతులు
భువనేశ్వర్: 'మనసు ఉంటే మార్గం ఉంటుంది' అనే సామెత తెలిసిందే. ఏ పని అయినా చేయాలనే ఆసక్తి ఉంటే, ఆ పని మీద శ్రద్ధ ఉంటే మార్గం కచ్చితంగా ఉంటుంది అనేది దాని భావన. ఎంతోమంది అనాథలకు తమకు తోచిన విధంగా సాయం చేస్తూనే ఉంటారు. ఒడిశాలో ఓ దంపతులు కూడా మనసు ఉంటే మార్గం ఉంటుందని నిరూపించారు.
అయితే వారు ధనవంతులేం కాదు. పేదవారు. ఆ పేద దంపతులు చదువుకోలేదు కూడా. కానీ వారు వంద మందికి పైగా అనాథ పిల్లలను దరి చేర్చుకున్నారు. వారిని సాకి, విద్యాబుద్ధులు నేర్పారు. ఒడిసాలోని కళహండిలో ఉండే దంపతులు 'యశోద అనంత్ ఆశ్రమ్' పేరుతో ఓ అనాథ శరణాలయాన్ని నడిపిస్తున్నారు.
వీరు 23 మంది బాలురను, 113 మంది బాలికలను కొత్త జీవితాన్ని ప్రసాదించారు. వీరిని ఎవరెవరో వదిలేసి వెళ్లారు. అలాంటి అనాథ పిల్లలకు ఆడించారు. పాడించారు. వారిని సాకారు. చదువు చెప్పించారు. ఇందులో కొందరికి పెళ్లిళ్లు కూడా అయ్యాయి. దాదాపు 13 మంది అమ్మాయిలకు పెళ్లిళ్లు చేశారు.
అనాథ పిల్లలకు కొత్త జీవితాన్ని ప్రసాదించిన ఆ దంపతుల్లోని భర్త పేరు శ్యాంసుందర్ జల్. ఓ అనాథ సంరక్షణ బాధ్యతలు చూసుకోవాలని ఆయన తల్లి ఓసారి అతనికి చెప్పింది. అప్పుడే అతను అనాథ పిల్లల కోసం శరణాలయం ప్రారంభించారు. విరాళాలతో దీనిని నడుపుతున్నారు. వందలమంది పిల్లలకు ఆ దంపతులు మంచి భవిష్యత్తును ఇస్తున్నారు.