రిజర్వుబ్యాంక్ నివేదిక: దాచేస్తే దాగని వాస్తవాలు: కేంద్ర ప్రభుత్వం అంగీకరించకున్నా
న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ వల్ల దేశంలో నెలకొన్న పరిస్థితులు ఆర్థికరంగంపై పెను ప్రభావాన్ని చూపాయి. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కోట్లాది కుటుంబాలపై కరోనా దుష్ప్రభావం తీవ్రంగా ఉందని తేలింది. కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్నిఒప్పుకొన్నా, ఒప్పుకోకపోయినా.. వాస్తవ పరిస్థితి మాత్రం ఇదేనని స్పష్టమైంది. కరోనా సంక్షోభం పరిస్థితుల తరువాత దేశంలో నెలకొన్న ఆర్థిక స్థితిగతులపై రిజర్వుబ్యాంకు ఓ నివేదికను రూపొందించింది. కరోనా సంక్షోభ ప్రభావం దేశంలోని అన్ని రంగాలపైనా పడిందని, ప్రత్యేకించి లక్షలాది మందికి ఉపాధిని కల్పించే కొన్ని సెక్టార్లు ప్రమాదంలో పడ్డాయని పేర్కొంది.
తెలంగాణలో కరోనా కేసుల కొత్త వెల్లువ: ఒక్కరోజే మూడువేలకు పైగా: పీక్స్లో టెస్టులు
లాక్డౌన్ ప్రభావం సుదీర్ఘం..
కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దేశవ్యాప్తంగా సుమారు మూడున్నర నెలల పాటు కేంద్రప్రభుత్వం లాక్డౌన్ను విధించొంది. 130 కోట్ల జనాభా గల దేశాన్ని స్తంభింపజేసిన ఉదంతం అది. దేశ ప్రజలు ఇళ్లకే పరిమితం అయ్యారు. అడుగు తీసి బయట పెట్టలేని పరిస్థితిని ఎదుర్కొన్నారు. నిర్మాణ రంగం, రవాణా స్తంభించిపోయాయి. వ్యాపార కార్యకలాపాలు నిలిచిపోయాయి. పరిశ్రమలు మూతపడ్డాయి. క్రయ విక్రయాల మీద ఆధారపడిన ఏ ఒక్క సెక్టార్ కూడా కనీసం రోజువారీ కార్యకలాపాలకూ నోచుకోలేకపోయాయి. దీని ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థ మీద సుదీర్ఘకాలం ఉంటుందనే అభిప్రాయాలు అప్పట్లోనే వ్యక్తమయ్యాయి.
హోటళ్లు, పర్యాటకం,
కరోనా వల్ల ఆతిథ్యరంగం కుదలైలందనే రిజర్వుబ్యాంకు అంచనా వేసింది. హోటళ్లు, రెస్టారెంట్లు, పర్యాటకం, విమానయానం, ఇతర రవాణా రంగాల్లో కరోనా వైరస్ పెను సంక్షోభాన్ని మిగిల్చిందని పేర్కొంది. ఆయా రంగాలపై ఆధారపడి ఉన్న వేలాదిమంది ఉపాధిని కోల్పోవాల్సి వచ్చిందని స్పష్టం చేసింది. ఇతర రంగాల్లోనూ ఉపాధిని కోల్పోయిన వారి సంఖ్య ఉన్నప్పటికీ.. ఆతిథ్యరంగంపై ఉన్నంత దుష్ప్రభావం వాటిపై లేదని అభిప్రాయపడింది. నిర్మాణరంగం స్తంభించిపోవడం వల్ల రోజువారీ కూలీలు రోడ్డున పడ్డారని రిజర్వుబ్యాంకు వెల్లడించింది.
ఏప్రిల్లోనే 121.5 మిలియన్ మంది
ఒక్క ఏప్రిల్లోనే 121.5 మిలియన్ల మంది ఉపాధిని కోల్పోయారని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ ప్రతినిధి మహేష్ వ్యాస్ వెల్లడించారు. ఇందులో చిరు వ్యాపారులు, తోపుడుబండ్ల వ్యాపారులు, దినసరి వేతన కూలీలు 91.2 మిలియన్ల మంది ఉన్నారని చెప్పారు. ప్రతి నలుగురిలో ముగ్గురు ఉపాధిని కోల్పోయినట్లు తమ సర్వేలో తేలిందని ఆయన తెలిపారు.ఊహించిన విధంగా, శరవేగంగా వారంతా ఉపాధిని కోల్పోవాల్సి రావడం ఆశ్చర్యానికి గురి చేసిందని పేర్కొన్నారు. అన్లాక్ తరువాత పరిస్థితుల్లో కొద్దిగా మార్పు వచ్చిందని, 85 మిలియన్ల మందికి ఉపాధి దొరికే అవకాశాలు ఏర్పడ్డాయని చెప్పారు.
ఎకనమిక్ సర్వే ఆశించిన స్థాయిలో ఉండకపోవచ్చు..
ఎకనమిక్ సర్వేలో వెల్లడయ్యే ఫలితాలు అంచనాలకు అందుకోకపోవచ్చని రిజర్వుబ్యాంకు సంకేతాలను ఇచ్చింది. ఈ సర్వే ఫలితాలు బాధాకరంగా ఉండొచ్చనీ పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి సంబంధించిన ఫలితాలు.. వచ్చనెలలో విడుదల చేయడానికి సెంట్రల్ స్టాటిస్టిక్ ఆఫీస్ (సీఎస్ఓ) సన్నహాలు చేస్తోందని, దేశ ఆర్థికరంగానికి సంబంధించినంత వరకూ కీలక విషయాలు తొలి త్రైమాసిక ఫలితాల్లో వెల్లడవుతాయని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ప్రజా పనుల కోసం కేటాయించే నిధుల్లో కోత పెట్టుకోవాల్సిన పరిస్థితులు తలెత్తవచ్చని అంచనా వేసింది.