కేదార్ నాథ్ ఆలయ తలుపులు తెరచుకునేది ఎప్పుడంటే! ఇక చార్ ధామ్ యాత్ర సందడి మొదలు
రుద్రప్రయాగ: పరమ పవిత్ర పుణ్యక్షేత్రం కేదార్ నాథ్ ఆలయ తలుపులు తెరచుకోనున్నాయ్. ఈ ఏడాది మే 9వ తేదీన ఆలయ తలుపులను తెరుస్తామని బద్రినాథ్-కేదార్ నాథ్ ఆలయ కమిటీ వెల్లడించింది. సోమవారం మహా శివరాత్రి పండుగను పురస్కరించుకుని ఆలయ కమిటీ ఈ ప్రకటన చేసింది. జగద్గురు ఆదిశంకరాచార్య జయంతిని కూడా అదేరోజు కావడం విశేషం.
ఆలయాన్ని ఎప్పుడు తెరవాలనే విషయంపై కమిటీ ప్రతినిధులు ఈ ఉదయం రుద్రప్రయాగలో సమావేశమయ్యారు. ఆలయ ప్రధాన అర్చకుడు రావల్ భీమశంకర్ లింగ్ సహా పలువురు ప్రముఖుల దీనికి హాజరయ్యారు. అనంతరం తేదీని నిర్ధారించారు. మే9వ తేదీన కేదార్ నాథ్, 10వ తేదీన బద్రినాథ్ ఆలయ తలుపులను తెరవాలని తీర్మానించారు. అదే సమయంలో గంగోత్రి, యమునోత్రి ఆలయాలను కూడా తెరుస్తామని కమిటీ ప్రతినిధులు తెలిపారు.
శీతాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఉత్తరాఖండ్ లోని కేదార్ నాథ్ ఆలయాన్ని ఏటా మూసివేస్తారనే విషయం తెలిసిందే. గత ఏడాది నవంబర్ లో ఆలయ తలుపులను మూసివేశారు. అక్కడి ఉత్సవ విగ్రహాలను రుద్రప్రయాగ జిల్లాలోని ఉఖ్రిమఠ్ ఓంకారేశ్వర ఆలయానికి తరలిస్తారు. తలుపులు తెరచుకున్న వెంటనే.. ఉత్సవ మూర్తులను మళ్లీ కేదార్ నాథ్ ఆలయంలో పున: ప్రతిష్ఠిస్తారు.
ఈ ఏడాది మే 9వ తేదీన తెల్లవారు జామున 5:35 నిమిషాలకు కేదార్ నాథ్ ఆలయ తలుపులు తెరచుకోబోతున్నాయి. ఆరు నెలల పాటు భక్తులు స్వామివారిని దర్శించుకోవచ్చు. అక్టోబర్-నవంబర్ మధ్యకాలంలో మళ్లీ ఆలయాన్ని మూసివేస్తారు. ఇది ఆనవాయితీగా వస్తోంది. శీతాకాలంలో విపరీతమైన మంచు కారణంగా ఆలయాన్ని మూసిస్తారు. వేసవి ఆరంభమైన కొద్దిరోజులకు తలుపులను తెరుస్తారు. భక్తులకు ప్రవేశాన్ని కల్పిస్తారు.