అజిత్కు ఆర్థిక శాఖ: ఎన్సీపీకే కీలక పోర్టుఫోలియోలు: మహా మంత్రులకు శాఖల కేటాయింపు ఇలా..!
మహారాష్ట్రలో ఏర్పాటైన మహా వికాస్ ఆఘాడి ప్రభుత్వంలోని మంత్రులకు ఎట్టకేలకు శాఖలు కేటాయించారు. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సూచన మేరకు ఆయన ప్రతిపాదించిన మంత్రుల శాఖల జాబితాను గవర్నర్ భగత్సింగ్ కోశ్యారీ కొద్ది సేపటి క్రితం ఆమోదం తెలిపారు. ముందుగా ఊహించిన విధంగానే ఎన్సీపీ సీనియర్ నేత ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్కు కీలకమైన ఆర్థిక, ప్రణాళిక శాఖలను అప్పగించారు.
దీంతో కూటమి ప్రభుత్వానికి తలనొప్పిగా మారిన శాఖల అప్పగింత అంకం ముగిసింది. అలాగే ఉద్ధవ్ కుమారుడు. తో పాటుగా ఆదిత్య ఠాక్రేకు పర్యవరణం, టూరిజం శాఖ దక్కింది. కీలక శాఖల కేటాయింపులో ఎన్సీపీకి ప్రాధాన్యత ఇచ్చినట్లుగా కనిపిస్తోంది.
మంత్రులకు శాఖల కేటాయింపు..
గత నెల డిసెంబర్ 30న మహారాష్ట్ర లో జరిగిన మంత్రివర్గ విస్తరణలో కొత్తగా 36 మందిని ఉద్ధవ్ ఠాక్రే తన మంత్రివర్గంలో అవకాశం కల్పించారు. వారిలో ఎన్సీపీ నుంచి 14 మందికి.. కాంగ్రెస్ నుంచి 10 మంది.. శివసేన నుంచి 12 మంది మంత్రి పదవులు పొందారు. వారికి శాఖల కేటాయింపు మీద గత వారం రోజులుగా తర్జన భర్జనలు సాగుతున్నాయి.
ఎట్టకేలకు ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే తన కేబినెట్ లోని మంత్రులకు శాఖలు కేటాయించటం..దానికి గవర్నర్ ఆమోద ముద్ర వేయటం తో ఆ చర్చలకు ముగింపు లభించింది. ఉద్దవ్ తనకు ప్రభుత్వం ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన ఎన్సీపీకి కీలక మంత్రిత్వ శాఖలు కేటాయించారు. అదే విధంగా తన కుమారుడికి పర్యావరణంతో పాటుగా టూరిజం శాఖను అప్పగించారు.
అజిత్ కు ఆర్దిక..ప్రణాళికా శాఖలు..
మహారాష్ట్రలో ముందుగా ఊహించిన విధంగానే ఎన్సీపీ సీనియర్ నేత ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్కు కీలకమైన ఆర్థిక.. ప్రణాళిక శాఖలను అప్పగించారు. ఎన్సీపీకే హోం శాఖను కేటాయిస్తూ సీఎం ఉద్దవ్ నిర్ణయించారు. ఎన్సీపీ సీనియర్ నేత అనిల్ దేశ్ముఖ్కు హోంశాఖ, నవాబ్ మాలిక్ మైనార్టీ శాఖ, జయంత్ పాటిల్కు జలవనరులు శాఖ బాధ్యతలు అప్పగించారు. మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ చవాన్కు పబ్లిక్ వర్స్ దక్కింది.
పట్టణాభివృద్ధి శాఖ ఏక్నాథ్ షిండేకు, పరిశ్రమలు, మైనింగ్, మరాఠీ భాషా మంత్రిత్వ శాఖలు సుభాష్ దేశాయ్కు కేటాయించారు. ఇక, ప్రజాపనుల శాఖ ను అశోక్ చవాన్కు, మైనారిటీ డవలప్మెంట్, స్కిల్ డవలప్మెంట్ శాఖను నవాబ్ మాలిక్కు, ఆహారం, పౌర సరఫరాలు, వినియోగదారుల పరిరక్షణ శాఖలను ఛగన్ భుజ్బల్కు కేటాయించారు. కాంగ్రెస్కు చెందిన బాలాసాహెబ్ థోరట్కు రెవెన్యూ శాఖ కేటాయించగా, వర్ష గైక్వాడ్కు పాఠాశాల విద్య కేటాయిస్తూ ముఖ్యమంత్రి నిర్ణయించారు.
ఆదిత్య థాకరేకు పర్యావరణం..పర్యాటకం
శివసేన నుంచి తొలిసారి ఎమ్మెల్యే అయిన ఆదిత్య థాకరేకు పర్యావరణం తో పాటుగా పర్యాటక శాఖ కేటాయించారు. సంజయ్ రాథోడ్కు అటవీ శాఖ కేటాయించారు. ఉదయ్ సామంత్కు ఉన్నత, సాంకేతిక విద్యా శాఖ ను అప్పగించారు. కీలకమైన వ్యవసాయ శాఖను దాదా భుసెకు కేటాయించారు. సందీప్ భుమ్రేకు ఉపాధి హామీ అప్పగించగా.. గులాబ్రావ్ పటేల్ వాటర్ సప్లైను కేటాయించారు. ఇక.. శంకర్రావు గడఖ్కు ఇరిగేషన్ శాఖ కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మంత్రులకు పోర్టుఫోలియోలు కేటాయిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.