లవ్ జీహాద్, కాలేజ్ యువతికి నరకం, పోస్కో చట్టం కింద కేసు, నిందితుడు మాయం!
బెంగళూరు: మైనర్ విద్యార్థిని వెంటపడి ప్రేమించాలని, మతం మార్చుకుని పెళ్లి చేసుకోవాలని వేధింపులకు గురి చేస్తున్న యువకుడి మీద కర్ణాటకలోని పుత్తూరు తాలుకా బెళ్లారే పోలీసులు పోస్కో చట్టం కింద కేసు నమోదు చేసి అతని కోసం గాలిస్తున్నారు.
పుత్తూరు సమీపంలోని ముకెరత్తి గ్రామంలో నివాసం ఉంటున్న మహమ్మద్ హకీం అనే యువకుడి మీద కేసు నమోదు చేశామని శనివారం పోలీసులు చెప్పారు. కయ్యూరు గ్రామంలో నివాసం ఉంటున్న 17 ఏళ్ల యువతి పుత్తూరులో పీయూసీ (ఇంటర్) ద్వితీయ సంవత్సరం చదువుతోంది.
ప్రతి రోజు యువతి కాలేజ్ కు వెళ్లి వచ్చే సమయంలో మహమ్మద్ హకీం బైక్ లో ఆమెను వెంబడించి ప్రేమించాలని పీడించాడని సమాచారం. మతం మార్చుకుని నన్ను వివాహం చేసుకోవాలని వేధించాడు. ఈ విషయం యువతి ఇంటిలో చెప్పకుండా ఇంతకాలం ఓపికగా భరిస్తూ వచ్చింది.
మహమ్మద్ హకీం వేధింపులు ఎక్కువ అయ్యాయి. మీ ఫ్రెండ్స్ ఫోన్ నెంబర్లు ఇవ్వాలని, వారితో నేను మాట్లాడుతానని అతడు మరింత వేధించాడు. నన్ను పెళ్లి చేసుకోకపోతే మీ నాన్న షాప్ కు నిప్పంటిస్తానని తీవ్రస్థాయిలో హెచ్చరించాడు. పరిస్థితి విషమించడంతో యువతి కుటుంబ సభ్యులకు అసలు విషయం చెప్పి తరువాత ఫిర్యాదు చేసిందని పోలీసులు అన్నారు.
కేసు నమోదు చేశారని తెలుసుకున్న మహమ్మద్ హకీం పరారైనాడని పోలీసులు తెలిపారు. ఇదే ప్రాంతంలో ఓ దళిత యువతికి బలవంతంగా మతం మార్చి వివాహం చెయ్యాలని ప్రయత్నించడంతో రెండు నెలల క్రితం కేసు నమోదు అయ్యింది.