దేశం కోసమే క్యూలు: మన సంస్కృతేనంటూ మోడీ
దీసా: పెద్ద నోట్ల రద్దు అనంతరం దేశ హితం కోసమే ప్రజలు బ్యాంకులు, ఏటీఎంల ముందు క్యూలు కడుతున్నారని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. నరేంద్ర మోడీ శనివారం గుజరాత్లో పర్యటించారు. ఈ సందర్భంగా దీసాలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో రైతులనుద్దేశించి మోడీ ప్రసంగించారు.
ప్రజలు తమకు ఇబ్బందులు ఎదురైనా కూడా దేశ భవిష్యత్ ప్రయోజనాల కోసం తన నిర్ణయానికి సహకరిస్తున్నారని చెప్పారు. ఇదే మన నిస్వార్థ సంస్కృతికి నిదర్శనమని ఆయన అన్నారు. నల్లధనం నియంత్రణ కోసమే పెద్దనోట్లు రద్దు నిర్ణయమని మోడీ పునరుద్ఘాటించారు.
'గతంలో రూ.20, రూ.50 నోట్లను ఎవరూ పెద్దగా పట్టించుకునేవారు కాదు. నవంబరు 8వ తేదీ తర్వాత పెద్ద నోట్ల కోసం ఎవరూ చూడటం లేదు. చిన్న నోట్ల కోసం పోటీ పడ్డారు. ఎలా అయితే పెద్ద నోట్ల కంటే చిన్న నోట్లకు విలువ పెరిగిందో .. ధనికుల కంటే సామాన్య ప్రజలకు విలువ పెరగాలనే నేను ఈ అతిపెద్ద నిర్ణయం తీసుకున్నా' అని మోడీ వివరించారు.
రాష్ట్రపతి చెప్పినా వినడం లేదు
నోట్ల రద్దుపై తనను లోక్సభలో మాట్లాడనివ్వడం లేదని ప్రధాని మోడీ అన్నారు. నోట్ల రద్దుపై చర్చకు సిద్ధంగా ఉన్నట్లు ప్రభుత్వం చెబుతూనే ఉందని, కానీ లోక్సభలో మాట్లాడేందుకు తనకు అవకాశం ఇవ్వడంలేదని, అందుకే బహిరంగ సభల్లో నోట్ల రద్దుపై మాట్లాడుతున్నానని మోడీ తెలిపారు. లోకసభ కంటే జనసభ గొప్పదని అన్నారు. పార్లమెంట్లో జరుగుతున్న సభావ్యహార శైలి రాష్ట్రపతిని కూడా అసహనానికి గురి చేసిందని విమర్శించారు.
ఏటీఎంల ముందు నిలబడి సమయాన్ని వృథా చేయరాదని, ఈ-వ్యాలెట్లతో మొబైల్లోనే బ్యాంకింగ్ కార్యకలాపాలు నిర్వహించవచ్చు అని ప్రధాని మోడీ సూచించారు. నల్లధనం కలిగి ఉన్న వాళ్లను వదిలేది లేదని మరోసారి ఆయన స్పష్టం చేశారు. వెనక దారిలో తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్న నల్లకుబేరులను కూడా పట్టుకుంటున్నట్లు ఆయన తెలిపారు.
అక్రమ పద్ధతుల్లో నల్లధనాన్ని మారుస్తున్న బ్యాంక్ అధికారులను కూడా పట్టుకున్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రజల గురించి మాట్లాడటం కాదని, ప్రజల కోసం పనిచేయాలన్నారు. పేదల ఆర్థిక సామర్థ్యాన్ని పెంచేందుకే పెద్ద నోట్లను రద్దు చేసినట్లు ప్రధాని మోడీ తెలిపారు.
రైతు ఆత్మహత్య లేవు
గతంలో కరవుతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడేవారు.. బిజెపి అధికారంలోకి వచ్చాక రైతుల జీవితాల్లో మార్పు తీసుకొచ్చామని స్పష్టం చేశారు. తన పిలుపుతో బనస్కాంత రైతులు బిందు సేద్యంపై దృష్టి సారించారని, దీంతో ప్రస్తుతం కచ్, బనస్కాంత ప్రాంతాల్లో అలాంటి పరిస్థితి లేదని అన్నారు.