15న రైళ్లు పట్టాలెక్కే ఛాన్స్: మిడిల్ బెర్తులు తొలగింపు: రెడ్, ఎల్లో, గ్రీన్ జోన్లుగా
న్యూఢిల్లీ: కరోనా వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దేశవ్యాప్తంగా అమల్లోకి తీసుకొచ్చిన లాక్డౌన్ మరి కొద్దిరోజుల్లో ముగియబోతోంది. 21 రోజుల లాక్డౌన్ వచ్చే మంగళవారం నాటికి ముగుస్తుంది. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న విధానాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ లాక్డౌన్ మరి కొద్దిరోజుల పాటు పొడిగించే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై ఆయన ఇదివరకే సంకేతాన్నికూడా ఇచ్చారు.
Recommended Video
స్పష్టత రేపే..
లాక్డౌన్ పొడిగింపుపై శనివారం మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రధానమంత్రి.. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ను నిర్వహించబోతున్నారు. లాక్డౌన్పై నిర్ణయం తీసుకోవడానికే ప్రత్యేకంగా ఆయన ఈ కాన్ఫరెన్స్ను ఏర్పాటు చేయనున్నారు. లాక్డౌన్ విధించిన అనంతరం రాష్ట్రాల్లో నెలకొన్న వాతావరణం, పాజిటివ్ కేసుల సంఖ్య, ఆదాయ వనరులు.. ఇవన్నీ ఈ సందర్భంగా చర్చకు రానున్నాయి.
పాక్షికంగా రైళ్లు..
ఈ పరిస్థితుల్లో రైల్వే మంత్రిత్వ శాఖ రైళ్ల రిజర్వేషన్లను కొనసాగిస్తూనే వస్తోంది. దీనివల్ల పాక్షికంగా రైళ్లను నడిపిస్తారేమోననే అభిప్రాయాలు కూడా వ్యక్తమౌతున్నాయి. దీనపై రైల్వే బోర్డు ఉన్నతాధికారులు శుక్రవారం అన్ని డివిజనల్ స్థాయి మేనేజర్లతో వీడియో కార్ఫరెన్స్ను నిర్వహించారు. కొన్ని మార్గదర్శకాలను సూచించారు. ఇవన్నీ రైళ్లు పాక్షికంగా నడుస్తాయనడానికి సంకేతాలను ఇస్తున్నాయి.
రైళ్లల్లో మిడిల్ బెర్తులు తొలగింపు.. మూడు జోన్లుగా..
అన్ని ఎక్స్ప్రెస్ రైళ్లల్లో మిడిల్ బెర్తులను తొలగించాలంటూ రైల్వే బోర్డు అధికారులు సూచించారు. మిడిల్ బెర్తును తొలగించడం వల్ల సామాజిక దూరాన్ని పాటించడానికి అవకాశం ఉంటుందనేది రైల్వే అధికారుల ఉద్దేశం. ఇప్పటికే దేశవ్యాప్తంగా క్వారంటైన్ సెంటర్లుగా మార్చిన కొన్ని బోగీల్లో మిడిల్ బెర్తులను తొలగించిన విషయం తెలిసిందే. అదే విధానాన్ని మిగిలిన రైళ్లల్లోనూ కొనసాగించాలంటూ తాజాగా ఆదేశాలు వెలువడ్డాయి.
మూడు జోన్లుగా రైల్వే..
దేశవ్యాప్తంగా రైల్వేను మూడు జోన్లుగా విభజించారు. ఒక్కో జోన్కు ఒక్కో రంగును కేటాయించారు. ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగులను వాటికి కేటాయించారు. ఎరుపురంగును కేటాయించిన జోన్లలో రైళ్ల రాకపోకలను పూర్తిగా నిషేధించే అవకాశం ఉందని అంటున్నారు. పసుపు రంగు జోన్లో పరిమితంగా.. ఆకుపచ్చ జోన్లో ఓ మోస్తరుగా రైళ్ల సర్వీసులను పునరుద్ధరించడానికి అవకాశం ఉందని తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తోంటే ఈ నెల 15వ తేదీ నుంచి రైళ్లు పాక్షికంగానైనా పట్టాలెక్కడం ఖాయంగా కనిపిస్తోంది.