బిగ్ చేంజ్ : బీహార్ ఎన్నికలకు ముందు ఎన్నికల సంఘం కీలక నిర్ణయం...
కరోనా వైరస్ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. 65 ఏళ్లు పైబడ్డ వృద్దులు,కరోనా పేషెంట్లకు పోస్టల్ బ్యాలెట్ పద్దతిలో ఓటు వేసే అవకాశాన్ని కల్పించింది. అలాగే కరోనా అనుమానితులుగా ఉండి క్వారెంటైన్లో చికిత్స పొందుతున్నవారికి కూడా ఈ అవకాశం కల్పించింది. ఈ మేరకు ఎలక్షన్ కమిషన్ రూల్స్, 1961లోని పలు క్లాజ్లను సవరిస్తూ కేంద్ర ప్రభుత్వం గురువారం(జూలై 2) గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
అక్టోబర్-నవంబర్ మాసాల్లో బీహార్ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. అదే సమయంలో అటు మధ్యప్రదేశ్లోనూ 24 అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటివరకూ ఎన్నికల విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు,సాయుధ జవాన్లు,పోలీసులకు మాత్రమే పోస్టల్ బ్యాలెట్ అవకాశం ఉండేది. అయితే కరోనా పరిస్థితుల నేపథ్యంలో వృద్దులు,కరోనా పేషెంట్లు పోలింగ్ కేంద్రానికి వెళ్తే వైరస్ వ్యాప్తికి ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి... ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది.
'కోవిడ్ 19 నిబంధనలను దృష్టిలో ఉంచుకుని... ఒక్కో పోలింగ్ బూత్లో వెయ్యి మందికి మించి అనుమతించవద్దని ఇప్పటికే ఎన్నికల సంఘం మార్గదర్శకాలు ఇచ్చింది. తద్వారా పోలింగ్ కేంద్రాల్లో భౌతిక దూరంతో పాటు ఇతరత్రా కోవిడ్ 19 నిబంధనలు పాటించేందుకు అవకాశం ఉంటుంది.' అని ఎన్నికల సంఘం తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది.
తాజా సమాచారం ప్రకారం బీహార్లో సెప్టెంబర్ మొదటివారంలో ఎన్నికల కోడ్ అమలుచేసే అవకాశం ఉంది. అక్టోబర్-నవంబర్ మాసాల్లో ఎన్నికలు నిర్వహించవచ్చు. అయితే గతంలో నిర్వహించినట్లు ఐదు విడతల్లో కాకుండా ఈసారి కేవలం ఒకటి లేదా రెండు విడతల్లోనే ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం భావిస్తోంది.