రియల్ హీరోలు ఇమ్రాన్ ఖాన్, సిద్ధూ: పంజాబ్ లో వెలిసిన బ్యానర్లు..!
చండీగఢ్: పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ను రియల్ హీరోగా కీర్తిస్తూ పంజాబ్ లో బ్యానర్లు, పోస్టర్లు వెలిశాయి. ఇమ్రాన్ ఖాన్ తో పాటు పంజాబ్ మాజీ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధు ఫొటోను ఒకే బ్యానర్ లో ప్రచురించడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. పెద్ద ఎత్తున దుమారానికి దారి తీస్తోంది. పంజాబ్ లోని అమృత్ సర్ సహా మరికొన్ని పట్టణాల్లో ఈ తరహా బ్యానర్లు రాత్రికి రాత్రి వెలిశాయి. ఇమ్రాన్ ఖాన్, నవజ్యోత్ సింగ్ సిద్ధులను రియల్ హీరోలుగా పేర్కొంటూ కాంగ్రెస్ నాయకులు వాటిని ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు.
Pawan Kalyan: కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు జనసేన వ్యతిరేకమా? పవన్ వ్యాఖ్యలకు అర్థమేంటీ?
కర్తార్ పూర్ కారిడార్ కార్యరూపం దాల్చడానికి పాకిస్తాన్ తరఫున ఆ దేశ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్, భారత్ తరఫున పంజాబ్ మాజీ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధులు తీవ్రంగా శ్రమించారని ఆ బ్యానర్ లో రాసుకొచ్చారు. వారిద్దరి చొరవ వల్లే కర్తార్ పూర్ కారిడార్ స్వప్నం సాకారమైందని అందులో పేర్కొన్నారు. సిక్కుల ప్రప్రథమ గురువు గురు నానక్ జన్మస్థలం నన్కనా, ఆయన బోధనలు చేసిన ప్రదేశం కర్తార్ పూర్ గురుద్వారా రెండూ ప్రస్తుతం పాకిస్తాన్ లో ఉన్న విషయం తెలిసిందే. పంజాబ్ ప్రావిన్స్ లో ఉన్న ఈ రెండు చారిత్రాత్మక స్థలాలను సందర్శించడానికి పాకిస్తాన్, భారత్ మధ్య కర్తార్ పూర్ కారిడార్ ఒప్పందం కుదిరింది.
గురు నానక్ 550వ జయంత్యుత్సవాలను పురస్కరించుకుని ఈ నెల 9వ తేదీన కర్తార్ పూర్ ను సందర్శించబోతున్నారు వేలాదిమంది భారతీయ సిక్కులు. కర్తార్ పూర్ కారిడార్ ఏర్పాటు కావాలంటూ ఇదివరకు పెద్ద ఎత్తున వారు ఉద్యమాలు చేశారు. వాటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని కేంద్రప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టింది. కర్తార్ పూర్ కారిడార్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడానికి పంజాబ్ మంత్రి హోదాలో నవజ్యోత్ సింగ్ సిద్ధూ పాకిస్తాన్ వెళ్లారు. అక్కడ పాకిస్తాన్ మంత్రిని కౌగిలించుకోవడం అప్పట్లో పెద్ద ఎత్తున దుమారానికి దారి తీసింది.
ఇన్ని అవాంతరాలు ఎదురైనప్పటికీ.. కర్తార్ పూర్ కారిడార్ ఏర్పాటైందని, దీనికంతటికీ ఇమ్రాన్ ఖాన్, నవజ్యోత్ సింగ్ సిద్ధూలే కారణమని అంటూ కాంగ్రెస్ నాయకులు ఈ బ్యానర్లను ఏర్పాటు చేశారని అంటున్నారు. అమృత్ సర్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ కార్పొరేటర్ల పేర్లు ఈ బ్యానర్లపై ఉన్నాయి. ఇమ్రాన్ ఖాన్ ను హీరోగా కీర్తిస్తూ బ్యానర్లు ఏర్పాటు చేయడం పట్ల శిరోమణి అకాలీదళ్ సమా పలు ప్రతిపక్ష పార్టీల నాయకులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అధికార కాంగ్రెస్ వైఖరి పట్ల ధ్వజమెత్తుతున్నారు. పాకిస్తాన్ తో చెలిమి చేయడానికి కాంగ్రెస్ నాయకులు ఉత్సాహ పడుతున్నారని విమర్శిస్తున్నారు.