కరోనా బాధితుల ఇళ్లకు పోస్టర్లు అంటించొద్దు- కేంద్రానికి సుప్రీం కీలక ఆదేశాలు
దేశవ్యాప్తంగా కరోనా పరిస్ధితులను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ఐసీఆర్ సాయంతో కొన్ని మార్గదర్శకాలు జారీ చేస్తోంది. ఇందులో అత్యధిక శాతం జనామోదం పొందుతుండగా, పలుసార్లు కొన్నింటిపై అభ్యంతరాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి వాటిలో తాజాగా కేంద్రం జారీ చేసిన ఓ మార్దదర్శం వివాదాస్పదమవుతోంది. దీనిపై దాఖలైన ఓ పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు.. కీలక ఆదేశాలు జారీ చేసింది.
కరోనా రోగుల ఇళ్ల బయట పోస్టర్టు అంటించాలని కేంద్రం తాజాగా మార్గదర్శకాల్లో పేర్కొంది. కరోనా వైరస్ సోకిన వారి నుంచి ఇతరులకు వ్యాపించకుండా అప్రమత్తం చేసేందుకు కేంద్రం ఈ పోస్టర్లు అంటించాలని సూచించింది. అయితే సుప్రీంకోర్టు తాజాగా ఈ ఆదేశాలను పక్కనపెట్టింది. సంబంధిత శాఖ అధికారులు ప్రత్యేకంగా నోటిఫై చేస్తే తప్ప ఇలా కరోనా రోగుల ఇళ్లకు పోస్టర్లు అంటించడం సరికాదని సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది.
కరోనా సోకిందంటూ రోగుల ఇళ్లకు పోస్టర్లు అతికించడం ద్వారా సదరు బాధితుల గౌరవానికి భంగం కలిగినట్లు అవుతుందని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. దీంతో ఈ పోస్టర్ల వ్యవహారమేంటంటూ కేంద్రానికి అక్షింతలు వేసింది. తక్షణం ఈ ఆదేశాలను సవరించాలని కేంద్రానికి ధర్మాసనం సూచించింది. దీంతో కేంద్రం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం దేశంలో కరోనా తగ్గుముఖం పట్టినా పలు చోట్ల మాత్రం ఇంకా కేసుల సంఖ్య కనిపిస్తోంది. దీంతో కేంద్రం కూడా స్దానిక అధికారులకు కట్టడి చర్యలు తీసుకోవాలని పలు సూచనలు చేస్తోంది.