అధికారం శాస్వతం కాదు, పంచాయితీ నుంచి ప్రధాని వరకు ఉన్నాం, సీఎం కుమారస్వామి !
బెంగళూరు: తాను ముఖ్యమంత్రి కుర్చీ కోసం పాకులాడటం లేదని, మా కుటుంబానికి అధికారం కొత్తకాదని కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి అన్నారు. పంచాయితీ మెంబర్ నుంచి ప్రధాని పదవిలో మా కుటుంబ సభ్యులు ఉన్నారని, అయితే అధికారం ఎవ్వరికీ శాస్వతం కాదని కొందరు (బీజేపీ) నాయకులు గుర్తు పెట్టుకోవాలని సీఎం కుమారస్వామి అన్నారు. శుక్రవారం శాసన సభా సమావేశాల్లో సీఎం కుమారస్వామి సుధీర్ఘంగా మాట్లాడారు.
ప్రధాని పదవి వదిలేశారు
మా తండ్రి హెచ్.డి. దేవేగౌడ ప్రధాన మంత్రిగా ఉన్న సమయంలో కొన్ని కారణాలతో ఆ పదవిని తేలికగా వదిలేశారని ప్రతిపక్ష నాయకులు ( బీజేపీ) గుర్తు పెట్టుకోవాలని సీఎం కుమారస్వామి అన్నారు. తనకు, తన కుటుంబ సభ్యులకు పదవులు ముఖ్యం కాదని, ఏ రోజూ మేము అలా ప్రవర్తించలేదని సీఎం కుమారస్వామి చెప్పారు. అయితే మాజీ ముఖ్యమంత్రి ధరంసింగ్ చావుకు తానే కారణం అని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారని సీఎం కుమారస్వామి విచారం వ్యక్తం చేశారు.
హైదరాబాద్ రిసార్టులో !
యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఉత్తర కర్ణాటకలో భారీగా వరదలు వచ్చాయని సీఎం కుమారస్వామి గుర్తు చేశారు. అయితే ఆ సమయంలో అధికారం కాపాడుకోవాలని బీజేపీకి చెందిన 60 మంది ఎమ్మెల్యేలు హైదరాబాద్ రిసార్టులో ఉన్నారని, మిగిలిన ఎమ్మెల్యేలు మైసూరు రిసార్టులో ఉన్నారని సీఎం కుమారస్వామి అన్నారు. అయితే ఇప్పుడు మేము ప్రజలకు అన్యాయం చేస్తున్నామని బీజేపీ నాయకులు ఆరోపించడం విడ్డూరంగా ఉందని సీఎం కుమారస్వామి మండిపడ్డారు.
బీజేపీ నాయకుల డ్రామాలు
మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప గురించి గతంలో బీజేపీ ఎమ్మెల్యే రేణుకాచార్య ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు, ఇప్పుడు అదే రేణుకాచార్య విధాన సౌధ గేటు దగ్గర ఎమ్మెల్యేలకు వల వెయ్యడానికి కుర్చోని ఉన్నారని సీఎం కుమారస్వామి వ్యంగంగా అన్నారు. రేణుకాచార్య మంత్రి కావడానికి తన దగ్గరకు ఎన్నిసార్లు వచ్చారో, తనను ఎలా ఉపయోగించుకున్నారో ఆయనకే తెలుసని, తాను ఇప్పుడు వివరించలేనని సీఎం కుమారస్వామి అన్నారు.
బీజేపీ రెబల్ ఎమ్మెల్యేలు వచ్చారు
ఇంతకు ముందు కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉన్న సమయంలో కొందరు రెబల్ బీజేపీ ఎమ్మెల్యేలు తన దగ్గరకు వచ్చారని, ప్రభుత్వాన్ని కూల్చుదామని తనకు మనవి చేశారని, అయితే తాను వారికి బుద్దిచెప్పి పంపించానని సీఎం కుమారస్వామి అన్నారు. అనేక మంది ఎమ్మెల్యేలకు రూ. కోట్లు కోట్లు ఇచ్చి కొనుగోలు చేస్తున్న బీజేపీ నాయకులు అడ్డదారిలో అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నారని సీఎం కుమారస్వామి ఆరోపించారు.
అధికారం శాస్వతం కాదు !
అధికారం శాస్వతం కాదని, ఆ విషయం గుర్తు పెట్టుకోవాలని సీఎం కుమారస్వామి బీజేపీ నాయకులకు సూచించారు. గత 14 నెలల నుంచి తన ప్రభుత్వానికి సంపూర్ణ మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు లేదని ఇన్ని రోజులు బీజేపీ నాయకులు ప్రచారం చేస్తూ వచ్చారని సీఎం కుమారస్వామి ఆరోపించారు. ఈ రోజు నేను అధికారంలో ఉన్నాను, రేపు ఇంకొకరు అధికారంలో ఉంటారని, అధికారం ఎవ్వరికీ శాస్వతం కాదని సీఎం కుమారస్వామి శాసన సభలో అన్నారు.