ముంబై బ్లాక్ అవుట్: ఊహించని పిడుగుపాటు: జనం ఉక్కిరిబిక్కిరి: అల్లకల్లోలం: కారణంపై ఆరా
ముంబై: దేశ ఆర్థిక రాజధానిగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ముంబై మహానగరం ఒక్కసారిగా స్తంభించిపోయింది. ఏ మాత్రం ఊహించని పరిణామం ఇది. మంత్రం వేసినట్లు రవాణా వ్యవస్థ ఎక్కడికక్కడే నిలిచిపోయింది. పిడుగుపాటులా సంభవించిన ఈ పరిణామంతో జనం ఉక్కిరిబిక్కిరికి గురి అవుతున్నారు. అనూహ్యంగా చోటు చేసుకున్న ఈ ఘటనపై గల కారణాలపై అధికార యంత్రాంగం ఆరా తీస్తోంది. మరి కొన్ని గంటల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశాలు లేకపోలేదని ప్రాథమికంగా నిర్ధారించింది.
తెలంగాణలో ఒక్కసారిగా భారీగా తగ్గిన కరోనా కేసులు: మరణాలూ తక్కువే: ఊరట దొరికినట్టేనా?
గ్రిడ్ ఫెయిల్యూర్..
ఈ ఉదయం 10 గంటల సమయంలో ముంబై మహానగరానికి విద్యుత్ సరఫరా ఒక్కసారిగా నిలిచిపోయింది. ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాలేదు. ముంబై మెట్రో పాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్) పరిధిలోని ఏ ఒక్క ప్రాంతంలో కూడా కరెంటు లేని పరిస్థితి నెలకొంది. ముంబై మహానగరానికి విద్యుత్ను సరఫరా చేసే గ్రిడ్లో ఏర్పడిన సాంకేతిక లోపాలే దీనికి కారణమని అధికారులు గుర్తించారు. యుద్ధ ప్రాతిపదికన వాటిని సరి చేస్తున్నారు. ఆసుపత్రులు వంటి అత్యవసర సేవల కోసం మాత్రమే విద్యుత్ను సరఫరా చేస్తున్నారు.
385 మెగావాట్ల మేర..
ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ పరిధిలో ఒక్కరోజు విద్యుత్ వినియోగం 385 మెగావాట్ల వరకు ఉంటుంది. అక్కడి విద్యుత్ సరఫరా వ్యవస్థ మొత్తం ప్రైవేటు సంస్థ చేతుల్లో ఉంది. అదాని ఎలక్ట్రిసిటీ ముంబై లిమిటెడ్ (ఏఈఎంఎల్), టాటా పవర్, బృహన్ ముంబై ఎలక్ట్రిసిటీ అండ్ ట్రాన్స్పోర్ట్ (బెస్ట్) సంస్థలు విద్యుత్ను సరఫరా చేస్తుంటాయి. ముంబైకి విద్యుత్ను సరఫరా చేసే ఖల్వా-పడ్ఘే-ఖార్ఘర్ గ్రిడ్లో ఒక్కసారిగా సాంకేతిక లోపాలు తలెత్తాయి. దీనితో ఉదయం 10 గంటల నుంచి కరెంటు సరఫరా నిలిచిపోయింది.
ముంబై మెట్రోపాలిటన్ రీజియన్..
ఫలితంగా- ముంబై మెట్రోపాలిటన్ సిటీ సహా సబర్బన్ ప్రాంతాల్లోనూ కరెంటు సరఫరాను నిలిపివేశారు. వర్లీ, బంద్రా, అంధేరీ, ఖండీవల్లీ, నవీ ముంబై, ములుంద్, వాసై, జుహు, మిరా రోడ్, పన్వెల్ వంటి అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా స్తంభించిపోయింది. స్టాక్ ఎక్స్ఛేంజ్, ఆసుపత్రులకు మాత్రమే కరెంటును సరఫరా చేస్తున్నారు. థానె, పన్వెల్పై తీవ్ర ప్రభావం పడింది. ఈ సాంకేతిక లోపాలను తొలగించడానికి కనీసం రెండు గంటల సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు. మహారాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి నితిన్ రౌత్.. ఇదే సమాచారాన్ని తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
ఎక్కడికక్కడే స్తంభించిన రైళ్లు..
ముంబైకర్లకు గుండె వంటి సబర్బన్, మెట్రో రైళ్ల వ్యవస్థ స్తంభించిపోయింది. ఛత్రపతి శివాజీ టెర్మినస్, దాదర్, కల్యాణ్ స్టేషన్లలో రైళ్లు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఎలా ఉన్నవి అలానే ఆగిపోయాయి. దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన రైళ్లకు ఎలక్ట్రికల్ ఇంజిన్లను తొలగించి, డీజిల్ ఇంజిన్లను అమర్చుతున్నారు సెంట్రల్ రైల్వే అధికారులు. రైళ్లు ముందుకు కదిలే అవకాశం లేకపోవడంతో ప్రయాణికులు పట్టాల కాలినడకన పట్టాల వెంబడి రాకపోకలు సాగిస్తున్నారు. పెట్రోల్ బంకులను సైతం మూసివేయాల్సిన పరిస్థితి నెలకొంది.
కంగారొద్దు..
ముంబై బ్లాక్ అవుట్ వల్ల ఎవ్వరూ ఆందోళనకు గురి కావొద్దని బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ విజ్ఙప్తి చేశారు. త్వరలోనే విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తారని చెప్పారు. ప్రశాంతంగా ఉండాలని ఆయన సూచించారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు. మరోవంక బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అధికారులు ప్రత్యేకంగా హెల్ప్లైన్ సెంటర్ను నెలకొల్పారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం వల్ల అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారు హెల్ప్లైన్ నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు.