హాస్పిటల్లో కరెంటు కష్టాలు.. సెల్ఫోన్ వెలుగులో డాక్టర్ల తంటాలు..
లక్నో : యూపీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో దయనీయ స్థితికి మరో నిలువెత్తు నిదర్శనంగా నిలిచే ఘటన వెలుగులోకి వచ్చింది. ఒకవైపు కరెంట్ కోతలు, మరోవైపు లో ఓల్టేజ్ సమస్యతో డాక్టర్లతో పాటు పేషెంట్లు ఇబ్బంది పడుతున్నారు. హాస్పిటల్లో కరెంట్ లేకపోవడంతో సెల్ఫోన్ ఫ్లాష్ లైట్ వెలుగులో రోగులకు చికిత్స చేస్తున్నారు. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
యూపీలోని సంబల్ జిల్లాలో శుక్రవారం భారీ వర్షం పడటంతో కరెంటు సరఫరా నిలిచిపోయింది. కరెంటు తరుచూ వస్తూ పోతుండటం, వచ్చినా లో ఓల్టేజ్ ఉండటంతో ట్రీట్మెంట్ చేయడం కష్టంగా మారింది. దీంతో హాస్పిటల్ సిబ్బంది, రోగుల బంధువులు సెల్ఫోన్ టార్చ్లు ఆన్ చేయగా.. ఆ వెలుగులోనే డాక్టర్లు చికిత్స అందించారు. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
నో పార్కింగ్ జోన్లో వాహనం నిలిపితే 15 వేల నుంచి 23 వేల రూపాయలు ఫైన్
ప్రభుత్వ హాస్పిటల్లో కనీస సదుపాయాలు లేవని రోగుల బంధువులు అంటున్నారు. ఇన్వర్టర్లు, జనరేటర్లుగానీ లేకపోవడంతో కరెంటు కోతల సమయంలో చికిత్స అందించేందుకు డాక్టర్లు నానా తంటాలు పడుతున్నారు. గంటల తరబడి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పేషెంట్లు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి హాస్పిటల్లో కనీస వసతులు కల్పించాలని రోగులు, వారి బంధువులు కోరుతున్నారు.
ఫ్లాష్ లైట్ వెలుగులో ట్రీట్మెంట్ ఇస్తున్న ఘటన సబ్ డివిజినల్ మెజిస్ట్రేట్ దృష్టికి వెళ్లడంతో ఆయన స్పందించారు. హాస్పిటల్ అధికారులు తప్పు చేసినట్లు తేలిచే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి హాస్పిటల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.