యోగి..భావోద్వేగం: భారత ప్రజాస్వామ్యం పవరేంటో చూపాం: అది..శతాబ్దాల నాటి వివాదం
అయోధ్య: అయోధ్యలో రామమందిరం నిర్మించాలనే శతాబ్దాల నాటి కలను నెరవేర్చుకున్నామని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యానించారు. 500 సంవత్సరాలకు పైగా న్యాయస్థానాల్లో నలుగుతూ.. అత్యంత వివాదాస్పదంగా మారుతూ వచ్చిన రామజన్మభూమి-బాబ్రీ మసీదును పరిష్కరించుకున్న తీరు..దేశ ప్రజాస్వామ్యానికి ఉన్న శక్తిసామర్థ్యాలు ఏమిటో రుజువు చేసిందని అన్నారు. ప్రజాస్వామ్య విలువలకు భారతీయులు ఎలా పట్టం కట్టారన విషయాన్ని ప్రపంచం మొత్తం ప్రత్యక్షంగా తిలకించిందని చెప్పారు.
యోగి.. భావోద్వేగం..
అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడారు. భూమిపూజ ముగిసిన వెంటనే బహిరంగ సభలో ప్రసంగించారు. తన ప్రసంగం సందర్భంగా ఆయన పలుమార్లు భావోద్వేగానికి గురయ్యారు. అయోధ్యలో రామమందిరాన్ని నిర్మించుకోవడానికి కొన్ని తరాలు ఎదురు చూశాయని అన్నారు. ఎందరో రామభక్తులు పోరాటం చేశారని స్మరించుకున్నారు. సంవత్సరాలకు సంవత్సరాలు కాలగర్భంలో కలిసిపోయాయని చెప్పారు.
వివాదాన్ని పరిష్కరించుకున్న తీరు అద్భుతం..
న్యాయపరమైన చిక్కులు, ఇబ్బందులు తలెత్తడం వల్లే సకాలంలో ఆలయ నిర్మాణాన్ని పూనుకోలేకపోయామని యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. అలాంటి వివాదాస్పద ప్రదేశాన్ని, చిక్కుముడులను ఎలా పరిష్కరించుకున్నామో ప్రపంచం మొత్తం చూసిందని అన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకపోవడం భారతీయుల్లో ఉన్న సోదర తత్వాన్ని చాటుతోందని అన్నారు. దేశ ప్రజాస్వామ్య విలువలకు ప్రజలు పట్టం కట్టిన అద్భుత దృశ్యం అయోధ్య భూవివాద పరిష్కారంలో కనిపించిందని యోగి ఆదిత్యనాథ్ చెప్పుకొచ్చారు.
30 ఏళ్ల పోరాటం ఇది..
శతాబ్దాల నాటి వివాదాన్ని కూడా రాజ్యంగబద్ధంగా, ప్రజాస్వామ్యయుతంగా, శాంతియుతంగా ఎలా పరిష్కరించుకోవచ్చో రామజన్మభూమి కేసు ప్రపంచానికి చాటి చెప్పిందని అన్నారు. అనంతరం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ మాట్లాడుతూ దేశం మొత్తం నేడు ఆనంద డోలికల్లో తేలిపోతోందని అన్నారు. శతాబ్దాల నాటి కల నిజమౌతోందని చెప్పారు. అయోధ్యలో రామమందిరాన్ని నిర్మించడానికి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ముందు నుంచీ పోరాడుతోందని అన్నారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ బాలాసాహెబ్ దేవ్రస్ 20-30 సంవత్సరాల పాటు పోరాడారని గుర్తు చేశారు.
Recommended Video
వసుదైవ కుటుంబకం నినాదానికి నిదర్శనం..
నాటి పోరాట ఫలాలను తాము రుచి చూస్తున్నామని మోహన్ భగవత్ అన్నారు. రామమందిరం నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమాన్ని నిర్వహించిన ఈ సందర్భం చరిత్రలో నిలిచిపోతుందని, ఇకపై దేశ చరిత్రలో ఒక నూతన అధ్యాయం ఆరంభమైందని అన్నారు. వసుదైవ కుటుంబకం అనే నినాదానికి సరైన అర్థాన్ని ఇచ్చామని అన్నారు. దేశ ప్రజలందరూ ఏకాభిప్రాయానికి రావడం అనేది చాలా అరుదుగా సంభవిస్తుంటుందని, అలాంటి చారిత్రాత్మక ఘట్టాన్ని ఇప్పుడు ఆవిష్కృతమైందని భగవత్ అన్నారు.