గవర్నర్ బీజేపీ ఏజెంట్.. వేటు వేయాల్సిందే.. కాంగ్రెస్ నేత ధ్వజం
మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీపై కాంగ్రెస్ నేతలు విరుచుకుపడుతున్నారు. కేవలం మహారాష్ట్రలోనే కాకుండా ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్ లాంటి రాష్ట్రాల నేతలు కూడా గవర్నర్పై విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్ సీనియర్ నేత ప్రదీప్ మాథూర్ దారుణమైన కామెంట్లు చేశారు. భగత్ సింగ్ కోష్యారీ బీజేపీ ఏజెంట్, రాష్ట్రపతి కార్యాలయం ప్రతిష్టను దిగజార్చిన గవర్నర్ను తొలగించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రపతి పాలన ఎలా ఎత్తివేస్తారు?
మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన ఎత్తివేయాన్ని కూడా ప్రదీప్ మాథూర్ తప్పుపట్టారు. క్యాబినెట్ సమావేశం జరపకుండా రాష్ట్రపతి పాలనను ఎలా ఎత్తివేస్తారని ప్రశ్నించారు. బీజేపీ ఏజెంట్గా పనిచేస్తున్న కోష్యారీ స్వయంగా రాజీనామా చేయాలి. లేకపోతే ఆయనపై వేటు వేయాలని రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్కు మాథుర్ కోరారు.
మెజారిటీ ఉందా? లేదా?
ప్రమాణస్వీకారం చేయడానికి ముందు తమకు మెజారిటీ ఉందా లేదా అనే విషయాన్ని దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ చూసుకోకపోవడం దారుణమని ఆయన వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన పెట్టడం, తొలగిస్తూ తీసుకొన్న నిర్ణయం అత్యంత వివాదాస్పదంగా మారింది. ఆయన తన చర్యలతో దేశ అత్యున్నత పదవిని వివాదంలోకి నెట్టారని పేర్కొన్నారు.
ప్రధాని సిఫారసు చేయాల్సింది
ప్రధాని నరేంద్రమోదీ కనీసం క్యాబినెట్ మీటింగ్ జరపకపోయినా.. రాష్ట్రపతి పాలనను ఎత్తి వేయాలని ప్రసిడెంట్ రామ్నాథ్ కోవింద్కు సిఫారసు చేసి ఉంటే బాగుండేది. ఇప్పటి వరకు నేను 20 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్నాను. ఇలాంటి దారుణమైన పరిస్థితిని ఎప్పుడూ చూడలేదని ఆయన అన్నారు.
మహారాష్ట్రలో గందరగోళం
శనివారం ఉదయం అనూహ్య పరిస్థితుల మధ్య సీఎంగా ఫడ్నవీస్తో, డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్తో గవర్నర్ కోష్యారీ ప్రమాణ స్వీకారం చేయడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. బలపరీక్షను 24 గంటల్లోనే నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశంతో ఫడ్నవీస్, అజిత్ పవార్ రాజీనామా చేయడం, శివసేన కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రావడం లాంటి అంశాలు చకచకా జరిగిపోయాయి.