వలస కార్మికులకు కాంగ్రెస్ వరం: పీసీసీ నేతలకు సోనియా లేఖ: అలాంటి దృశ్యాలు చూడాల్సి వస్తుందని..
న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దేశవ్యాప్తంగా లాక్డౌన్ను కొనసాగిస్తోన్న వేళ.. లక్షలాది మంది వలస కార్మికులు ఉపాధిని కోల్పోయి రోడ్ల మీద పడ్డారు. కనీస రవాణా వసతి కూడా లేకుండా గుంపులు గుంపులుగా వందలాది కిలోమీటర్ల దూరాన్ని కాలి నడకన అధిగమిస్తున్నారు. నడుచుకుంటూ స్వస్థలాలకు చేరుకుంటున్నారు. మూటాముల్లె సర్దుకుని, పిల్లా, పాపలను చేతబట్టుకుని కాళ్లు ఈడ్చుకుంటూ స్వస్థలాలకు బయలుదేరిన వలస కార్మికుల ఫొటోలు సోషల్ మీడియాను షేక్ చేశాయి.
రైళ్లు అందుబాటులోకి తెచ్చినా..
లాక్డౌన్ అమల్లోకి వచ్చిన తొలిరోజుల నుంచే వారి కాలినడక ఆరంభమైంది. దాదాపుగా సగం మందికి పైగా వలస కార్మికులు తమ గమ్యస్థానాలకు చేరుకున్న తరువాత.. మిగిలి ఉన్న వారి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రవాణా వసతిని అందుబాటులోకి తీసుకొచ్చింది. వలస కార్మికుల కోసం రైళ్లను నడిపించడానికి అనుమతులను మంజూరు చేసింది. ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల ప్రభుత్వం ఆర్టీసీ బస్సులను కూడా నడిపిస్తున్నాయి.
రవాణా ఖర్చులను భరిస్తామంటోన్న కాంగ్రెస్..
ఈ పరిస్థితుల్లో వలస కార్మికులను ఆదుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ముందుకొచ్చింది. వారి రవాణాకు అవసరమైన ఖర్చులన్నింటినీ భరిస్తామని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ తాత్కాలిక అధినేత్రి సోనియాగాంధీ స్పష్టం చేశారు. ఏ రాష్ట్రానికి చెందిన వలస కార్మికుల రవాణా ఖర్చును ఆ రాష్ట్రానికి చెందిన ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలు భరిస్తాయని వెల్లడించారు. ఈ మేరకు అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులకు సోనియాగాంధీ లేఖ రాశారు. వలస కార్మికుల కష్టాలను తీర్చాలని ఆదేశించారు. రవాణా ఖర్చును భరించాలని ఆమె ఈ లేఖలో పేర్కొన్నారు. దేశానికి వెన్నెముకలాంటి వలస కార్మికుల కష్టాన్ని తీర్చడం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కర్తవ్యమని సూచించారు.
కేంద్రంపై మండిపాటు..
వలస కార్మికులను కేంద్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని సోనియాగాంధీ మండిపడ్డారు. కనీస రవాణా వసతిని ఏర్పాటు చేయకుండా.. వారిని వందలాది కిలోమీటర్ల దూరం నడిపించిందని ఆరోపించారు. కేంద్రం వైఖరి వల్లే ఈ దుస్థితిని వారు ఎదుర్కొన్నారని విమర్శించారు. సరైన ప్రణాళికను అనుసరించలేదని, ఫలితంగా లక్షలాది మంది వలస కార్మికులు ఉపాధిని కోల్పోవాల్సి వచ్చిందని ధ్వజమెత్తారు.
ట్రంప్ రెండు రోజుల పర్యటనకు 100 కోట్లు..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటనకు వచ్చిన సమయంలో రెండు రోజుల్లోనే కేంద్ర ప్రభుత్వం వంద కోట్ల రూపాయలను ఖర్చు చేసిందని, అలాంటిది వలస కార్మికుల కోసం ఉచితంగా రవాణా ఎందుకు ఏర్పాటు చేయలేపోయిందని నిలదీశారు. రైల్వే మంత్రిత్వ శాఖ పీఎం కేర్కు 151 కోట్ల రూపాయల విరాళాన్ని ఇచ్చిందని, అలాంటిది వలస కార్మికులకు రైళ్లల్లో ఉచిత ప్రయాణాన్ని కల్పించలేక చేతులెత్తేసిందని సోనియాగాంధీ నిప్పులు చెరిగారు.
Recommended Video
1947 తరువాత తొలిసారిగా..
1947 తరువాత తొలిసారిగా ఇలా లక్షలాది మంది కార్మికులు తమ గమ్యస్థానాలను చేరుకోవడానికి వందలాది కిలోమీటర్ల దూరం నడవాల్సి వచ్చిందని సోనియాగాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. దేశ విభజన సమయం తరువాత అలాంటి దృశ్యాలను చూడాల్సిన దౌర్భాగ్యం ఏర్పడిందని అన్నారు. ఆధునిక భారతావనిలో, అన్ని రాకల రవాణా వసతులు అందుబాటులో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లోనూ హృదయ విదారక దృశ్యాలను చూడాల్సి వస్తుందని తాను అనుకోలేదని అన్నారు.