ఎడిటర్ గౌరి లంకేష్ హత్య కేసుతో సాద్వి ప్రగ్యా సింగ్ ఠాకుర్ కు లింక్ లేదు, ఎస్ఐటీ అధికారులు !
బెంగళూరు: ప్రముఖ కన్నడ లంకేష్ పత్రిక ఎడిటర్ గౌరి లంకేష్ హత్య కేసుతో సాద్వి ప్రగ్యా సింగ్ ఠాకూర్ కు ఎలాంటి సంబంధం లేదని కేసు దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక బృందం పోలీసులు (ఎస్ఐటీ) గురువారం మీడియాకు చెప్పారు. గౌరి లంకేష్ హత్యతో సాద్వి ప్రగ్యా సింగ్ ఠాకూర్ కు సంబంధం ఉందని ఒక ఆంగ్ల పత్రికలో గురువారం వార్త వచ్చిన నేపథ్యంలో ఎస్ఐటీ అధికారులు వివరణ ఇచ్చారు.
2017 సెప్టెంబర్ 5వ తేదీన రాత్రి సుమారు 8 గంటల సమయంలో బెంగళూరులోని రాజరాజేశ్వరి నగర్ లోని నివాసంలో లంకేష్ పత్రిక ఎడిటర్ గౌరి లంకేష్ హత్యకు గురైనారు. గౌరి లంకేష్ హత్య వెనుక సాద్వి ప్రగ్యా సింగ్ ఠాకూర్ హస్తం ఉందని గురువారం ఒక ఆగ్ల పత్రికలో వార్త ప్రచురించారు.
ఇప్పటికే కేసు విచారణ చేస్తున్న ఎస్ఐటీ అధికారులు పలు కీలక సాక్షాలు సేకరించారు. ఆంగ్ల పత్రికలో ప్రచురితమైన వార్త విషయంలో ఎస్ఐటీ అధికారులు వెంటనే స్పందించారు. గౌరి లంకేష్ హత్యతో సాద్వి ప్రగ్యా సింగ్ ఠాకూర్ కు ఎలాంటి సంబంధం లేదని, చార్జ్ షీట్ లో ఆ పేరు లేదని ఎస్ఐటీ అధికారులు వివరించారు.
సాద్వి ప్రగ్యా సింగ్ ఠాకూర్ కు వ్యతిరేకంగా ఎలాంటి సాక్షాలు మాకు చిక్కలేదని, కోర్టుకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని ఎస్ఐటీ అధికారులు తెలిపారు. గౌరి లంకేష్ హత్య కేసులో ఇప్పటికే 16 మందిని ఎస్ఐటీ అధికారులు అరెస్టు చేశారు. పరారైన ఇద్దరి కోసం అధికారులు గాలిస్తున్నారు.
గౌరి లంకేష్ ను ఎవరు హత్య చేశారు అనే విషయం ఇంకా కచ్చితంగా వెలుగు చూడలేదు. 2015లో హత్యకు గురైన ఎంఎం. కలబుర్గి హత్య కేసును వేగవంతంగా విచారణ చెయ్యాలని, హంతకులను పట్టుకోవాలని ఎస్ఐటీ అధికారులకు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.