నాథూరామ్ గాడ్సే ఓ గొప్ప దేశభక్తుడు: పెట్రోల్ పోసిన సాధ్వి ప్రజ్ఞాసింగ్
Recommended Video
భోపాల్: సార్వత్రిక ఎన్నికల ప్రచారం చివరి దశకు వచ్చేసరికి విచిత్రమైన మలుపులు తీసుకుంటోంది. అనూహ్య పరిణామాలకు కేంద్ర బిందువు అవుతోంది. ఈ నెల 19వ తేదీన మొత్తం 59 లోక్సభ నియోజకవర్గాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ 59 నియోజకవర్గాల్లో మెజారిటీ స్థానాలను దక్కించుకోవడానికి అన్ని పార్టీలూ వివాదాస్పద వ్యాఖ్యలకు తెర తీస్తున్నాయి. తాజాగా- ఎన్నికల ప్రచార కార్యక్రమాలు జాతిపిత మహాత్మాగాంధీని కాల్చి చంపిన నాథూరామ్ గాడ్సే చుట్టూ తిరుగుతున్నాయి.
స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటి ఉగ్రవాది ఓ హిందువేనని, ఆయన పేరు నాథూరామ్ గాడ్సే అని మక్కళ్ నీథి మయ్యం వ్యవస్థాపక అధ్యక్షుడు కమల్ హాసన్ అగ్గి రాజేశారు. ఈ అగ్గి చల్లారక ముందే- అందులో పెట్రోల్ పోసింది భారతీయ జనతాపార్టీ. నాథూరామ్ గాడ్సే ఉగ్రవాది కాదని, ఆయన ఓ గొప్ప దేశభక్తుడని ఆ పార్టీ నాయకురాలు, ఆ పార్టీ భోపాల్ బీజేపీ లోక్సభ అభ్యర్థిని సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ కితాబిచ్చారు. దీనిపై అటు కాంగ్రెస్ సహా, బీజేపీయేతర పార్టీలన్నీకత్తులు నూరుతున్నాయి.
ఎన్నికల ప్రచారంలో భాగంగా- భోపాల్ లోక్సభ నియోజకవర్గంలో సాధ్వి ప్రజ్ఞాసింగ్ ప్రస్తుతం రోడ్షో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ఆమె బదులిచ్చారు. నాథూరామ్ గాడ్సేను ఉగ్రవాదిగా చెబుతున్నారని, భోపాల్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి దిగ్విజయ్ సింగ్ కూడా ఈ విషయాన్ని బలపరిచారని ఆయన ప్రజ్ఞాసింగ్ వద్ద ప్రస్తావించారు. దీనిపై ఆమె బదులిస్తూ- నాథూరామ్ గాడ్సే దేశభక్తుడని అన్నారు. దేశభక్తుడిలా చరిత్రలో స్థానం సంపాదించుకున్నారని చెప్పారు. ఆయనను ఉగ్రవాదిగా గుర్తించిన వారికి ఈ ఎన్నికల్లో గుణపాఠం చెబుతామని ఆమె ధీమా వ్యక్తం చేశారు.
#WATCH BJP Bhopal Lok Sabha Candidate Pragya Singh Thakur says 'Nathuram Godse was a 'deshbhakt', is a 'deshbhakt' and will remain a 'deshbhakt'. People calling him a terrorist should instead look within, such people will be given a befitting reply in these elections pic.twitter.com/4swldCCaHK
— ANI (@ANI) May 16, 2019
నాథూరామ్ గాడ్సే ఓ ఉగ్రవాది అంటూ ప్రకటించిన కమల్హాసన్ ప్రస్తుతం తీవ్ర నిరసనలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఆయనపై గుర్తు తెలియని వ్యక్తులు చెప్పులు కూడా విసిరారు. కమల్హాసన్పై కేసులు కూడా నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో- తాజాగా ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ చేసిన ఈ ప్రకటనను బీజేపీయేతర పార్టీలు ఎన్నికల ప్రచారాస్త్రంగా మార్చుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.