దిగ్విజయ్ను టెర్రరిస్ట్తో పోల్చిన సాధ్వీ! ప్రగ్యా వ్యాఖ్యల్ని సుమోటోగా తీసుకున్న ఈసీ!
భోపాల్ : ఎన్నికల సంఘం నోటీసులు అందుకున్నా సాధ్వీ ప్రగ్యా ఠాకూర్ తీరు మార్చుకోవడం లేదు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఈసీ తాఖీదులు అందుకున్న ఆమె తాజాగా మరోసారి విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారు. భోపాల్ కాంగ్రెస్ అభ్యర్థి దిగ్విజయ్ సింగ్ను టెర్రరిస్టుతో పోల్చారు. అయితే చేసిన తప్పు తెలుసుకుని నాలుక్కరుచుకున్న ఆమె ఇప్పుడు మాట మార్చారు.
ఎన్ఐఏ కోర్టులో ప్రగ్యా ఠాకూర్కు ఊరట
దిగ్విజయ్ ఉగ్రవాది అంటూ చేసిన కామెంట్లు వివాదాస్పదంగా మారడంతో సాధ్వీ ప్రగ్యా ఠాకూర్ వెనక్కి తగ్గారు. అయితే ఈ లోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. డిగ్గీ రాజాను ఉగ్రవాదితో పోలుస్తూ ప్రగ్యా చేసిన కామెంట్లను సుమోటోగా స్వీకరించిన ఎలక్షన్ కమిషన్ దీనిపై డిస్ట్రిక్ రిటర్నింగ్ ఆఫీసర్ నుంచి రిపోర్టు కోరింది.
గురువారం సిహోర్లో పార్టీ ప్రచార కార్యాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా సాధ్వీ ప్రగ్యా ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. 16 ఏళ్ల క్రితం సోదరి ఉమాభారతీ ఓడించిన టెర్రరిస్టును మట్టికరిపించేందుకు ఇప్పుడు మరో సన్యాసిని వచ్చిందని అన్నారు. మళ్లీ రాజకీయాల గురించి ఆలోచించకుండా ఆయనను నాశనం చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్పై నిప్పులు చెరిగిన ఆమె ఆ పార్టీ సాధు సంతువులకు టెర్రరిస్టు ముద్ర వేసి జైలుకు పంపుతుందని విమర్శించారు.