ఎట్టకేలకు కోర్టుకు హాజరైన ఎంపీ ప్రగ్యా ఠాకూర్...తనకేమీ తెలియదని స్టేట్మెంట్
లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత తొలిసారిగా కోర్టుకు హాజరయ్యారు కేంద్ర మంత్రి ప్రగ్యా సాద్వీ. ముంబైలోని నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ స్పెషల్ కోర్టుకు ఆమె హాజరయ్యారు. 2008 మాలెగావ్ పేలుళ్ల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రగ్యా సాద్వీ పేలుళ్లతో తనకు ఎలాంటి సంబంధం లేదని న్యాయస్థానానికి తెలిపారు. ఇదిలా ఉంటే ఈ కేసులో మొత్తం ఏడు మంది విచారణను ఎదుర్కొంటున్నారు. అందులో ఒకరు ప్రగ్యా సాద్వీ.
ఇక మాలెగావ్ పేలుళ్లకు సంబంధించి విచారణకు వ్యక్తిగతంగా హాజరుకావాలని కేసును విచారణ చేస్తున్న జస్టిస్ వీఎస్ పడాల్కర్ ఆదేశించారు. అయితే చాలాసార్లు ఆమె వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకాలేదు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి 116 మంది సాక్షులను విచారణ చేశామని దీనిపై ఏమైనా అవగాహన ఉందా అని జడ్జి ప్రశ్నించారు. కనీసం మీ లాయర్లు అయినా ఈ విషయాన్ని నీదృష్టికి తీసుకొచ్చారా అని జడ్జి ప్రశ్నించగా తనకు ఈ విషయం తెలియదని వెల్లడించారు. 2008 సెప్టెంబర్ 29న మాలెగావ్లో పేలుళ్లు జరిగాయన్న సంగతి తెలుసా అని కోర్టు అడుగగా.. దాని గురించి అంతకంటే తెలియదని సాధ్వీ సమాధానం చెప్పారు.
మాలెగావ్ పేలుళ్లు జరిగిన సమయంలో ఆరుగురు మృతి చెందగా 100కు పైగా గాయపడ్డారు.ఈ పేలుళ్లకు మోటారుబైకును వినియోగించగా ఈ బైకు ప్రగ్యా సాధ్వీ పేరిటే రిజిస్టర్ అయి ఉంది. దీన్ని ఆధారం చేసుకునే 2008లో ప్రగ్యా సాధ్వీని అరెస్టు చేశారు. 2017లో ఆమెకు బాంబే హైకోర్టు బెయిల్ ఇచ్చింది. ఇక మాలెగావ్ పేలుళ్ల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారంతా వారానికి ఒకసారి కోర్టుకు హాజరు కావాలని ఎన్ఐఏ కోర్టు ఆదేశించింది. అయితే విచారణకు చాలామంది హాజరుకాలేదు.
కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారంతా బెయిల్పై ఉన్నారు. ఇక ఎంపీగా ఎన్నికవడంతో పార్లమెంటులో లాంఛనాలు పూర్తి చేయాల్సి ఉన్నందున ఈ వారం కోర్టు హాజరుకు మినహాయింపు ఇవ్వాలని సాధ్వీ తరపున లాయరు కోర్టును కోరారు. కోర్టు ఇందుకు తిరస్కరించింది. గురువారం కోర్టుకు హాజరు కావాల్సి ఉండగా ఆరోగ్య సమస్యలు కారణంగా చూపి హాజరు కాకపోవడంతో కోర్టు సీరియస్ అయ్యింది. శుక్రవారం కనుక కోర్టుకు హాజరు కాకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని న్యాయమూర్తి హెచ్చిరించారు. ఆరోగ్య సమస్యలు చూపిన సాద్వీ అదే రోజు సాయంత్రం మహారానా ప్రతాప్ జయంతి ఉత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.