రక్షణ మంత్రిత్వ శాఖ పార్లమెంటరీ కమిటీలో ప్రగ్యా సింగ్ ఠాకూర్
న్యూఢిల్లీ: వివాదాస్పద భారతీయ జనతా పార్టీ ఎంపీ ప్రగ్యా సింగ్ ఠాకూర్ను రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని రక్షణ మంత్రిత్వశాఖ పార్లమెంటరీ కన్సల్టేటివ్ కమిటీకి ఎంపిక చేశారు. ఈ కమిటీలో 21 మంది సభ్యులు ఉన్నారు.
జైట్లీ, సుష్మా స్వరాజ్లపై విపక్షాలు చేతబడి చేయించాయి: ప్రగ్యా సాధ్వీ
ఎన్నికల సమయంలో భోపాల్ ఎంపీ అభ్యర్థిగా ప్రగ్యాను నిలబెట్టడంపై బీజేపీ ఆరోపణలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. అయినప్పటికీ బీజేపీ ఆమెనే బరిలో ఉంచింది. అయితే, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రెండు సార్లు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేసిన దిగ్విజయ్ సింగ్పై ప్రగ్యా సింగ్ గెలుపొందడం గమనార్హం.
కాగా, మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ కింద ఆమెపై వచ్చిన అభియోగాలను ఎన్ఐఏ తొలగించింది. ఈ క్రమంలో ఆమెకు 2017, ఏప్రిల్లో ఆమె బెయిల్పై విడుదలైంది. 2008 మాలేగావ్ పేలుడు కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే.
2019, మేలో జరిగిన సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో నాథూరామ్ గాడ్సేను దేశ భక్తుడు అని ఆమె అనడంతో పెద్ద దుమారమే రేగింది. ప్రధాని నరేంద్ర మోడీ జోక్యంతో ఆమె తన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పారు.
ఇది ఇలావుంటే, రక్షణ మంత్రిత్వశాఖ పార్లమెంటరీ కన్సల్టేటివ్ కమిటీకి ప్రగ్యా సింగ్ ఠాకూర్ ఎంపిక చేయడంపై కాంగ్రెస్ పార్టీ నేతలు ఆక్షేపిస్తున్నారు. పలు కేసుల్లో నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొన్న ఆమెకు ఇలాంటి కీలక స్థానం ఇవ్వడమేంటని ప్రశ్నిస్తున్నారు.