గాడ్సేను సభలో పొగిడిన ఘటన: క్షమాపణలు కోరిన ప్రగ్యా సింగ్, కానీ...!
న్యూఢిల్లీ: లోక్సభలో జాతిపిత మహాత్మాగాంధీని హత్య చేసిన నాథూరాం గాడ్సే దేశభక్తుడని చెబుతూ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై షరతులతో కూడిన క్షమాపణ చెప్పారు భోపాల్ ఎంపీ ప్రగ్యా సింగ్ ఠాకూర్. ఎస్పీజీ పై సభలో చర్చ జరుగుతున్న సమయంలో ప్రగ్యాసింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
క్షమాపణ చెప్పిన ప్రగ్యాసింగ్
మహాత్ముడిని హత్య చేసిన నాథూరాంగాడ్సే నిజమైన దేశభక్తుడని చెప్పి వివాదానికి తెరదీసిన ఎంపీ ప్రగ్యాసింగ్ సభలో క్షమాపణ కోరారు. తన వ్యాఖ్యలతో ఎవరైనా బాధపడి ఉంటే తనను క్షమించాల్సిందిగా ఎంపీ ప్రగ్యాసింగ్ సభలో కోరారు. అదే సమయంలో తాను చేసిన వ్యాఖ్యలను కొందరు వక్రీకరించారని చెప్పుకొచ్చారు. తనను కొందరు ఉగ్రవాదిగా ముద్రవేయడం బాద కలిగించిందని చెప్పిన సాద్వీ ప్రగ్యా తాను ఉగ్రవాదిని అనేందుకు రుజువులు ఎక్కడున్నాయని ప్రశ్నించారు. ఏ కోర్టు చెప్పిందని ప్రశ్నించారు.
ప్రగ్యాను ఉగ్రవాది అనడం గాంధీ హత్యకంటే దారుణమైన విషయం
ఇక సభ ప్రారంభం కాగానే ప్రగ్యాసింగ్ ఠాకూర్ క్షమాపణ చెప్పాల్సిందేనంటూ కాంగ్రెస్ నినాదాలు చేసింది. దీంతో ప్రగ్యా సింగ్ ఠాకూర్ క్షమాపణలు చెప్పారు. అయితే సభలో బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే కూడా రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ప్రగ్యా ఠాకూర్ను ఉగ్రవాది అన్న రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలన్నారు. మాలెగావ్ పేలుళ్ల కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న ప్రగ్యా ఠాకూర్ను ఉగ్రవాది అని ఎలా అంటారని ఆయన ప్రశ్నించారు. ఠాకూర్ మహాత్మా గాంధీపై చేసిన వ్యాఖ్యల కంటే రాహుల్ వ్యాఖ్యలు మరింత బాధించేలా ఉన్నాయని చెప్పారు. మహారాష్ట్రలో కాంగ్రెస్ శివసేనతో జతకట్టి ప్రభుత్వం ఏర్పాటు చేసిందని.. అదే శివసేన గాడ్సేని దేశభక్తుడిగా తన మాతృపత్రిక సామ్నా ద్వారా పేర్కొందని దూబే గుర్తుచేశారు.
అంతా సర్దుకుంది..రాజకీయం చేయొద్దన్న స్పీకర్
సభలో గందరగోళం నెలకొంటున్న నేపథ్యంలో ఇంతటితో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలని కోరారు. దీనికి రాజకీయ రంగును అద్దొద్దని చెప్పారు. ప్రపంచమే మహాత్ముడి విధానాలను పాటిస్తోందని దీన్ని రాజకీయం చేయడం తగదని స్పీకర్ ఓంబిర్లా చెప్పారు. ఇక ఈ అంశానికి సంబంధించినది ఏది రికార్డులకు ఎక్కదని చెప్పారు. మహాత్మాగాంధీని పొట్టనబెట్టుకున్న వ్యక్తిని పొగడటం సభ ఎంతమాత్రం హర్షిందని స్పీకర్ ఓంబిర్లా అన్నారు.
మిన్నంటిన నిరసనలు
ఇదిలా ఉంటే ప్రగ్యా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఢిల్లీ యూత్ కాంగ్రెస్ వినూత్న పద్ధతిలో నిరసన తెలిపింది. మహాత్మా గాంధీ వేషధారణ ధరించి యూత్ కాంగ్రెస్ సభ్యులు నిరసన తెలిపారు. జాతిపిత మహాత్మాగాంధీని హత్య చేసిన నాథూరాం గాడ్సేను నిజమైన దేశభక్తుడని చెప్పడం సరికాదని ఆమె క్షమాపణకు డిమాండ్ చేస్తూ నిరసనలు తెలిపారు.