2నెలల చికిత్స, మళ్లీ ఆస్పత్రిలో చేరిన బీజేపీ ఎంపీ ప్రగ్యా ఠాకూర్ -ఆగిన పేలుళ్ల కేసు విచారణ
భారతీయ జనతాపార్టీ(బీజేపీ) తురుపుముక్క, భోపాల్ ఎంపీ అయిన సాధ్వి ప్రగ్యా సింగ్ ఠాకూర్ మళ్లీ ఆస్పత్రిలో చేరారు. ముక్కులో అదనపు శ్లేష్మం, స్రావాల కారణంగా ఆమెకు శ్వాస పీల్చుకోవడంలో తీవ్రమైన ఇబ్బందులు తలెత్తాయి. వైద్యుల సలహా మేరకు ఆమెను శుక్రవారం ఢిల్లీ ఎయిమ్స్కు తరలించారు.
కొంత కాలంగా పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ప్రగ్యా సింగ్ ఠాకూర్కు శ్వాస సంబంధ సమస్య, ఛాతిలో నొప్పి రావడంతో ఢిల్లీ ఎయిమ్స్లోని ప్రైవేట్ వార్డులో చేర్చామని, డాక్టర్ రణదీప్ గులేరియా నేతృత్వంలోని వైద్యుల పర్యవేక్షణలో ఆమెకు చికిత్స అందిస్తున్నదని ఎంపీ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.
టెర్రరిజం ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పటికీ, బీజేపీ ఎంపీగా గెలుపొందిన ప్రగ్యా సింగ్.. గాడ్సేను దేశభక్తుడంటూ వరుసగా వార్తల్లో నిలిచారు. కాగా, గత ఏడాది డిసెంబర్ 18న కరోనా లక్షణాలతో ఆమె ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరారు. రెండు నెలలకుపైగా చికిత్స అనంతరం ఇటీవలే డిశ్చార్జ్ అయ్యారు. ఆమె నిందితురాలిగా ఉన్న 2008 మాలెగావ్ పేలుడు కేసుపై ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు డిసెంబర్ 19న విచారణ జరుపాల్పి ఉండగా, ప్రగ్యా ఆస్పత్రిలో చేరడంతో విచారణ ఆగిపోయింది. ఇప్పుడు..
ఎంపీ ప్రగ్యా మళ్లీ ఆస్పత్రిలో చేరడంతో పేలుడు కేసు విచారణ మరింత ఆలస్యం కానుంది. మహారాష్ట్ర నాసిక్ జిల్లాలోని మాలేగావ్ సిటీలో 2008 సెప్టెంబర్ లో బాంబు పేలుడు చోటుచేసుకున్న ఘటనలో 9మంది మరణించారు, దీనికి సమాంతరంగా గుజరాత్ లో జరిగిన పేలుడులో ఒకరు మరణించారు. మాలేగావ్ పేలుడు కేసులో ప్రగ్యా సింగ్ ఠాకూర్ నిందితురాలని తెలిసిందే.