అదను చూసి దెబ్బకొట్టిన మోదీ -కాంగ్రెస్ పక్ష నేత ఆజాద్ పదవి గల్లంతు -జమ్మూకాశ్మీర్ అనాధ
రోజుకు కనీసం అరడజను మందైనా బీజేపీ నేతలు ప్రతిపక్షాలపై సీరియస్ కామెంట్లు చేస్తుండటం పరిపాటే అయినా, సరిగ్గా సమయం చూసి దెబ్బకొట్టడంలో మాత్రం తన స్టైలే వేరని ప్రధాని నరేంద్ర మోదీ తరచూ నిరూపించుకున్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రభుత్వం తరఫున సమాధానం చెబుతూ రాజ్యసభలో చేసిన ప్రసంగంలోనూ మోదీ మరోసారి అదే పనిచేశారు. కాంగ్రెస్ పార్టీలో సోనియా గాంధీకి వ్యతిరేకంగా పెల్లుబిగిన అసమ్మతిని పరోక్షంగా ప్రస్తావిస్తూ, అసమ్మతి వర్గానికి నాయకుడిగా భావిస్తోన్న గులాం నబీ ఆజాద్ ను మోదీ పొగడ్తలతో ముంచేశారు. ఇంకో వారం రోజుల్లో ఆజాద్ తన పదవిని కోల్పోతుండటంతో మోదీ వ్యాఖ్యలకు మరింత ప్రాధాన్యం ఏర్పడింది..
Recommended Video
షాకింగ్: జలవిలయంలో 203 మంది గల్లంతు -18 మృతదేహాలే దొరికాయి: సీఎం కీలక ప్రకటన
కుండబద్దలు కొట్టిన మోదీ..
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని మోదీ సోమవారం రాజ్యసభలో చేసిన ప్రసంగంలో ప్రతిపక్షాలపై సైలెంట్ సెటైర్లు విసురుతూనే, తమ విధానాలు సరైనవేనని, నిర్ణయాలపై వెనక్కి వెళ్లబోమని కుండబద్దలు కొట్టారు. కొత్త వ్యవసాయ చట్టాలపై విపక్షాల రచ్చకు సమాధానంగా, 1993నాటి మన్మోహన్ సింగ్ సంస్కరణలను ప్రస్తావించారు. కాంగ్రెస్ లొల్లి అర్థంలేనిదంటూ కౌంటరిచ్చిన ప్రధాని.. అనూహ్యరీతిలో అదే కాంగ్రెస్ పక్షనేత గులాం నబీ ఆజాద్ ను ప్రశంసించి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. కాంగ్రెస్ పార్టీలో అధినేత్రి సోనియా గాంధీపై తిరుగుబావుటా ఎగరేసిన 23 మంది సీనియర్లు(గ్రూప్-23 లేదా జీ-23)కి నాయకత్వం వహిస్తోన్న ఆజాద్ స్థానంలో.. రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీకి కొత్త నాయకుడు రానున్న వేళ మోదీ వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి..
చెన్నైఎయిర్ పోర్టు వద్ద కిడ్నాప్ -మహారాష్ట్ర అడవుల్లో సజీవదహనం -జార్ఖండ్ నేవీ ఉద్యోగి దారుణహత్య
కేంద్రానికి ఆజాద్ అండ..
ఆజాద్ తన సొంత రాష్ట్రమైన జమ్మూకశ్మీర్లో ఇటీలవ జరిగిన స్థానిక ఎన్నికలను ప్రశంసిస్తూ చేసిన వ్యాఖ్యలను మోదీ గుర్తు చేస్తూ, ఆజాద్ ఎప్పుడూ డీసెంట్గా మాట్లాడతారని, ఆయన నోటి వెంట అనుచిత భాషను ఎప్పుడూ వినలేదని ప్రధాని గుర్తుచేశారు. పార్టీలతో సంబంధం లేకుండా సభ్యులందరూ ఆజాద్ నుంచి నేర్చుకోవాల్సింది ఇదేనని, నబీ అంటే తనకెంతో గౌరవమని మోదీ అన్నారు. అంతటి ఆగకుండా, కాంగ్రెస్ అధిష్ఠానానికి గతంలో లేఖ రాసిన 23 మంది నేతలను జీ-23గా ప్రధాని పేర్కొంటూ, 'జీ-23' చేసిన సూచనలను ఆ పార్టీ (కాంగ్రెస్) కూడా ఆజాద్ వ్యాఖ్యలను ఇదే స్ఫూర్తితో తీసుకుంటే మంచిదని, ఆయన(ఆజాద్) సూచనలను పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలుగా పరిగణించబోదని ఆశిస్తున్నానని ప్రధాని పేర్కొన్నారు..
గులాం నబీ స్థానంలో కొత్త నేత..
రాజ్యసభలో ప్రతిపక్ష హోదా కలిగిన కాంగ్రెస్ పార్టీకి ఇన్నాళ్లూ గులాం నబీ ఆజాద్ నాయకుడిగా వ్యవహరించారు. కానీ ఈనెల 15తో ఆయన రాజ్యసభ పదవీకాలం(ఆరేళ్లు) పూర్తవుతోంది. దీంతో ఆజాద్ స్థానంలో కొత్త నేతను రాజ్యసభ పక్ష నాయకుడిగా ఎంపిక చేసేందుకు కాంగ్రెస్ హైకమాండ్ కసరత్తు చేస్తోంది. ప్రాబబుల్స్ జాబితాలో ఆనంద్ శర్మ(హర్యానా) పేరు వినిపిస్తున్నా, ఆయన టర్మ్ కూడా ఇంకా కొంతకాలమే ఉండటంతో, ప్రతిపక్ష నేత పదవి కర్ణాటకకు చెందిన మల్లికార్జున ఖర్గేకు దక్కొచ్చని సమాచారం. దళిత నేతగానే కాకుండా, గతంలో లోక్ సభలోనూ కాంగ్రెస్ నేతగా ఖర్గేకు అనుభవం ఉంది. రాహుల్ వర్గానికి చెందిన దిగ్విజయ్ సింగ్ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. అసమ్మతి నేతగా పేరుపొందిన ఆజాద్ ను తిరిగి రాజ్యసభ పంపొద్దని కాంగ్రెస్ భావిస్తోందన్న వార్తల నడుమ ఆ పార్టీలో ఆయన(ఆజాద్) పాత్రను మోదీ ఉటంకించడం గమనార్హం.
కేరళ నుంచి అవకాశమిస్తారా?
గులాం నబీ ఆజాద్ ను రాజ్యసభ సభ్యుడిగా కొనసాగించే విషయమై కాంగ్రెస్ హైకమాండ్ మల్లగుల్లాలు పడుతోన్న క్రమంలో ప్రధాని మోదీ వ్యాఖ్యల తర్వాత కొంత కదలిక వచ్చింది. ఆజాద్.. కేరళ నుంచి రాజ్యసభకు ఎంపికవుతారంటూ కొద్దిసేపటి కిందటే కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ రద్దయిపోయిన కారణంగా ఆజాద్ కు అక్కడ అవకాశం లేకపోవడంతో.. కేరళ నుంచి రాజ్యసభకు పంపడం ఒక్కటే కాంగ్రెస్ కు ఉన్న ఏకైక ఆప్షన్. కేరళలో కాంగ్రెస్ కు మొత్తం 3 రాజ్యసభ సీట్ల భర్తీకి అవకాశం ఉంది. మైనార్టీ వర్గానికి చెందిన ఆజాద్ ను కేరళ నుంచి రాజ్యసభకు పంపడం ద్వారా త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆ వర్గం ఓట్లను ప్రభావితం చేయొచ్చన్నది ఏఐసీసీ వర్గాల వాదన. కానీ కేరళ నేతలు మాత్రం ఇదే అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రయోగాలకు పోవొద్దని, అసమ్మతి తలెత్తకుండా ముందునుంచీ అనుకున్నవాళ్లకే రాజ్యసభ అవకాశం కల్పించాలని వాదిస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి..
పెద్దల సభలో జమ్మూకాశ్మీర్ అనాధ
ప్రస్తుతం రాజ్యసభలో కాంగ్రెస్ పక్ష నేతగా ఉన్న గులాం నబీ ఆజాద్.. తన సొంత రాష్ట్రమైన జమ్మూకాశ్మీర్ నుంచే పెద్దల సభకు ఎన్నికయ్యారు. అయితే, 2018 నవంబర్ నుచే జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ రద్దయిపోవడం, ఇప్పుడా భూభాగం.. రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా (1.అసెంబ్లీతో కూడిన జమ్మూకాశ్మీర్, 2.అసెంబ్లీ లేని లదాక్) విడిపోయిన దరిమిలా పెద్దల సభలో ఉన్న సీట్లన్నీ సస్పెండ్ అయిపోయాయి. రాజ్యసభలో జమ్మూకాశ్మీర్ తరఫున 4 సీట్లున్నాయి. అందులో ఫయాజ్ అహ్మద్ మీర్(పీడీపీ), నజీర్ అహ్మద్ లావే(పీడీపీ రెబల్) పదవీ కాలాలు ఈనెల 10తో ముగియనున్నాయి. ఇక గులాం నబీ ఆజాద్(కాంగ్రెస్), షంషేర్ సింగ్ మన్ హాస్(బీజేపీ)ల పదవీకాలాలు ఈనెల 15తో ముగుస్తాయి. ఈ నలుగురుగానీ, వీరిస్థానంలో ఇంకెవరైనాగానీ జమ్మూకాశ్మీర్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్య వహించే అవకాశం లేదు. మూడేళ్లుగా అసెంబ్లీ లేకపోవడంతో ఆ రాష్ట్రం తన ఎలక్టోరల్ ఓట్లను కోల్పోయింది. అసెంబ్లీతో కూడిన జమ్మూకాశ్మీర్ లో ఎన్నికలు జరిగేదాకా ఆ ప్రాంతం నుంచి రాజ్యసభలో ప్రతినిధులు ఉండరు. అదే లోక్ సభలో మాత్రం కాశ్మీర్ నుంచి నేషనల్ కాన్ఫరెన్స్ కు ముగ్గురు, బీజేపీకి ఇద్దరు ఎంపీలున్నాయి, లదాక్ యూటీ లోక్ సభ సభ్యుడు కూడా బీజేపీకి చెందినవారే.