రాజీనామాకు సిద్దమైన ఒక్క రోజు ఎంపీ: తాత కోసం మనుమడు త్యాగం, అన్నీ డ్రామాలు !
బెంగళూరు: నాటకీయ పరిణామాల నేపధ్యంలో కర్ణాటకలోని హాసన్ లోక్ సభ ఎంపీ (జేడీఎస్) తన పదవికి రాజీనామా చెయ్యడానికి సిద్దం అయ్యారు. లోక్ సభ ఎన్నికల ఫలితాలు ప్రకటించిన మరుసటి రోజే తన పదవికి రాజీనామా చేస్తున్నానని జేడీఎస్ ఎమ్మెల్యే ప్రజ్వల్ రేవణ్ణ మీడియాకు చెప్పారు. తాను ఎవరికి కోసం త్యాగం చెయ్యడం లేదని, తాన తాత, మాజీ ప్రధాని హెచ్.డి. దేవౌడ ఓడిపోవడంతో తాను కుంగిపోయానని జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ స్పష్టం చేశారు.
ఎవరి కోసం త్యాగం !
మనుమడు ప్రజ్వల్ రాజకీయ భవిష్యత్తు కోసం మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగదౌడ తన నియోజక వర్గం హాసన్ ను వదులుకున్నారు. హాసన్ ప్రజలు కోరుకోవడం వలనే తాను ఆ సీటు మనుమడు ప్రజ్వల్ రేవణ్ణకు విడిచిపెట్టానని మాజీ ప్రధాని దేవేగౌడ అన్నారు. హాసన్ వదులుకుని తుమకూరు నుంచి పోటీ చేసిన మాజీ ప్రధాని హెచ్.డీ. దేవేగౌడ ఓడిపోయారు. నిన్న మనుమడి కోసం తాత త్యాగం చెయ్యడంతో నేడు తాత కోసం మనుమడు త్యాగం చేస్తున్నారు.
ఫ్యామిలీ ఒత్తిడి ?
తన రాజీనామ విషయంపై తండ్రి హెచ్.డి. రేవణ్ణ, చిన్నాన సీఎం కుమారస్వామితో పాటు కుటుంబ సభ్యులు, పార్టీ పెద్దలతో ఇంత వరకు చర్చించలేదని ప్రజ్వల్ రేవణ్ణ అన్నారు. రాజీనామా చెయ్యాలని కుటుంబ సభ్యులు తన మీద ఒత్తిడి తీసుకురాలేదని ప్రజ్వల్ రేవణ్ణ చెప్పారు. జేడీఎస్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులతో చర్చించి అందరూ కలిసి మాజీ ప్రధాని దేవేగౌడ దగ్గరకు వెళ్లి హాసన్ నుంచి పోటీ చెయ్యాలని మనవి చేస్తామని ప్రజ్వల్ రేవణ్ణ అన్నారు.
జీవితమంటే పోరాటం
జీవితం అంటే పోరాటం అంటూ రాజకీయాల్లో ఉన్న మాజీ ప్రధాని దేవేగౌడ ఇంకా కొంత కాలం రాజకీయాల్లో కొనసాగాలని తాను రాజీనామా చెయ్యడానికి సిద్దం అయ్యానని ప్రజ్వల్ రేవణ్ణ అన్నారు. మాజీ ప్రధాని దేవేగౌడలో మరింత శక్తిని నింపడానికి హాసన్ నుంచి పోటీ చేయించాలని తాను నిర్ణయించానని ప్రజ్వల్ రేవణ్ణ చెప్పారు. ఈ విషయంలో హాసన్ ప్రజలు తప్పుగా అనుకోకూడదని, మళ్లీ దేవేగౌడను ఆదరించాలని జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ మనవి చేశారు.
త్యాగం కాదు గౌరవం
దేశానికి మాజీ ప్రధాని దేవేగౌడ సేవలు అసరం ఉందని, రైతుల కోసం పార్లమెంట్ లో ఆయన పోరాటం చెయ్యాలని, ఆ శక్తి ఆయనకు ఇంకా ఉందని ప్రజ్వల్ రేవణ్ణ అన్నారు. ఆయన కోసం తన పదవి వదులుకుంటానని ప్రజ్వల్ రేవణ్ణ అంటున్నారు. ఓటమి ఆకస్మికంగా ఎదురౌతుందని, దేవేగౌడ కేవలం 12 వేల ఓట్ల మెజారిటీతో ఓడిపోయారని, లోక్ సభ ఎన్నికల్లో అది పెద్ద విషయం కాదని ప్రజ్వల్ రేవణ్ణ అభిప్రాయం వ్యక్తం చేశారు.
డ్రామాలు ఆడుతున్నారు
హాసన్ లో పోటీ చేసిన ప్రజ్వల్ రేవణ్ణ నామినేషన్ పత్రాలు సమర్పించే సమయంతో తప్పుడు ఆస్తుల వివరాలు ఇచ్చారని ఆరోపణలు రావడంతో ఇప్పటికే విచారణ మొదలైయ్యింది. విచారణలో ప్రజ్వల్ రేవణ్ణ తప్పుడు ఆస్తుల వివరాలు ఇచ్చారని వెలుగు చూస్తే ఆయన ఎంపీగా అనర్హుడు అవుతారు. అంతకు ముందే రాజీనామా చేసే గౌరవంగా తప్పుకుంటే మర్యాదగా ఉంటుందని ప్రజ్వల్ రేవణ్ణ రాజీనామా నాటకాలు ఆడుతున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. హాసన్ ఎంపీ పదవికి రాజీనామా చేసి ఆ స్థానం నుంచి దేవేగౌడను పోటీ చేయించాలని ప్రజ్వల్ రేవణ్ణ నిర్ణయం తీసుకున్నారు.